ఆ విషయం జగన్ కు తెలియదు: సీఎం పదవికి సంతకాలపై మల్లు భట్టి సంచలనం
2009లో వైఎస్ఆర్ మరణించిన తర్వాత సీఎం పదవి కోసం సంతకాల సేకరణ విషయమై తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
: వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్ సీఎం అయితే బాగుంటుందని భావించాను. అందుకే తనతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, నేతలతో సంతకాలు చేయించినట్టుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
ఓ మీడియా సంస్థకు మల్లు భట్టి విక్రమార్క ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆయన వెల్లడించారు. తండ్రి శవం పక్కన పెట్టుకొని సీఎం పదవి కోసం జగన్ సంతకాలు చేయించారని ఆయనపై ప్రత్యర్ధులు విమర్శలు గుప్పించేవారు. అప్పట్లో జరిగిన ఘటనలపై భట్టి విక్రమార్క కీలక విషయాలను వెల్లడించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తాను అత్యంత ఇష్టపడుతానని భట్టి చెప్పారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలంటే తనకు ఎలాంటి ప్రేమ ఉందో... వైఎస్ఆర్ అంటే కూడ అంతే ప్రేమ ఉందన్నారు.పేదలకు ఉపయోగపడే ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ వంటి పథకాలను వైఎస్ఆర్ తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పేదలకు ఉపయోగపడే ఈ కార్యక్రమాలను వైఎస్ఆర్ తీసుకొచ్చారు. ఆయన అకాల మరణంతో తాను చాలా బాధపడ్డానని విక్రమార్క గుర్తు చేసుకొన్నారు.
ఈ పథకాలను కొనసాగించేందుకు వైఎస్ జగన్ సీఎం అయితే బాగుంటుందని తాను భావించినట్టుగా ఆయన చెప్పారు. ఈ విషయమై కొందరు ఎమ్మెల్యేలతో తాను మాట్లాడానని ఆయన గుర్తు చేసుకొన్నారు.వైఎస్ఆర్ కొడుకుగా ప్రజలు ఆయన పట్ల సానుకూలంగా ఉంటారని భావించి సంతకాలను సేకరించానని మల్లు గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం జగన్ ను ఆ పార్టీ నేతగానే చూశామని ఆయన చెప్పారు. జగన్ స్వంత పార్టీ పెట్టుకొన్న సమయంలో తామంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు.
దేశాన్ని కాంగ్రెస్ పార్టీ రక్షిస్తోందని... కాంగ్రెస్ పార్టీ లేకపోతే దేశం ప్రమాదంలో పడుతోందని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాటలు తనకు గుర్తుకు ఉన్నాయని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.2009లో ఎన్నికైన యువ ఎమ్మెల్యేలకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిక్షణ నిర్వహించారని ఆయన గుర్తుకు చేసుకొన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు కొనసాగాల్సిన ఆవశ్యకతను ఆయన గుర్తు చేసుకొన్నారు.
యువకుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీని తాను వ్యతిరేకించినట్టుగా వైఎస్ఆర్ చెప్పారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని గుర్తించి ... పార్టీ బలోపేతం కోసం పనిచేసినట్టుగా వైఎస్ఆర్ చెప్పాడని మల్లు చెప్పారు.
వైఎస్ఆర్ మృతదేహం ఉండగానే సీఎం పదవి కోసం సంతకాలు చేయించిన విషయం జగన్ కు తెలియదని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ విషయంతో ఆయనకు సంబంధమే లేదన్నారు.
జగన్ ను సీఎం చేయాలనేది కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల నిర్ణయమని ఆయన గుర్తు చేశారు.జగన్ ను సీఎం చేయాలని సంతకాలు చేయించిన కొందరం సోనియాగాంధీని కోరినట్టుగా చెప్పారు. అయితే జగన్ ను సీఎం చేయడం సాధ్యం కాలేదన్నారు. ఆ రోజున జగన్ ను సీఎం చేస్తే పరిస్థితులు బాగుండేవన్నారు. ఆయన కూడ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారని చెప్పారు.