నదీ జలాలు: కేసీఆర్, జగన్ మధ్య చిచ్చు పెట్టిన పోతిరెడ్డిపాడు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు మరోసారి తెరమీదికి వచ్చాయి. పోతిరెడ్డిపాడుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టు టెండర్లను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
నదీ జలాల వినియోగం విషయంంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వైఖరుల్లో మార్పులు కన్పిస్తున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోందా లేదా అనే చర్చ సాగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి ప్రధానంగా పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంపు (రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్) ప్రాజెక్టు కారణంగా కన్పిస్తోంది
ఏపీ రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. ఏపీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత జగన్ పలుమార్లు హైద్రాబాద్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు.విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం కేసీఆర్ జగన్ తో భేటీ అయ్యారు.
రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలు, నదీ జలాలు, సచివాలయ భవనాల అప్పగింత తదితర విషయాలపై కూడ రెండు రాష్ట్రాల సీఎంల మధ్య అంగీకారం కుదిరింది. ప్రస్తుతం కూల్చివేసిన సచివాలయ ప్రాంగంణంలో ఏపీకి కేటాయించిన భవనాలను జగన్ సర్కార్ కేసీఆర్ కు అప్పగించింది.
నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలు గతంలో చర్చించుకొన్నారు. 2019 సెప్టెంబర్ 23న హైద్రాబాద్ లో రెండు రాష్ట్రాల సీఎంలు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. రెండు రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా నీటిని ఎక్కడి నుండి తీసుకోవాలనే విషయమై ఇంజనీర్లు ప్రతిపాదించాలని సూచించారు.
అయితే ఈ విషయమై రెండు రాష్ట్రాల ఇంజనీర్లు కొన్ని ప్రాంతాలను పరిశీలించారు. కానీ ఈ విషయమై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరలేదు. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ కూడ హాజరయ్యారు.
ఇదిలా ఉంటే రాయలసీమకు నీటిని తరలించాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ఏడాది జనవరి 13వ తేదీన హైద్రాబాద్ లో తెలంగాణ , ఏపీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ లు చర్చించారు. అయితే ఈ ప్రాజెక్టుపై కూడ ఈ సమావేశంలో చర్చ జరిగింది.
అయితే ఈ ఏడాది మే మాసంలో ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం( రాయలసీమ ఎత్తిపోతల పథకం) ప్రాజెక్టు పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకొంది. ఈ ప్రాజెక్టును రూ. 7 వేల కోట్లతో చేపట్టాలని ప్రతిపాదించింది.
పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంచితే తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని కేసీఆర్ సర్కార్ వాదిస్తోంది. తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్ తో పాటు ఖమ్మం జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ జిల్లాల్లోని ప్రాజెక్టులపై కూడ ప్రభావం కన్పించనుంది.
శ్రీశైలం ప్రాజెక్టు నుండి 800 అడుగుల వద్ద నుండి కృష్ణా నదిలో తమకు కేటాయించిన నీటి వాటాను తెలంగాణ ఉపయోగించుకొంటుంది. అయితే ఏపీ ప్రభుత్వం కూడ 800 అడుగుల వద్ద నుండే కృష్ణా నదిలో తమకు కేటాయించిన నీటిని వాడుకొంటామని ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రతిపాదించింది.
ఈ ప్రాజెక్టు కోసం పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచాలని ప్రతిపాదించింది ఏపీ ప్రభుత్వం. వాస్తవానికి పోతిరెడ్డిపాడు నుండి 11,500 క్యూసెక్కుల నీటిని వాడుకోవాలి. అయితే ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న కాలంలో 11,500 క్యూసెక్కుల నుండి 40 వేల క్యూసెక్కులకు నీటిని వాడుకొనేలా 2005 సెప్టెంబర్ 13న 170జీవోను వైఎస్ఆర్ జారీ చేశారు. ఈ జీవోపై అప్పట్లో తెలంగాణలో పార్టీలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ ఈ విషయమై నిరసన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వాడుకొంటున్న 40 వేల క్యూసెక్కులను 80 వేల క్యూసెక్కులకు పెంచుతూ శ్రీశైలం నుండి 800 అడుగుల నుండి నీటిని వాడుకోవాలని ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. అదే జరిగితే శ్రీశైలం ప్రాజెక్టు నుండి చుక్క నీరు కూడ నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి చేరదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అదే జరిగితే సాగర్ ప్రాజెక్టు పరిధిలోని 25 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు మంచినీటి ప్రాజెక్టులపై కూడ ప్రభావం కన్పించనుంది.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.అయినా కూడ ఏపీ ప్రభుత్వం టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని కృష్ణా బోర్డు ఏపీని ఆదేశించింది. ఆగష్టు 5వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం వినతి మేరకు ఈ నెల 20వ తేదీ తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది.
ఇదిలా ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఆన్ లైన్ లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం కూడ ఫిర్యాదులు చేసింది.
నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల అధినేతల వైఖరుల్లో మార్పులు కన్పిస్తున్నాయి. దీంతోనే పరస్పరం ఫిర్యాదులు చేసుకొంటున్నారు. సుప్రీంకోర్టులో ఫిర్యాదులు చేసుకొంటున్నారు. నది జలాల విషయంలో ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో ఉండాలనే పరిస్థితి నుండి కోర్టులకు చేరుకొంది.