IMD Rain Alert : రోహిణి కార్తె ఎండల వేళ ఏమిటీ వానలు...? ఇక దబిడిదిబిడే..!
IMD Weather Alert : ఈ వేసవి ఎండలను డామినేట్ చేసేలా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒకచోట వాన పడుతూనే ఉంది. రాబోయే రోజుల్లో ఎండలతో పాటు వర్షాలు కూడా జోరందుకుంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు...
IMD Rain Alert : ప్రతి సంవత్సరం మే నెల వచ్చిందంటే చాలు మండుటెండలు తప్పవు. ''రోహిణి కార్తె ఎండలకు రోకలిబండలు కూడా పగులుతాయి'' అనేది నానుడి... దీన్నిబట్టే ఎండలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది... మే నెల ఎండలను వానలు డామినేట్ చేస్తున్నాయి. కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి... ఇప్పుడు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో వర్షాలకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. అంటే రాబోయే రోజుల్లో ఎండలే కాదు వానలు కూడా జోరందుకుంటాయని స్పష్టంగా అర్థమవుతోంది.

హైదరాబాద్ లో వర్షం...
ఇవాళ (మే 12, మంగళవారం) తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ (GHMC) పరిధిలో మరికొద్దిసేపట్లో వర్షం కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇక రాబోయే 24 గంటల్లో (మే 12,13) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Light rain/thundershowers likely occur in some parts GHMC area during next 1-2 hourvi99 pic.twitter.com/KClBJlsQB5
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) May 12, 2026
బంగాళాఖాతంలో అల్పపీడనం...
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అయితే అల్లూరి జిల్లాలోని జేకేవీధి, ముంచింగిపుట్టు, పెదబయ... పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, గుర్తేడు మండలాల్లో ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.
ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేటికీ అదే ప్రాంతంలో కొనసాగుతోందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతోనే ప్రస్తుతం ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని... దీని ప్రయాణాన్ని బట్టి వర్షాలు పెరుగుతాయో, తగ్గుతాయో తేలనుందని పేర్కొన్నారు.
వర్షాలతో పంటనష్టం...
వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలు చాలా ప్రమాదకరమైనవి. పిడుగులు, ఈదురుగాలులతో ప్రాణనష్టం కూడా జరుగుతుంది. ఇక వడగళ్ల వానలు, హటాత్తుగా మొదలయ్యే వర్షాలు పంటనష్టాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కూడా తెలుగు రైతులను నిండా ముంచుతున్నాయి... చేతికి వచ్చిన వరి, మొక్కజొన్న పంటను నాశనం చేస్తున్నాయి. కొందరు రైతులు పొలాల్లోనే పంట తడిసి నష్టపోతుంటే మరికొందురు కల్లాలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి నష్టపోతున్నారు.
ఈదురుగాలులు, వడగళ్ల వానలతో మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. మామిడి కాయలు నేలరాలడంతో పాడయిపోతున్నాయి. ఇక వడగళ్ల కారణంగా కాయ నాణ్యత దెబ్బతింటోంది. దీంతో సరైన ధర పలకక రైతు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అలాాగే గాలివానలకు చెట్లు విరిగిపోయి నష్టం వస్తుంది.

