హాట్ ఫేవరెట్లుగా టీమిండియా.. టీ20 ప్రపంచకప్ జట్టులో ఆ ఇద్దరు నో ఛాన్స్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపికపై చర్చ జోరుగా సాగుతోంది. నితీష్ కుమార్ రెడ్డిపై వేటు తప్పదని నిపుణులు భావిస్తుండగా, హర్షిత్ రాణాకు జట్టులో చోటు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. మరి ఆ వివరాలు ఏంటో తెలుసా.?

కేవలం మూడు నెలల సమయం
టీ20 ప్రపంచకప్నకు కేవలం మూడు నెలల సమయమే మిగిలి ఉంది. ఈ ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్లో భారత్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగబోతోంది. టీమిండియా ప్రస్తుతం పటిష్టంగా ఉన్నప్పటికీ, జట్టు కూర్పు, ప్లేయర్ల ఎంపికపై టీం మేనేజ్మెంట్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న రూమర్స్ ఆధారంగా ఓ ఇద్దరు ఆటగాళ్లపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
పేసర్ల కంటే స్పిన్నర్లకే ఎక్కువ అనుకూలం
భారత్లోని పిచ్లు పేసర్ల కంటే స్పిన్నర్లకే ఎక్కువగా అనుకూలిస్తాయనేది అందరి అభిప్రాయం. ఈ నేపథ్యంలో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై వేటు తప్పదనే చర్చ జరుగుతోంది. అయితే మరోవైపు హర్షిత్ రాణాను మాత్రం జట్టులోకి తీసుకోవచ్చని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 15 మందితో ఎంపిక చేసే జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తాడనడంలో సందేహం లేదు.
వైస్ కెప్టెన్గా శుభమన్ గిల్
వైస్ కెప్టెన్గా శుభమన్ గిల్ బరిలోకి దిగుతాడు. ఓపెనర్గా అభిషేక్ శర్మ ఎలాగూ జట్టులో ఉంటాడు. శుభమన్ గిల్, అభిషేక్ శర్మే భారత్ ఇన్నింగ్స్ను ఓపెన్ చేస్తారని, ఓపెనింగ్ జోడీలో ఎలాంటి మార్పులు ఉండవనే అంచనాలు ఉన్నాయి. తర్వాతి పొజిషన్స్లో మాత్రం మ్యాచ్ పరిస్థితులకు తగినట్టుగా ప్లేయర్లను మార్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వికెట్ కీపర్ స్థానానికి సంబంధించి తీవ్ర పోటీ నెలకొంది. ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా సంజూ శాంసన్ బరిలో దిగుతాడా లేదంటే జితేష్ శర్మ ఆడతాడా అనేది ఆసక్తి రేపుతోంది.
హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఖాయం
పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇవ్వడం ఖాయమేనని భావిస్తున్నారు. పాండ్యాతో జట్టుకు బ్యాలెన్స్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరో పేస్ ఆల్రౌండర్గా శివమ్ దూబే జట్టులో ఉంటాడు. ఫినిషర్గా రింకూ సింగ్ స్థానానికి ఎలాంటి డోకా లేనట్టే. ఫస్ట్ ఛాయిస్ స్పిన్ ఆల్ రౌండర్గా అక్షర్ పటేల్ కీలకం కాబోతున్నాడు.
ఆ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు
స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఎలాగూ ఉంటారు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ప్రధాన ఆయుధాలుగా ఉండబోతున్నారు. మొత్తంగా, ప్రపంచకప్ జట్టుపై సెలెక్టర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారన్న చర్చ ఎక్కువగా నడుస్తోంది.