టీమిండియాకి అతడే లక్కీ భాస్కర్.. కొడితే ప్రపంచకప్ ఇక మన చేతిలోనే..
World Cup: టీ20ల్లో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ తిరుగులేని ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతని సారథ్యంలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. 78.12 విజయాల శాతంతో సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు లక్కీ కెప్టెన్గా మారాడు.

సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీ రేస్లోకి..
టీ20 క్రికెట్లో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. టీమిండియాకు లక్కీ కెప్టెన్గా మారి వరుస విజయాలతో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్లో కెప్టెన్గా ఎవరు బెస్ట్ అనే చర్చ సాగినప్పుడు, హార్దిక్ పాండ్యా పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, జింబాబ్వేతో జరిగిన సిరీస్కు సీనియర్లు దూరంగా ఉండగా, శుభ్మన్ గిల్ యువజట్టును నడిపించాడు. ఆ తర్వాత భారత్కు కొత్త హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టారు. గంభీర్ వ్యూహాత్మకంగా సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీ రేస్లోకి తీసుకువచ్చారు.
శ్రీలంకపై పూర్తిస్థాయి కెప్టెన్గా
సూర్యకుమార్ యాదవ్ పూర్తిస్థాయి కెప్టెన్గా శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్తో బరిలోకి దిగాడు. గంభీర్-సూర్యకుమార్ యాదవ్ కాంబినేషన్ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. శ్రీలంకతో సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. 2023 వన్డే ప్రపంచకప్ ఓటమి తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లోనూ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ సిరీస్ను టీమిండియా 4-1తో సాధించి, వన్డే ప్రపంచ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
ఆసియా కప్లోనూ భారత్ను ఛాంపియన్గా..
స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్ను కూడా భారత్ 4-1తో గెలుచుకుంది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ను సూర్య కెప్టెన్సీలోని జట్టు లెవెల్ చేసింది. బంగ్లాదేశ్పై సిరీస్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలోనూ టీమిండియా సత్తా చాటింది. 2-1తో సిరీస్ గెలిచింది. అంతేకాకుండా, ఆసియా కప్లోనూ భారత్ను ఛాంపియన్గా నిలబెట్టాడు సూర్యకుమార్ యాదవ్.
టీ20 ప్రపంచకప్లోనూ కొనసాగితే..
ఇదే విజయ పరంపర టీ20 ప్రపంచకప్లోనూ కొనసాగితే టీమిండియాదే విజయం అని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్లో చాలా బలంగా ఉంది. ప్రత్యర్థులు ఎవరైనా టాప్ క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. హోమ్ అడ్వాంటేజ్తో టీ20 ప్రపంచ కప్లోనూ భారత్ సత్తా చాటుతుందని అంచనాలున్నాయి. స్పిన్, పేస్, బ్యాటింగ్ ఇలా ఏ విభాగంలో చూసినా సూర్యకుమార్ యాదవ్ సేన బలంగా ఉందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే, సరైన కాంబినేషన్ను టీం మేనేజ్మెంట్ ఎంచుకోవాలని, తుది జట్టుపై ఎటువంటి గందరగోళం ఉండకూడదని వారు సూచిస్తున్నారు. కెప్టెన్గా రికార్డులు బాగున్నా, ప్లేయర్గా సూర్య కూడా బ్యాట్తో చెలరేగితే అతని ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
విజయాల శాతం 78.12..
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. ఇందులో 25 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల్లో ఓడిపోయింది. రెండు మ్యాచ్లు టై అయ్యాయి. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ సాధించిన విజయాల శాతం 78.12గా ఉంది. దేశవాళీ టీ20ల్లో కెప్టెన్గా ముంబైని 16 మ్యాచ్ల్లో నడిపించాడు. అందులో 10 విజయాలు, ఆరు పరాజయాలు ఉన్నాయి. ఐపీఎల్లో రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలిచాడు. రంజీలో ముంబైని ఆరు మ్యాచ్ల్లో నడిపించి ఒక విజయం, రెండు పరాజయాలు, మూడు డ్రాలను నమోదు చేశాడు.