IPL సందడి వేళ వైజాగ్లో ఘోరం.. రన్ అవుట్ వివాదంతో అంపైర్ దారుణ హత్య
Visakhapatnam: విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్లో విషాదం చోటుచేసుకుంది. రన్ అవుట్ వివాదం నేపథ్యంలో 21 ఏళ్ల యంగ్ అంపైర్ అజిత్ బాబు దారుణ హత్యకు గురయ్యారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

రన్ అవుట్ వివాదం.. అంపైర్ను కత్తితో పొడిచి చంపిన దుండగుడు
దేశమంతా ఐపీఎల్ 2026 సందడిలో మునిగిపోయి ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో క్రికెట్ మైదానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న రన్ అవుట్ వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కేవలం 21 ఏళ్ల వయసున్న స్థానిక అంపైర్ డోలా అజిత్ బాబును ఓ ఉన్మాది కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా చంపేశాడు. క్రీడా స్ఫూర్తితో సాగాల్సిన ఆటలో రక్తపాతం చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రన్ అవుట్ కాల్తో మొదలైన వివాదం
విశాఖపట్నంలో ఆదివారం సాయంత్రం మూడు స్థానిక జట్లతో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ మ్యాచ్కు డోలా అజిత్ బాబు తన స్నేహితుడు బుడుమూరి చిరంజీవితో కలిసి అంపైరింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న సమయంలో ఒక రన్ అవుట్ విషయంలో రెండు ప్రాంతాల ఆటగాళ్లు గొడవ పడ్డారు. అంపైర్ అజిత్ బాబు ఇచ్చిన నిర్ణయంపై కొందరు ఆటగాళ్లు, ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పెద్దలు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించారు. దీంతో మ్యాచ్ యధావిధిగా ముగిసింది.
పక్కా ప్లాన్తో అంపైర్పై దాడి
మ్యాచ్ ముగిసిన తర్వాత అంతా ప్రశాంతంగా ఉందని అందరూ భావించారు. కానీ, ప్రేక్షకుల్లో ఉన్న కాంత కిషోర్ (26) అనే యువకుడు మనసులో పగ పెంచుకున్నాడు. అంపైర్లు ఇచ్చిన నిర్ణయం పట్ల ఆగ్రహంతో ఉన్న కిషోర్, వివాదాన్ని పరిష్కరించుకుందాం రమ్మని అంపైర్లను సమీపంలోని ఒక జంక్షన్ వద్దకు పిలిపించాడు. అజిత్ బాబు, చిరంజీవి అక్కడికి చేరుకోగానే, కిషోర్ వారితో మళ్లీ వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో నిందితుడు తీవ్రంగా లిక్కర్ సేవించి ఉన్నట్లు సమాచారం. గొడవ పెద్దది కావడంతో కిషోర్ తన వద్ద దాచుకున్న కత్తిని తీసి అజిత్ బాబు ఛాతిలో బలంగా పొడిచాడు.
ప్రాణాలు కాపాడే ప్రయత్నం విఫలం
తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన అజిత్ బాబును కాపాడేందుకు అతని స్నేహితుడు చిరంజీవి, మరో యువకుడు ప్రయత్నించారు. ఆ సమయంలో నిందితుడు వారిపై కూడా దాడి చేయడంతో చిరంజీవికి గాయాలయ్యాయి. వెంటనే అజిత్ బాబును స్థానికులు దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే లోపే అజిత్ బాబు ప్రాణాలు కోల్పోయాడు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. కేవలం ఒక రన్ అవుట్ విషయంలో ఇంతటి ఘోరానికి పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
నిందితుడి కోసం పోలీసుల వేట
మృతుడి తండ్రి డోలా అప్పలరాజు ఫిర్యాదు మేరకు విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు కాంత కిషోర్ మ్యాచ్ జరుగుతున్న సమయం నుండే అంపైర్లను అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యేనని వారు వాపోతున్నారు. పోలీసులు ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత కింద హత్య కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న కాంత కిషోర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. గాయపడిన మరో అంపైర్ చిరంజీవి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

