Sriramanavami Special: శ్రీరామనవమి రోజు చేసే స్పెషల్ ప్రసాదాల గురించి తెలుసా?
Sriramanavami Special: శ్రీరామనవమి రోజు చేసే స్పెషల్ ప్రసాదాల గురించి తెలుసా? అవి ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, దాని వెనుక దాగిన రహస్యాలను ఇప్పుడు చూద్దాం.

శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలు
శ్రీరామనవమి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది..రాములోరి తలంబ్రాలు, ఆ సీతారాముల కల్యాణం. అయితే ఈ పండుగకు ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యానికి కూడా ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. చైత్ర మాసంలో వచ్చే ఈ పండుగ వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. చైత్రమాసం అంటే ఎండాకాలం కాబట్టి...ఈ సీజన్లో వచ్చే శ్రీరామనవమి రోజున ప్రసాదాలు కేవలం రుచి కోసం మాత్రమే కాదు, శరీరానికి ఉపశమనాన్ని ఇచ్చే మంచి అద్భుతమైన ఔషధాలు కూడా. అదెలా అంటే...
శ్రీరామనవమి రోజు కచ్చితంగా ప్రతీ ఇంట్లో ఈ ప్రత్యేక ప్రసాదాలు ఉంటాయి. అవి వడపప్పు, పానకం . వాటివల్ల శరీరానికి కలిగే లాభాలు బోలెడున్నాయి.
పానకం
ఈరోజు చేసే పానకం దైవప్రసాదం, ఆరోగ్య అమృతం. శ్రీరాముడికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం పానకం. ఇది కేవలం ప్రసాదం మాత్రమే కాదు వేసవి నుంచి వచ్చే తాపాన్ని తట్టుకోవడానికి మన పూర్వీకులు అందించిన దివ్యౌషధం. బెల్లం ముక్కలను నీటిలో కరిగించి, అందులో మిరియాల పొడి, యాలకుల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం కలిపి దీనిని తయారు చేస్తారు.
బెల్లంలో ఉండే ఐరన్ శరీరానికి శక్తి. ఎండల వల్ల వచ్చే నీరసాన్ని పోగొడుతుంది. మిరియాలు, యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. చైత్ర మాసంలో వాతావరణ మార్పుల వల్ల వచ్చే గొంతు సమస్యలను మిరియాల పొడి నివారిస్తుంది. చూశారా ఒక్క పానకం వల్లే ఎన్ని లాభాలో...
వడపప్పు
వడపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పు. ఇది శరీరానికి చలువ చేస్తుంది. వడపప్పు లేకుండా శ్రీరామనవమి ప్రసాదం పూర్తే కాదు. నానబెట్టిన పెసరపప్పులో కొందరు బెల్లం, పంచదార వేసుకుంటారు. మరికొందరు పెసరపప్పును కడిగి 2 గంటల పాటు నానబెట్టి, ఆ నీటిని వడకట్టి, అందులో ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, తురిమిన మామిడికాయ వేసి తయారు చేస్తారు. పెసరపప్పు శరీరానికి విపరీతమైన చలువను ఇస్తుంది. ఎండలో తిరిగే వారికి ఈ ప్రసాదం తీసుకోవడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం తగ్గుతుంది.
చలివిడి
కొన్ని ప్రాంతాల్లో వడపప్పు, పానకంతో పాటు చలివిడిని కూడా ప్రసాదంగా పెడతారు. బియ్యపు పిండి, బెల్లం కలిపి చేసే ఈ పదార్థం కూడా శరీరానికి చలువ చేస్తుంది.
వసంత కాలం ముగిసి గ్రీష్మ రుతువు ప్రారంభమయ్యే సమయంలో ఈ పండుగ వస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మన పూర్వీకులు పండుగ పేరుతో శరీరానికి కావాల్సిన చలువను, శక్తిని ఇచ్చే పదార్థాలను ప్రసాదాలుగా నిర్ణయించారు. బెల్లం, మిరియాలు, పెసరపప్పు వంటివి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

