కోడిరక్తాన్ని వాడి.. వ్యాపారవేత్తపై తప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు.. రూ.3 కోట్లు దోపిడీ.. చివరికి...
కోడి రక్తాన్ని ఉపయోగించి 64 ఏళ్ల వ్యాపారవేత్తపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ..ఆమె సహచరులపై తప్పుడు ఆరోపణలు చేశారని ముంబై పోలీసులు కేసు ఛార్జిషీట్లో తెలిపారు.
ముంబై : కోడి రక్తాన్ని ఉపయోగించి 64 ఏళ్ల వ్యాపారవేత్తపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫేక్ రేప్ ఆరోపణలు చేసిందో మహిళ. అలా అతడిని బ్లాక్ మెయిల్ చేస్తూ అతని నుండి రూ. 3.26 కోట్లు దోపిడీ చేసింది. 2021 నాటి ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు గత వారం చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ముఠాలో మహిళ పేరు మోనికా భగవాన్ అలియాస్ దేవ్ చౌదరి, ఆమె సహచరులు అనిల్ చౌదరి అలియాస్ ఆకాష్, లుబ్నా వజీర్ అలియాస్ సప్నా, ఫ్యాషన్ డిజైనర్, మనీష్ సోడి అనే నగల వ్యాపారిలు ఉన్నారు.
2021లో మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన ఓ వ్యాపారి మోనికా, ఆమె సహచరులు తనను ట్రాప్ చేసి రూ.3.26 కోట్లు దోపిడీ చేశారని సహార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు 2019లో అతనిపై లైంగిక వేధింపుల కేసు పెడతామని రికార్డ్ చేసిన ఓ వీడియోతో బెదిరించారు. ఆ వీడియోను వాడుకుని రెండేళ్ల పాటు అతడి నుంచి డబ్బులు దండుకున్నారు.
అతను చెప్పిన వివరాల ప్రకారం, 64 ఏళ్ల వ్యాపారవేత్త 2016లో గోవాలో అనిల్ చౌదరి అనే వ్యక్తిని కలుసుకున్నాడు. అక్కడ వారు ఒకరి ఫోన్ నంబర్లు మరొకరు మార్చుకున్నారు. అప్పటినుంచి వారు సన్నిహితంగా ఉండేవారు. 2018లో అనిల్ అతన్ని ఫ్యాషన్ డిజైనర్ అయిన లుబ్నా వజీర్కి పరిచయం చేశాడు.
మార్చి 2019లో, వ్యాపారవేత్త ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్లో బస చేశారు. ఈ సమయంలో సప్నా, మోనికా తమతోపాటు పార్టీలో పాల్గొంటారని చౌదరి వ్యాపారవేత్తను అడిగాడు. దానికి అతను అంగీకరించాడు. అలా సప్నా, మోనికా హోటల్కు చేరుకుని బాధితుడిని అతని గదిలో కలిశారు.
కొద్దిసేపటి తర్వాత, హోటల్ లాబీలో ఎవరికో కొన్ని పేపర్స్ ఇవ్వాలంటూ సప్నా గది నుండి వెళ్లిపోయింది. అదే సమయంలో, మోనికా హోటల్ గది వాష్రూమ్లోకి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత, ఎవరో గది డోర్బెల్ మోగించారు. ఆ సమయంలో వ్యాపారవేత్త తలుపు తెరిచాడు. బెల్ కొట్టిన స్వప్న డోర్ తెరవగానే.. సప్నా తన ఫోన్లో రికార్డర్ ఆన్ చేసి అరవడం, వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించింది.
అదే సమయానికి బాత్రూంలోనుంచి బైటికి వచ్చి బెడ్ మీద వివస్త్రగా పడుకొని ఉంది మోనికా. మోనికాపై బాధితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని సప్నా ఆరోపించింది. మోనికా బట్టలు, ఆమె కప్పుకున్న బెడ్షీట్ పై కూడా రక్తపు మరకలు ఉన్నాయని వారు ఆరోపించారు. ఇదంతా మోనిక మీద బాదితుడి లైంగిక వేధింపుల ఫలితమని వారు చెప్పారు.
దీంతో భయపడిన ఆ వ్యాపారి అనిల్కు ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. ఆ తర్వాత వచ్చిన అనిల్, ఆ మొత్తం ఇవ్వకుంటే అతడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. ముగ్గురూ కలిసి అతడి నుంచి రూ.10 కోట్లు డిమాండ్ చేశారు.
చివరకు రూ.75 లక్షలకు సెటిల్ చేసుకున్నారు. ఆ తరువాత రెండేళ్ల వ్యవధిలో బాధితుడి నుంచి రూ.3.26 కోట్లు దోపిడీ చేశారు. అదే ఏడాది అక్టోబర్లో నిందితులు బాధితుడిని అపహరించి రూ.27వేలు, రూ.లక్ష విలువైన బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీ ఇలా కొనసాగుతుండడం.. నిరంతర దోపిడీ, బ్లాక్మెయిల్తో విసిగిపోయిన బాధితుడు.. నవంబర్ 17, 2021న సహర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులకోసం వల వేసి దోపిడీ సొమ్మును తీసుకుంటున్న సప్న, అనిల్లను అదుపులోకి తీసుకున్నారు. అయినా, మోనికా తప్పించుకుంది. ఆమెను ఆ తరువాత జూన్ 2022లో అరెస్టు అయ్యింది. నిందితుల ముఠా ఇలా అనేక మంది బాధితులను బ్లాక్ మెయిల్ చేసి దోపిడీకి పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.
తమ బాధితుల్లో కొందరిపై తప్పుడు కేసులు కూడా పెట్టారు. సోదాల్లో నిందితుల నుంచి రూ.49.35 లక్షలను కూడా దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడిని ఇరికించేందుకు కోడి రక్తాన్ని వాడినట్లు తేలింది.