పిచ్చిప్రేమ : తన ప్రియుడితో ప్రేమలో పడిందని.. యువతిపై కత్తితో దాడి..
తన ప్రియుడితో ప్రేమలో పడిందని ఓ మహిళ మరో యువతిపై కత్తితో దాడి చేసింది. దీంతో మెడమీదగాయంతో ఆమె ఆస్పత్రి పాలయ్యింది.
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రియుడిపై పిచ్చి ప్రేమ ఓ యువతిని నేరస్తురాలిగా చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఓ యువతిని మరో యువతి హత్య చేసేలా ప్రోత్సహించింది. మధ్యప్రదేశ్లోని చింద్వారాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
చింద్వారాలోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఓ యువతి తనతోపాటు పనిచేస్తున్న యువకుడిని ప్రేమించింది. అతను కూడా ఆమెతో ప్రేమలో పడ్డాడు. అదే సమయంలో రెస్టారెంట్లో మరో యువతి ఉద్యోగంలో చేరింది. ఇక్కడే కథ ట్విస్ట్ తిరిగింది.
సదరు యువకుడితో కొత్తగా వచ్చిన యువతి సన్నిహితంగా తిరగడం మొదలుపెట్టింది. ఇది ఆమెకు నచ్చలేదు. ప్రియుడు కూడా ఆమెతో క్లోజ్ గా ఉండడంతో తట్టుకోలేకపోయింది. ఎలాగైనా ఆ అమ్మాయి అడ్డు తొలగించుకోవాలనుకుంది. తన రూమ్ కి ఆ అమ్మాయిని పిలిచింది. మాట్లాడుకుందాం అని పిలిచి అదును చూసి ఆ అమ్మాయి మెడలో కత్తితో పొడిచేసింది.
అయితే, వెంటనే తేరుకున్న అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి ఆసుపత్రిలో చేరడంతో.. ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి క్షేమంగా ఉంది. నిందితురాలు పారిపోయిందని, ఆమె గురించి వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. చింద్వారాలోని దేహాత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రంగ్లా పంజాబ్ అనే రెస్టారెంట్లో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇందులో ఆదర్శనగర్ కు చెందిన ఆశిష్, శివాని సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు. అంతేకాదు వీరిద్దరూ ప్రేమికులు కూడా. ఆ తర్వాత కొద్ది రోజులకి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రీనా అనే అమ్మాయి రెస్టారెంట్లో పనికి చేరింది. కొత్తగా వచ్చిన రీనాతో ఆశిష్ క్లోజ్ గా ఉండడం మొదలుపెట్టాడు.
శివానిని వదిలేసి రీనాతో తిరుగుతుండేవాడు. అంతేకాదు వారిద్దరి మధ్య దూరం కూడా బాగా పెరిగిపోయింది. ఎంతదాకా అంటే శివాని మొబైల్ నెంబర్ ను ఆశిష్ బ్లాక్ లిస్టులో పెట్టాడు. దీంతో రెచ్చిపోయిన శివాని రీనాను అడ్డు తొలగించుకోవాలనుకుంది. రీనాతో మంచిగా ఉన్నట్టు మాట్లాడి తన గదికి రావాల్సిందిగా కోరింది.
అలా రీనా ఆదర్శనగర్ లో ఉన్న శివాని రూమ్ కు వచ్చింది. వచ్చిన కాసేపటికి శివాని, రీనా మొబైల్ లాక్కుంది. ఆమె వాట్సప్ చెక్ చేసింది. రీనా, ఆశీష్ ల మధ్య జరిగిన ప్రేమ పూరక చాటింగ్ అంతా చదివింది. దీంతో శివాని కోపం నషాళానికి అంటింది. రీనా మొబైల్ ను నేలకేసి కొట్టింది. దీంతో ఇద్దరూ గొడవపడ్డారు.
ఇదే అదనుగా శివాని వెజిటేబుల్ కట్టర్ తో రీనాపై దాడి చేసింది. దీంతో ఆమె గొంతుకు గాయమయ్యింది. వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్న రీనా ఆరోగ్య మల్టీకేర్ హాస్పిటల్కు చేరుకుంది. అక్కడ తన మీద శివాని దాడి చేసిన ఘటన చెప్పి చికిత్స తీసుకుంది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు కేసు నమోదు చేసుకున్నారు. దాడి చేసిన శివాని పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారు. శివాని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. దీనితో పోలీసులు శివాని కోసం గాలింపు చేపట్టారు.