ఉత్తర ప్రదేశ్ లో దారుణం.. నవవధువు గొంతు కోసి, యాసిడ్ పోసిన తండ్రి, బంధువులు...
పెళ్లైన రెండు రోజులకే కూతురిని అత్తింటినుంచి తీసుకొచ్చి.. గొంతుకోసి, యాసిడ్ పోసి హత్యాయత్నం చేశారు పుట్టింటివాళ్లు. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది.

బరేలీ : ఢిల్లీ-లక్నో హైవేపై దాదాపు 40% కాలిన గాయాలతో, కొత్తగా పెళ్లయిన 25 ఏళ్ల మహిళ నగ్నంగా కనిపించింది. విషయం తెలియడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత కొన్ని గంటల్లోనే ఆమెమీద యాసిడ్ దాడి చేసి.. హత్య చేయడానికి ప్రయత్నించిన ఆమె తండ్రి తోతారామ్ సింగ్, బావ దినేష్ కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు.
"కుటుంబ గౌరవం" కోసం. ఈ నేరానికి సహకరించిన మరో ఇద్దరు కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నారు.
"ఆమె ఇంకా తన స్టేట్మెంట్ను ఇచ్చే స్థితిలో లేదు, కానీ మొదటికంటే ఆమె పరిస్థితి కాస్త మెరుగుపడింది" అని అదనపు ఎస్పీ రాజ్కుమార్ అగర్వాల్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధిత మహిళ తన పక్కింటి వ్యక్తి అజయ్ కుమార్ను ప్రేమించింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు.
వీరిద్దరి ప్రేమ వివాహం కుటుంబ సభ్యులకు నచ్చ లేదు. దీంతో ఏప్రిల్ 22న ఆమెకు దేవేంద్ర కుమార్ అనే మరో వ్యక్తితో వివాహం జరిపించారు. పెళ్లి అయిన మరుసటి రోజే ఆమె తన తండ్రికి ఫోన్ చేసి ప్రియుడితో కలిసి జీవించాలనుకుంటున్నట్లు చెప్పింది.
దీంతో షాక్ అయిన ఆమె తండ్రి.. ఆమె సోదరుడు, బావ, మరో బంధువుతో కలిసి ఆమె అత్తగారింటికి వచ్చాడు. అక్కడినుంచి బాధితురాలిని తీసుకుని తిరిగి ఇంటికి బయల్దేరారు. ఆమె ప్రవర్తన వల్ల తమ పరువుపోతుందని.. చంపాలని నిర్ణయించుకున్నారు.
మార్గమధ్యలో “తన బైక్ను హైవే పక్కన ఆపాడు. కూతురిని దిగమని చెప్పి.. ఆ తరువాత కుమార్తెను గొంతు కోశాడు. టాయిలెట్ క్లీనర్గా ఉపయోగించే యాసిడ్ బాటిల్ కొనుక్కురమ్మని కొడుకుకు చెప్పాడు. తెచ్చిన తరువాత.. దానిని ఆమె గొంతుపైన, శరీరంపై పోశాడు.
ఆ తర్వాత ఆమె చనిపోయిందని భావించి పొదల్లో పారేసి, వెళ్లిపోయారు. అదృష్టవశాత్తూ, ఆ మహిళ బతికే ఉంది. ఎలాగో ప్రయత్నించి పొదల్లోంచి బైటికి వచ్చింది. మరుసటి రోజు ఉదయం ఆ దారినుండి వెడుతున్న కొంతమంది ఆమెను చూశారు”అని అగర్వాల్ చెప్పారు.
పోలీసులు మాట్లాడుతూ.. “మేము తోతారామ్ను కలిసి.. మీ కూతురు రోడ్డు మీద ఇలాంటి స్థితిలో దొరికింది అని చెబితే మమ్మల్ని బుకాయించాడు. తన కుమార్తెకు వివాహం అయిందని, ఆమె అత్తమామలతో, భర్తతో కలిసి ఉంటుందని చెప్పాడు. అతనికి ఫోటో చూపిస్తే 'ఆమె నా కూతురు కాదు' అని చెప్పాడు.
కానీ, మా దర్యాప్తులో ఒక రెస్టారెంట్లో మహిళ తన తండ్రి, బావ, మరో ఇద్దరు బంధువులతో కలిసి భోజనం చేస్తున్నట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.. అని పోలీసులు తెలిపారు.