విజయ్ దివస్ : కార్గిల్ వీరులకు వందనం.. తాశి నామ్గ్యాల్ తో బయటపడ్డ పాక్ కుట్ర... !
పశువులు తినేందుకు పచ్చగా కూడా కనిపించనంతగా హిమాలయాలపై మంచుదుప్పటి పేరుకుపోయింది. తమ గొర్రెలను మేపేందుకు పర్వత లోయలో కి వెళ్ళాడు తాశి నామ్గ్యాల్. జనసంచారం ఉండని ఆ ప్రాంతంలో పఠాన్ దుస్తుల్లో కొందరు వ్యక్తులు రాళ్లతో మంచులో ఏదో పని చేస్తుండడం కనిపించింది. జాగ్రత్తగా గమనిస్తే వారి దుస్తుల్లో ఆయుధాలు కనిపించాయి.
దాయాది దేశం పాకిస్థాన్ కన్ను ఎప్పుడూ కాశ్మీర్ మీదే. ఏదో వంకతో స్థానిక యువతను రెచ్చగొడుతూ దేశంలో అలజడి సృష్టిస్తూనే ఉంది. అలాంటి ప్రయత్నమే 1999లో కూడా చేసింది. అయితే ఈసారి ఉగ్రవాదులతో పాక్ ఆర్మీ చేతులు కలిపింది. సహజ నిబంధనలు ఉల్లంఘించి నియంత్రణ రేఖను దాటి వచ్చి మన ఆర్మీ పై దాడికి తెగబడింది. ఇండియన్ ఆర్మీ ధీటుగా స్పందించింది ఆపరేషన్ విజయ్ తో పాటు బుద్ధి చెప్పింది.
పశువులు తినేందుకు పచ్చగా కూడా కనిపించనంతగా హిమాలయాలపై మంచుదుప్పటి పేరుకుపోయింది. తమ గొర్రెలను మేపేందుకు పర్వత లోయలో కి వెళ్ళాడు తాశి నామ్గ్యాల్. జనసంచారం ఉండని ఆ ప్రాంతంలో పఠాన్ దుస్తుల్లో కొందరు వ్యక్తులు రాళ్లతో మంచులో ఏదో పని చేస్తుండడం కనిపించింది. జాగ్రత్తగా గమనిస్తే వారి దుస్తుల్లో ఆయుధాలు కనిపించాయి.
క్షణం ఆలస్యం చేయలేదు తాశి నామ్గ్యాల్. వెంటనే భారత ఆర్మీ కి విషయం చేరవేశాడు. ఆరోజు 1999 మే 2. తాశి నామ్గ్యాల్ ఇచ్చిన సమాచారంతో పర్వతాల్లో కి వెళ్లిన ఇండియన్ ఆర్మీ ట్రూప్ పై అనుమానిత వ్యక్తులు దాడి చేశారు. ఐదుగురు భారత సైనికులను పట్టుకొని చంపేశారు. ఊహించని విధంగా జరిగిన దాడిలో భారత ఆర్మీ మొదట తీవ్రంగా నష్టపోయింది. పాక్ దళాల సాయంతో టెర్రరిస్టులు చేసిన దాడిలో కార్గిల్ ఆయుధాగారం ధ్వంసమైంది.
మన ఆర్మీ తేరుకునేలోపే ద్రాస్, కక్సర్, ముస్తో సెక్టార్లలో శత్రువులు తిష్ట వేశారనే సమాచారం అందింది. దొంగచాటుగా పాక్ ఆర్మీ కొండలపైకి చేరుకుని బంకర్లు నిర్మించుకోవడంతో ఈ పోరాటంలో తొలుత భారత సైనికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పై నుంచి పాక్ సైనికులు, టెర్రరిస్టులు తేలికగా దాడి చేస్తూ తూటాలు బాంబుల వర్షం కురిపిస్తుండగా వాటిని కాచుకుంటూ మన సైనికులు వీరోచితంగా పోరాటం చేయాల్సి వచ్చింది. దీంతో 26న వాయుసేన ను రంగంలోకి దించింది ఇండియా ప్రభుత్వం. మొదటి వారంలోనే రెండు మిగ్ విమానాలు, ఒక ఆర్మీ హెలికాప్టర్లను మన ఆర్మీ నష్టపోయింది.
రోజులు గడుస్తున్నా రణక్షేత్రం లో భారత దళాలకు పట్టు దొరకడం లేదు. దాడి చేస్తున్నది పాకిస్తాన్ అని తెలిసినా సరైన ఆధారాలు లభించడం లేదు. జూన్ 5వ తేదీన ముగ్గురు పాక్ సైనికులు భారత భద్రతా దళాలకు చిక్కారు. దీంతో ఈ దాడిలో పాకిస్థాన్ హస్తం ఉందని స్పష్టంగా తేలిపోయింది. అప్పటివరకు కార్గిల్లో స్థానికులు సైన్యంపై తిరుగుబాటు చేస్తున్నారంటూ చెబుతూ వచ్చిన పాక్ నోటికి తాళం పడింది.
పొరుగు దేశం కుట్రలు బయటపడడంతో భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి రెడీ అయింది. పాక్ ఆర్మీ, టెర్రరిస్టుల అధీనం లోకి వెళ్ళిన భూభాగాలను తిరిగి దక్కించుకునేందుకు ఆపరేషన్ విజయ్ ని ప్రకటించింది. కార్గిల్ చొరబాటు లో కీలకమైన ప్రాంతం టైగర్ హిల్స్. వాటిపై తిష్టవేసిన పాక్ దళాలు భౌగోళిక పరిస్థితులు ఆసరాగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. భారత దళాలు జూన్ 29న టైగర్ హిల్స్ పర్వత పాదాల వద్దకు చేరుకున్నాయి. యుద్ధంలో కీలక ఘట్టం మొదలైంది.
వారం రోజుల పాటు హోరాహోరి పోరు జరిగింది. జూలై నాలుగవ తేదీన కీలకమైన టైగర్ హిల్స్ ని భారత్ స్వాధీనం చేసుకుంది. దీంతో పాక్ ఆర్మీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. తెలుగువాడైన మేజర్ పద్మఫణి ఆచార్య ఈ యుద్ధ క్షేత్రంలోనే నేలకొరిగారు. టైగర్ హిల్స్ చేజిక్కిన తర్వాత భారత దళాలకు ఎదురే లేకుండా పోయింది. నియంత్రణ రేఖను దాటి చొరబాటుదారులు ఆక్రమించుకున్న స్థలాలను వేగంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే ఇటు రణక్షేత్రం, అటు అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ఏకాకిగా నిలిచింది. ముషారఫ్ కుట్రలు, కుతంత్రాలు పారలేదు. అతని అండతో అతిక్రమణలకు పాల్పడిన ఆర్మీ, టెర్రరిస్టులు తోక ముడిచారు. జూలై 14 నాటికి అన్ని శత్రు మూకలను తరిమి కొట్టారు. పాక్ తో చర్చల అనంతరం జూలై 26న అధికారికంగా యుద్ధాన్ని ముగిసినట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది.
పాకిస్తాన్లో ప్రధానులు ఎక్కువగా కీలుబొమ్మలే అయ్యారు. ఆర్మీ అధికారులే నిజమైన అధికారం చెలాయించారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి చెప్పకుండా అప్పటి ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ కశ్మీర్పై కుయుక్తి పన్నాడు. దొంగచాటుగా భారత భూభాగంలోకి తన సైన్యాన్ని పంపించాడు. హిమాలయాల్లో దట్టంగా మంచు పేరుకుపోయే కాలంలో పర్వతశ్రేణుల నుంచి ఇరు దేశాల భద్రతాదళాలు వెనక్కి వస్తాయి. చాన్నాళ్లుగా ఇదే పద్ధతి అమలవుతుంది. అయితే దీన్ని తుంగలో తొక్కి భారత దళాలు గస్తీలో లేని సమయం చూసి ముషారఫ్ ఆదేశాలతో పాక్ ఆర్మీతో కూడిన టెర్రరిస్టు మూకలు పాక్ గుండా భారత భూభాగంలోకి అడుగుపెట్టి కీలక స్థావరాలను ఆక్రమించుకున్నారు. ఫలితంగా యుద్ధం అనివార్యం అయింది.
దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో భారత్ వైపు 527 మంది జవాన్లు అమరులయ్యారు. పాకిస్తాన్ వైపు 453 మంది వరకు చనిపోయినట్లు సమాచారం. ఈ చొరబాట్లలో పాకిస్తాన్ కి చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, నార్తర్న్ లైట్ఇన్ఫాంట్రీ చెందిన సైనికులు పాల్గొన్నట్లు తేలింది. వీరికి కాశ్మీర్ తీవ్రవాదులు, ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన కిరాయి మూకలు సహకరించినట్లు తేలింది.
కార్గిల్ విజయ దినోత్సవాన్ని ప్రతి ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని హోదాలో నరేంద్రమోడీ పాల్గొని అమర జవాన్లకు నివాళులు అర్పిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ప్రజలు సైతం సైనికుల త్యాగాలకు గుర్తుగా కాండిల్స్ వెలిగించి నివాళులు అర్పించడం రివాజు.