అప్పుడు స్పానిష్ ఫ్లూ, ఇప్పుడు కోవిడ్ స్ట్రెయిన్.. వందేళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. !
కరోనా వైరస్ లో జన్యు మార్పులు, కరోనా స్ట్రెయిన్.. కొత్తరకం కరోనా ఇప్పుడు ప్రపంచదేశాల్ని వణికిస్తున్నాయి. వీటికి మూలకేంద్రం బ్రిటన్ కావడంతో బ్రిటన్ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. అందుకే బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై అన్ని దేశాలు నిషేధం విధిస్తున్నాయి.
కరోనా వైరస్ లో జన్యు మార్పులు, కరోనా స్ట్రెయిన్.. కొత్తరకం కరోనా ఇప్పుడు ప్రపంచదేశాల్ని వణికిస్తున్నాయి. వీటికి మూలకేంద్రం బ్రిటన్ కావడంతో బ్రిటన్ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. అందుకే బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై అన్ని దేశాలు నిషేధం విధిస్తున్నాయి.
ఇప్పటికే బ్రిటన్ పొరుగుదేశాలు సరిహద్దులను మూసేశాయి. అయితే ఇలాంటి సంఘటనే ఇదే బ్రిటన్ కేంద్రంగా వందేళ్ల కిందట జరిగింది. అది కూడా వైరసే కావడం.. ప్రపంచవ్యాప్తంగా మూడుకోట్ల మంది దీనికి బలి కావడంతో ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి తలెత్తుతుందా అనే అనుమానంతో ప్రజలు వణికిపోతున్నారు.
బ్రిటన్లో వందేళ్ల కిందట కోరలు చాచిన వైరస్ ‘స్పానిష్ ఫ్లూ’. ఇప్పుడు తాజాగా కొత్త కరోనా వైరస్ బ్రిటన్ లో విజృంభిస్తున్న నేపథ్యంలో చరిత్రకారులు, శాస్త్రవేత్తలు దీన్ని గుర్తుచేసుకుంటున్నారు.
మొదటి ప్రపంచ యుద్ధం దాదాపు ముగిసిన తరువాత యూరప్ నుంచి సైనికులు వారివారి దేశాలకు వెనుదిరిగారు. లండన్కు 190 మైళ్ల దూరంలో ఉన్న పోర్ట్ సిటీ ప్లై మౌత్ నుంచి 1918 సెప్టెంబర్లో అమెరికాలోని బోస్టన్కు, ఫ్రాన్స్లోని బ్రెస్ట్కు, పశ్చిమ ఆఫ్రికాలోని ఫ్రీటౌన్కు మూడు సైనిక నౌకలు వెళ్లాయి.
ఇక్కడి నుంచి వెళ్లిన సైనికులు ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యం పాలై మృత్యువాత పడ్డారు. ఆ తరువాత ఇది ఇతర దేశాలకూ పాకింది.
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1918 మార్చిలో అమెరికాలో స్పానిష్ ఫ్లూ మొదటి కేసు నమోదైంది. అక్కడినుంచి యూరప్ వెళ్లిన సైన్యంలో ఈ లక్షణాలు ఎక్కువగా వెలుగు చూశాయి.
ఈ లక్షణాలకు సంబంధించిన అసలేంటి అనే పూర్తి వివరాలను స్పెయిన్ వెల్లడించటంతో ఫ్లూ లక్షణాలకు ‘స్పానిష్ ఫ్లూ’ అని పేరు వచ్చింది.
యుద్ధానంతరం సైనికులు యూరప్ నుండి స్పానిష్ ఫ్లూను తమ దేశాలకు మోసుకెళ్లారు. ఆ తర్వాత ఆ వైరస్ పూర్తి పరివర్తనతో విజృంభించింది. దాన్నే సెకండ్ వేవ్ అన్నారు. 1918 మార్చిలోనే అమెరికాలో తొలికేసు నమోదు కాగా అక్కడ కేవలం 189 మందే చనిపోయారు.
కానీ.. యూరప్ నుంచి తిరిగి వచ్చిన సైనికులతో సెప్టెంబర్లో ప్రబలిన సెకండ్ వేవ్ మారణహోమాన్ని సృష్టించింది. ఒక్క అక్టోబర్లోనే అమెరికాలో 1.95 లక్షల మంది చనిపోయినట్లు నమోదైంది.
ఇక మనదేశంలో యూరప్ నుంచి సైనికులతో జూన్లో ముంబైకి మొదటి నౌక వచ్చింది. వారితోనే స్పానిష్ ఫ్లూ మన దేశంలోకి అడుగుపెట్టింది.
ఆ తరువాత అదే అదే ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో ముంబైలో ఒక్కసారిగా వ్యాధి ప్రబలింది. బ్రిటన్ నుంచి బోస్టన్ వెళ్లిన సైనికుల్లో కనిపించిన లక్షణాలే మన దేశంలోనూ కనిపించాయి
అంటే మనదేశంలోకి వచ్చింది జన్యుమార్పిడి చెందిన కొత్త వైరస్ అన్నమాట. అది అక్టోబర్ మధ్యలో చెన్నైలో విజృంభించింది. ఆ తర్వాత నవంబర్లో కోల్కతాను అతలాకుతలం చేసింది. నెల రోజుల వ్యవధిలోనే దేశమంతా వ్యాపించింది. ఆ సమయంలో మొత్తంగా కోటిన్నర మంది మృత్యువాత పడ్డారు.
ఇప్పుడు కరోనా స్ట్రెయిన్ కూడా స్పానిష్ ఫ్లూ లాగే విజృంభిస్తోంది. అయితే కోవిడ్ మాత్రం తొలి వేవ్లోనే విజృంభించింది. రెండో వేవ్తో పెద్ద ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీంతో బ్రిటన్లో ప్రబలుతున్న కొత్త రకం కరోనా మనపై ఎంత ప్రభావం చూపుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.