రేపే సూర్య గ్రహణం: ఏం చేయాలి, ఏం చేయకూడదు
సూర్యునికి, భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అమావాస్య నాడు సూర్యుడు ,చంద్రుడు ఒకే డిగ్రీపై మనకు కనిపిస్తుంటారు. ఇంకా ఆ సమయంలో ఆ పరిసర ప్రదేశంలో రాహువు గాని ,కేతువుగాని ఉంటాడు. పౌర్ణిమ ,అమావాస్యలు ఎన్నోసార్లు వచ్చినప్పటికిని రాహు ,కేతువులు ఉన్న స్థానంలో మాత్రమే ఈ గ్రహణాలు ఏర్పడతాయి.
సూర్యునికి, భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అమావాస్య నాడు సూర్యుడు ,చంద్రుడు ఒకే డిగ్రీపై మనకు కనిపిస్తుంటారు. ఇంకా ఆ సమయంలో ఆ పరిసర ప్రదేశంలో రాహువు గాని ,కేతువుగాని ఉంటాడు. పౌర్ణిమ ,అమావాస్యలు ఎన్నోసార్లు వచ్చినప్పటికిని రాహు ,కేతువులు ఉన్న స్థానంలో మాత్రమే ఈ గ్రహణాలు ఏర్పడతాయి. గ్రహణాలు ఏర్పడే సమయంలో భూమిపై సూర్యకాంతి పడకుండా చంద్రుడు అడ్డుగా వస్తాడు. సంపూర్ణ సూర్యగ్రహణంలో సూర్యబింబం పూర్తిగా కనిపించకుండా చంద్రుడు అడ్డుగా వస్తాడు. అదే పాక్షిక సూర్య గ్రహణం సమయంలో సూర్యునిలో చంద్రుడు కొంత భాగమే అడ్డుగా వస్తాడు. సూర్య గ్రహణం అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా కనిపించదు. గ్రహణాలు ఏర్పడడానికి సాహిత్యంలో వేరు వేరు కధనాలు ఉన్నాయి.
26 డిసెంబర్ 2019 గురువారం రోజు మూలా నక్షత్రం ధనుస్సురాశి, మకర, కుంభ లగ్నాలలో కేతుగ్రస్త కంకణ ఆకార సూర్య గ్రహణం సంభవిస్తున్నది. ఈ గ్రహణ సమయాలు పరిశీలిస్తే భారత కాలమానం ప్రకారం స్పర్శ కాలం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. మధ్యకాలం ఉదయం 9 : 31 నిమిషములకు, మోక్ష కాలం ఉదయం 11 : 21 నిమిషములకు అవుతుంది. ఖగోళంలో ఈ గ్రహణం 3 గంటల 26 నిమిషాల పాటు సంభవించును. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది.
గ్రహణం ధనుస్సురాశిలో సంభవిస్తుంది. ధనుస్సురాశి వారికి జన్మరాశిలో ఏర్పడుతుంది. వృషభరాశి వారికి అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది, కన్యారాశి వారికి అర్ధాష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ మూడు రాశుల వారు గ్రహణాన్ని చూడకూడదు. అంటే గ్రహణ సమయంలో ఏర్పడే చెడు కిరణాలకు దూరంగా ఉండటం మంచిది, మిగతా రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం అంత పెద్దగా ఉండదు. ఇక్కడ గ్రహణ ప్రభావం అంటే అనుకూల ఫలితాలు లేకుండా ఉండడం తప్ప ఏదో చెడు జరుగుతుంది మరేదో కీడు సంభవిస్తుందని భయపడాల్సిన అవసరం లేదు.
గ్రహణం సమయంలో నెగటివ్ రేస్ భూమిపై ప్రభావం చూపిస్తాయి, అందు వలన రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి త్వరగా అనారోగ్యం వస్తుంది, అలాగే ఆ సమయంలో తిన్న ఆహారం జీర్ణించుకునే శక్తి శరీరానికి ఉండదు. స్పేస్ నుండి నిత్యం కాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. గ్రహణం సమయంలో మాత్రం రాదు, బాక్టీరియా ఎక్కువ ఉంటుంది. నెగటివ్ రేస్ గుడిలో మూలా విరాట్ క్రింద ఉండే యంత్రాన్ని తాకకూడదు అని గుడినే మూసేస్తారు. గ్రహణ సమయంలో గురు ఉపదేశం ఉన్నవారు గురువు ఇచ్చిన మూల మంత్రం, జపం చేస్తే వారికి ఆ నెగటివ్ ఎనర్జీ ప్రభావం సోకదు, మననం చేసే వారిని కాపాడేది మంత్రం అన్నారు. గ్రహణం సమయంలో గుడి తలుపులు మూసి ఉన్నప్పటికీ గ్రహణం ఉన్నంత సేపు ఏర్పడిన నెగటివ్ పవర్ తోగించుట కొరకు శాస్త్రోక్తంగా గుడిలో ప్రతి అంగుళం శుద్ధి చేస్తారు, అలాగే మన శరీరాలు కూడ గ్రహణ ప్రభావంతో నెగటివ్ బాక్టీరియా హాని చేయకూడదని స్నానం చేయాలనీ శాస్త్రాలు తెలియజేసాయి.
గ్రహణం - దర్భలు :- గ్రహణ సమయంలో దర్బకు నెగటివ్ పవర్ ని దూరం చేసే గుణం ఉంది. నిల్వ ఉంచుకునే ఆహార పదార్ధాలపై దర్బలు వేయడం వలన ఆహారం పదార్ధాలకు నెగటివ్ బాక్టీరియా సోకకుండా రక్షణగా నిలుస్తుంది. గ్రహణం తర్వాత దర్భలను తీసి పడవేయాలి. దర్భల మీద 1982-83 ప్రాంతంలో భారతదేశంలో సూర్య గ్రహణం రోజు శాస్త్రవేత్తలు పరిశోధన చేసారు. గరిక అనేది గడ్డి జాతికి చెందినది. అది నిటారుగా పైకి నిలబడి సూర్య రశ్మి ద్వారా మొత్తం సూర్య శక్తిని గ్రహించి తనలో దాచి ఉంచుకుంటుంది.అతినీలలోహిత కిరణాలను గ్రహణ సమయంలో భూమిపైకి వచ్చే హానికరమైన కిరణాలను తన శక్తితో అడ్డుకుంటుందని పరిశోధనలో తేలింది. ఆ పరిశోధన ఫలితాలను అన్ని ప్రధాన దిన పత్రికలలో ప్రచురించడం జరిగింది.
ఆధునిక కాలంలో పరిశోధనలో తేల్చడం వలన మనకు విశ్వాసం కలుగుతుందేమో కానీ తప:శక్తి సంపన్నులైన మన ఋషులు ఏనాడో తెలియజేసారు. మన పురాణ హితిహాసాలలో కుడా గ్రహణ ప్రభావ ఫలితాలు కనబడుతున్నాయి. ఉదాహరణకు శ్రీ కృష్ణుడు గ్రహణాన్ని చూడటం వలన శమంతక మణిని దొంగిలించాడని నింద మోసాడు, ఇలాంటి సాక్షాలు పురాణాలలో మనకు చాలా తారసపడతాయి. అందుకే మన పూర్వీకులు గ్రహణ సమయంలో నిల్వ ఉంచుకునే ఆహార పదార్ధాలు విషపూరితం కావద్దని దర్భలను ఆహార పదార్థాలపై ధాన్యాలపై వేయడం జరిగింది ఆ సాంప్రదాయం నేటికి కొనసాగుతూ వస్తుంది.
గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలు కలిగి ఉన్నది, అందుకే గ్రహణం సమయంలో ఇంట్లో అన్ని పాత్రలపై నీటి ట్యాంకులపై గారిక పోచలు వేయడం వలన రేడియేషన్ ప్రభావాన్ని తప్పించుకోగలము. సృష్టి తీరులో చర్యకు ప్రతిచర్యకు ఉంటుంది. ఏది జరిగినా దాని ప్రభావం ఏదో ఒక రూపంలో తప్పక వెల్లడి అవుతుంది. ఫలితం అనేది అప్పుడే చూపక పోయినా కొంత ఆలస్యంగానైన తప్పక చూపుతుంది.
గ్రహణం పట్టె సమయానికి ముందు, విడిచిన తర్వాత పట్టు విడుపు స్నానం చేయాలి, మంత్ర ఉపదేశం ఉన్న వాళ్ళు జపం చేయడం అధిక ఫలితం ఉంటుంది, మంత్రోపదేశం లేని వారు కుల దేవత నామ స్మరణ చేయడం మంచిది. అనారోగ్యంతో ఉన్న వారు తినకుండా ఉండలేరు కనుక గ్రహణం పట్టక ముందే తినడం మంచిది, ఆరోగ్యంగా ఉన్న వారు గ్రహణానికి రెండు గంటల ముందు నుండి ఆహారం తీసుకోకూడదు. తిన్న ఆహరం గ్రహణం పట్టే సరికి తిన్న ఆహరం సగమైన జీర్ణం కావలి. గ్రహణం విడిచాక తల స్నానం చేసాకే ఇల్లు, దేవుళ్ళను శుభ్రం చేసి దీపం పెట్టుకుని కొత్తగా వంట చేసుకుని తినాలి.
సూర్య గ్రహణం సందర్భంగా ద్వాదశ వారికి పంచాంగ ఫలితాలు :- *ఈ గ్రహణాన్ని మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు ధనస్సు రాశివారు చూడరాదు.* కుంభరాశి, వృషభరాశి, కన్యరాశి, తులరాశులు, లగ్నం వారికి శుభప్రదం. * మకరరాశి, మేషరాశి, మిధునరాశి, సింహరాశులు, లగ్నం వారికి మధ్యమ ఫలములను ఇస్తుంది. * ధనస్సురాశి, మీనరాశి, కర్కాటకరాశి, వృశ్చికరాశులు, లగ్నం వారికి అరిష్టం ( అశుభ ఫలితాలు ఉంటాయి )
గర్భిని స్త్రీలు :- గ్రహణ సమయంలో జాగ్రత్తలు. వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకని గర్భిణీ స్త్రీలపై ఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్రాలలో చెప్పడం జరిగింది. గర్భవతులు తన శిశువు "పిండం" కడుపులో ఎదుగుతున్న సమయం వారి శరీరానికి ఎలాంటి నెగటివ్ పవర్ ని తట్టుకునే శక్తి ఉండదు. గ్రహణ సమయంలో రోగ నిరోధక శక్తి గర్బములో ఉన్న బిడ్డ కోల్పోతారు అందుకే ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తుంది అని వారిని పెద్దలు బయటకు వెళ్ళనివ్వరు. గ్రహణ సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోవడమే మంచిది. గ్రహణం సమయంలో చేసే దైవ స్మరణ, జపం అనేక రెట్ల శుభ ఫలితాలను ఇస్తాయి.
గ్రహణం పట్టిన నక్షత్రాలలో ముహూర్తాలు:- గ్రహణం పడిన నక్షత్రంలో ఆరు నెలలు శాస్త్ర రిత్య ముహూర్తాలు నిషేధిస్తారు. ప్రస్తుత సూర్యగ్రహణం మూల నక్షత్రం, ధనుస్సురాశిలో ఏర్పడుతుంది.
పితృ తర్పణాలు :- ఎవరి ఇంట్లో అయిన అదే రోజు ఆబ్ధిక తిధులు వస్తే తప్పక ఆ రోజు మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత చేయ వచ్చును. ఈ రోజు చేస్తే పిత్రుదోషాలు కుడా నివారణ జరుగుతాయి.
గ్రహణ శూల ప్రయాణాలు :- గ్రహణం పట్టిన మరుసటిరోజు ముఖ్యమైనవి, దూర ప్రయాణాలు చేయకూడదు.
అయ్యప్ప స్వాములకు సూచన :- మీ సన్నిధానంలో గ్రహణం కారణంగా 25 వ తేదీ సాయత్రం 7.00 గంటల వరకు పూజలు ముగించుకుని రాత్రి 8 :00 వరకు అల్పాహారం చేసుకోవలెను. పూజ వస్తువులపై దర్భ వేసి ఉంచవలెను. 26 ఉదయం పూజాదికాలు ఉండవు. ఉదయం 8:00 గంటలకు పట్టు స్నానం చేసి జపాలు చేసుకోవలెను. 11:20 తర్వాత తర్వాత మళ్లీ స్నానం చేసి ఇల్లు, సన్నిధానము శుభ్రం చేసుకుని పూజ నిర్వహించి తర్వాత భిక్ష స్వీకరించవలెను.
గ్రహాణ దోష పరిహార ప్రక్రియ కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజులైన శాస్త్ర పండితులను సంప్రదించి మీ వ్యక్తిగత జాతక ఆధారంగా నడుస్తున్న దశ, అంతర్ధశ, గోచార గ్రహస్థితి ఆధారంగా ఏమైనా దోషం ఉంటే తెలుసుకుని వారిచ్చే సూచనల మేరకు పరిహార జప, దానాదులను చేసుకోవాలి. నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే కుష్మాండ పూజ చేయించి ఇంటికి , వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి .
గ్రహణ దానాలు:- గ్రహణం తర్వాత మరుసటి రోజు కేవలం గ్రహణ దోషం ఉన్నవారే కాకుండా పన్నెండు రాశుల వారు గ్రహణ దోష నివారణ కొరకు గోధుమలు, ఉలవలు కిలోంపావు చొప్పున తీసుకుని వాటిని నీళ్ళలో నానబెట్టి మరుసటిరోజు నీళ్ళను వడగట్టిన తరవాత వాటికి చిక్కగా బెల్లాన్ని పట్టించి ఆవునకు అరటిఆకులో కాని ,మోదుగ, తామర ఆకులతో కుట్టిన విస్తరిఆకులో మాత్రమే దాన పెట్టాలి. గోమాత మీరు పెట్టిన గ్రాసం తింటున్నప్పుడు మూడు ప్రదక్షిణలు చేయాలి, ఈ విధంగా భక్తీ శ్రద్దలతో ఎవరైతే చేస్తారో వారికి దైవానుగ్రహం కలుగుతుంది జై శ్రీమన్నారాయణ .
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151