నందమూరి హీరో సినిమా అంత దారుణమా? జీరో కలెక్షన్లా?.. ఇదేం ట్రోలింగ్ రా బాబు..
నందమూరి ఫ్యామిలీ హీరోలకు భారీగా ఫ్యాన్ బేస్ ఉంది. హీరో ఎవరైనా, సినిమా ఎలా ఉన్నా వాళ్లు చూస్తారు, ఆదరిస్తారు. కానీ తాజాగా నందమూరి హీరో సినిమా మాత్రం జీరో కలెక్షన్లు అంటూ ట్రోల్ నడుస్తుంది.

ఎన్టీఆర్ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, హరికృష్ణ హీరోలుగా మారారు. ఆ తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్నలు సైతం హీరోలుగా మెప్పించారు. అయితే తారకరత్న ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో కూడా ఉన్నాడు. నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్యకృష్ణ కూడా ఉన్నారు. ఆయన 20ఏళ్ల క్రితమే `ధమ్` అనే చిత్రంలో హీరోగా నటించారు. ఒకటి రెండు సినిమాల్లో మెరిశాడు.
కానీ ఏమైందో ఏంటో గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇటీవల `బ్రీత్` అనే సినిమాతో వచ్చాడు. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ రీ లాంఛ్ అయ్యారు. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ కోసం బసవతారక రామ క్రియేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. డిసెంబర్ 2న విడుదలైంది. అయితే సినిమా ఇప్పుడు ట్రోల్కి గురవుతుంది. సోషల్ మీడియాలో సినిమాని దారుణంగా ఆడుకుంటున్నారు నెటిజన్లు.
ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఈ మూవీ 123కోట్లు కలెక్ట్ చేసిందంటూ రచ్చ చేస్తున్నారు. వంద కోట్ల ఓపెనింగ్స్ అంటున్నారు. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. అయితే ఇదంతా పెద్ద ట్రోలింగ్ కావడం విశేషం. ఈ మూవీ జీరో కలెక్షన్లు, జీరో షేర్ అని అంటున్నారు. నందమూరి హీరోలకు సంబంధించిన అత్యంత చెత్త మూవీగా వర్ణిస్తున్నారు. ఆయన అద్భుతమైన యాక్టింగ్ని నిదర్శనమని సెటైర్లు పేలుస్తున్నారు.
దాదాపు రూ. నాలుగు కోట్లతో `బ్రీత్` చిత్రాన్ని నిర్మించారు. మంచి కథ దొరకడంతో ఈ మూవీని చేసినట్టు ఇంటర్వ్యూలో చైతన్య కృష్ణ తెలిపారు. సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. వరుసగా ఇంటర్వ్యూలిచ్చారు. తన ఫ్యామిలీకి సంబంధించిన అనేక విషయాలను బయటపెట్టాడు. దీంతో కొన్ని రోజులపాటు ట్రెండింగ్లోకి వచ్చాడు చైతన్య కృష్ణ. దీంతో సినిమాకి బాగానే ప్రమోషన్ జరిగింది.
కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక అది పూర్తిగా తేడా కొట్టింది. కనీసం సినిమాని అభిమానులు కూడా చూడలేదని అంటున్నారు. జీరో షేర్ అంటే సినిమాని అభిమానులు కూడా పట్టించుకోలేదని తెలుస్తుంది. ఇండస్ట్రీలో అంత పెద్ద ఫ్యాన్స్ బేస్ ఉన్న నందమూరి ఫ్యామిలీ హీరో సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా చాలా బాధాకరం. ఈ సినిమాని థియేటర్ల రెంట్ కట్టి ఆడించారట. అసలే బడ్జెట్ బొక్క, పైగా థియేటర్ల రెంట్ ఇంకా పెద్ద బొక్కగా మారిందని అంటున్నారు. అయితే `యానిమల్` ప్రభావంలో ఈ మూవీ కొట్టుకుపోయిందని చెప్పొచ్చు. ఇందులో నిజమెంతో కానీ, నందమూరి హీరో సినిమాలపై ఇంతటి దారుణంగా ట్రోల్ జరగడం అత్యంత విచారకరం.
నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ బేస్ ఇప్పుడు విడిపోయింది. నందమూరి బాలయ్య వర్గం, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వర్గంలా తయారైంది. టీడీపీలో కొంత మంది బాలయ్యకి, మరికొంత మంది తారక్ ఫ్యామిలీకి షిఫ్ట్ అయ్యారు. గత కొన్నిరోజులుగా ఈ రెండు వర్గాల ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతూనే ఉంది. అంతేకాదు ఇటీవల కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, వచ్చే ఏపీ ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ అనేది తాము ఆలోచించి, చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే వాళ్లు `టీడీపీ`తో లేరనే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తుంది. ఈ రెండింటి మధ్య చైతన్యకృష్ణ కొట్టుకుపోయాడని తెలుస్తుంది. కానీ ఒక నందమూరి హీరో సినిమాకి ఇలా జరగడం విచారకరం.