తెలుగు సినిమా అద్భుత కళాఖండం.. వెండితెర ప్రభంజనం `శంకరాభరణం`కి 41ఏళ్లు..
కళాతపస్వి కె.విశ్వనాథ్, సోమయాజులు, స్వరబ్రహ్మ కె.విమహదేవన్ కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైన కళాఖండం `శంకరాభరణం`. మామూలు ఆర్టిస్టు అయిన సోమయాజులుని స్టార్ని చేసిన చిత్రమిది. మూస ధోరణిలో వెళ్తున్న తెలుగు సినిమాకి పాత్ బ్రేకింగ్ చిత్రంగా, టాలీవుడ్ని కొత్త పుంతలు తొక్కించిన చిత్రంగా నిలిచిన ఈసినిమా విడుదలై నేటికి(2-2-1980)కి 41ఏళ్లు.
తెలుగు సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ `శంకరాభరణం`. కళాతపస్వి మెదడులోని ఆలోచనలకు తెరరూపం ఈ చిత్రం. వెరసి సంచలన విజయం సాధించింది.
ఈ సినిమా విడుదలైన వారం రోజులపాటు అంతగా మెప్పించలేదు. థియేటర్ లో జనం సగం కూడా నిండని పరిస్థితి. ఓ థియేటర్లో కేవలం నలుగురే ప్రేక్షకులు. కానీ వారం తర్వాత పబ్లిక్ టాక్తో దూసుకుపోయింది. టాలీవుడ్ రికార్డ్లను తిరగరాసింది. రికార్డ్ విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి నాలుగు జాతీయ అవార్డులు వరించాయి. ఐదు నంది అవార్డులు సొంతం చేసుకుందీ సినిమా.
కమర్షియల్ సినిమాల జోరుకి బ్రేక్లు వేసిన సినిమా ఇది. వాణిజ్య సినిమాలకు అలవాటు పడ్డ ఆడియెన్స్ టేస్ట్ ని మార్చిన చిత్రమిది. కొత్త రుచిని చూపించిందనే చెప్పాలి. మొదటి థియేటర్లో జనం లేరనే టాక్ నుంచి వారం రోజుల్లోనే ప్రభంజనం సృష్టించింది.
మరోవైపు ఇందులో సోమయాజులు ప్రధాన పాత్రలో నటించారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయనే హీరో. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్బాబు వంటి స్టార్స్ రాజ్యమేలుతున్న సమయంలో కేవలం ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోగా నటించిన ఈసినిమా సంచలన విజయం సాధించడం గొప్ప విషయం.
సంగీతం ఈ సినిమాకి గుండెకాయ. ఇంకా చెప్పాలంటే సంగీతమే ఈ సినిమాకి ప్రాణం. శాస్త్రీయ సంగీతం కింద వెస్ట్రన్ సంగీతం కూడా దిగదుడుపే అని చాటిన చిత్రమిది. కళాతపస్వి అద్భుతమైన టేస్ట్ కి, స్వర బ్రహ్మ కె.వి. మహదేవన్ అద్బుతమైన సంగీతం తోడైతే అది `శంకరాభరణం` సినిమా అని చెప్పొచ్చు.
సంగీతం ఈ సినిమాకు ప్రాణం. కె.వి. మహదేవన్ ప్రాణం పెట్టి ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాకు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం బెస్ట్ సింగర్గా తొలి సారి జాతీయ అవార్డు అందుకున్నాడు. వాణి జయరాంకు ఉత్తమ గాయకురాలిగా, కె.వి.మహదేవన్కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు దక్కాయి.
అద్భుతమైన సినిమాని అందించిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకి మరో జాతీయ అవార్డు దక్కింది. స్వర్ణ కమలం అవార్డ్ అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే.
ఇందులోని పాటలు `శంకరా.. నాదశరీరాపరా..`, `సామజ వరగమన..`, `ఓంకార నాదాను.. `, `దొరకునా ఇటువంటి సేవ.. `, `రాగం తానం పల్లవి`.. `ఏ తీరుగ నను.. `, `మానస సంచరరే.. `వంటి పాటలు ఎవర్గ్రీన్గా నిలిచాయి. ఇప్పటికీ ఈ పాటలు శ్రోతలను ఒలలాడిస్తుంటాయి.
ఈ సినిమా ఘన విజయంలో కథ ఎంత కీలకమో శంకరశాస్త్రి గా చేసిన జేవీ సోమయాజులు నటన కూడా మరో కీలకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తులసి, మంజుభార్గవి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్, నిర్మలమ్మల నటన ఈ సినిమాని ఓ కళాఖండంగా మార్చాయి. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు.