`మర్డర్`పై క్లారిటీ.. కేసు నమోదు చేయటంపై వర్మ రియాక్షన్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం మర్డర్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య ప్రణయ్ మర్డర్కు సంబంధించిన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ సినిమాకు కుటుంబ కథా చిత్రమ్ అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చాడు వర్మ.
రామ్ గోపాల్ వర్మ ప్రణయ్ హత్య కేసు నేపథ్యంలో మర్డర్ సినిమా ప్రకటించిన దగ్గర నుంచే వివాదం మొదలైంది. మొదట అమృత వర్మపై ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ వార్తలు రావటంతో వర్మ స్పందించాడు.
తాను యదార్థ సంఘటనల ఆధారంగా మాత్రమే సినిమాను తెరకెక్కిస్తున్నా అని సినిమాలో ఎవరినీ ప్రత్యేకంగా నెగెటివ్గా చూపించటం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంతేకాదు మరిన్ని పోస్టర్లను రిలీజ్ చేశాడు. కొద్ది రోజులుగా సైలెంట్గానే ఉన్న మరోసారి ఈ సినిమా వివాదం తెర మీదకు వచ్చింది. తాజాగా ప్రణయ్ తండ్రి, అమృత ప్రణయ్ మామ బాలస్వామి మీద కంప్లయింట్ ఇచ్చాడు.
వర్మ తీయ బోయే సినిమా కారణంగా తన కొడుకు హత్య కేసు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఈ మేరకు వర్మపై చర్చలు తీసుకోవాలని నల్లగొండ ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన న్యాయస్థానం వర్మ మీద కేసు నమోదు చేయాల్సిందిగా మిర్యాలగూడ పోలీసులను ఆదేశించింది.
అయితే ఈ ఇష్యూపై రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పందించాడు. `నా మర్డర్ సినిమాపై కేను నమోదైనందున మరోసారి క్లారిటీ ఇస్తున్నా. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది తప్ప, వాస్తవం కాదు. అంతేకాదు ఈ సినిమాలో ఏ ఒక్క కులానికి సంబంధించినా ప్రస్థావనా ఉండబోదు` అంటూ క్లారిటీ ఇచ్చాడు.
`సినిమా గురించి తెలుసుకోకుండా కేసు నమోదు చేశారు. ఆ కేసు విషయమై మా లాయర్లు చట్ట ప్రకారం తగిన సమాధానం ఇస్తారు` అంటూ మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో పాటు మర్డర్ సినిమాలోని మరో పోస్టర్ను రిలీజ్ చేశాడు వర్మ.