`పుష్ప 2` వాయిదా వెనుక మరో షాకింగ్ రీజన్.. దాని వల్లే భయపడ్డారా?.. మేకర్స్ అసలు ప్లానేంటంటే?
`పుష్ప 2` సినిమాని మరోసారి వాయిదా వేసిన విషయం తెలిసిందే. షూటింగ్ కారణంగానే పోస్ట్ పోన్ చేశారని అంటున్నారు. కానీ బయటకురాని మరో షాకింగ్ రీజన్ ఉందట.
అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప 2` సినిమా కోసం యావత్ ఇండియా ఎదురుచూస్తుంది. ఈ సినిమాకి మార్కెట్లో, ఆడియెన్స్ పరంగా మంచి బజ్ ఉంది. అంచనాలున్నాయి. `పుష్ప` ఊహించని సంచలనం సృష్టించడంతో ఈ పార్ట్ 2కి అంచనాలు పెరిగాయి. హైప్ మరింతగా ఏర్పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. కథ స్పాన్ పెంచారు, గ్రాండియర్నెస్ పెంచారు. కథని మరింత బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
సినిమా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడింది. గతేడాది రావాల్సిన మూవీ రెండు మూడు సార్లు వాయిదా పడింది. ఫైనల్గా మళ్లీ డిసెంబర్కి వెళ్లింది. మొదటి పార్ట్ కూడా డిసెంబర్లోనే వచ్చింది. అంతకు ముందు అది కూడా ఆగస్ట్ 13న విడుదల చేయాలనుకున్నారు, కానీ వాయిదా వేసి డిసెంబర్ 17న విడుదల చేశారు. కరోనా సమయంలో చాలా హార్డ్ సిచ్యువేషన్లో సినిమాని రిలీజ్ చేశారు. కానీ అది భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా బాగా ఆడింది. నార్త్ లో అనూహ్యంగా దుమ్మురేపింది.
దీంతో ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ కాబోతుందా అనే టాక్ మొదలైంది. ఎందుకంటే `పుష్ప2`ని కూడా ఆగస్ట్ 15ననే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్ 6కి మార్చారు. ఇది యాదృశ్చికంగా జరిగినా, రెంటింటికి ఏదో లింక్ ఉందని, ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతుందనే ఊహాగనాలు ప్రారంభమయ్యాయి. ఇది సినిమాకి మరింత హైప్ని తెస్తుంది. అయితే ఈ మూవీ వాయిదాకి కారణాలే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతున్నాయి.
Allu Arjun
షూటింగ్ ఆలస్యం కారణంగానే సినిమాని వాయిదా వేయాల్సి వచ్చిందనేది బయట, టీమ్ నుంచి వినిపించే మాట. కానీ దానికి మించిన మరో పెద్ద రీజన్ ఉందట. షూటింగ్పైన పెట్టి వాయిదా వేశారు కానీ, మరో బలమైన కారణంతోనే పోస్ట్ పోన్ చేశారని అంటున్నారు. అదే పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ పొలిటికల్ వివాదం. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ నాయకుడు శిల్పరవి చంద్ర రెడ్డికి సపోర్ట్ చేస్తూ క్యాంపెయిన్ చేయడమే.
పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేసింది. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, సురేఖ, రామ్ చరణ్, అల్లు అరవింద్ సైతం క్యాంపెయిన్లో పాల్గొన్నారు. చిరంజీవి వీడియో రూపంలో, సోషల్ మీడియా ద్వారా తన మద్దతు తెలిపారు. అంతేకాదు ఐదు కోట్ల ఫండ్ కూడా ఇచ్చాడు. కానీ బన్నీ మాత్రం కేవలం ట్వీట్ చేశాడు. కానీ వైసీపీ నాయకుడి కోసం స్వయంగా నంధ్యాలకి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇదే మెగా అభిమానులను, పవన్ ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేసింది. సొంత మేనమామ కంటే వైఫ్ ఫ్రెండ్ వాళ్ల భర్త ఎక్కువయ్యాడా అంటూ దుమ్మెత్తిపోవారు మెగా అభిమానులు. ప్రారంభంలో ఇది మామూలుగానే ఉన్నా, రోజు రోజుకి మరింతగా అగ్గి రాజుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం ఇది మరింత పెరిగింది. బన్నీపై దారుణంగా ట్రోల్స్ చేశారు.
మెగాభిమానులు, టీడీపీ, జనసేన శ్రేణులు ఈ విషయంపై కోపంతో ఉన్నారు. ఇదొక హీట్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి టైమ్లో `పుష్ప2`ని రిలీజ్ చేస్తే అది సినిమాపై భారీ ప్రభావాన్ని చూపిస్తుందని భావిస్తున్నారు. అసలే భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఏపీ, తెలంగాణలోనూ భారీగానే బిజినెస్ అయ్యింది. ఈ వేడి టైమ్లో సినిమాని రిలీజ్ చేస్తే ఆడియెన్స్ చూడరు, కొన్న బయ్యర్లు నష్టపోవాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో సినిమాని వాయిదా వేయడానికి నిర్మాతలు మొగ్గు చూపారని తెలుస్తుంది. ఇయర్ ఎండింగ్ వరకు అంటే ఆల్మోస్ట్ ఈ హీట్ అంతా తగ్గిపోతుంది, దాన్ని అంతా మర్చిపోతారు. ఈ లోపు పవన్, బన్నీ మధ్య సంధి కార్యక్రమాలు జరగొచ్చు, ఇద్దరు కలిసిపోవచ్చు. ఏదైనా జరగొచ్చు. ఏం జరిగినా, సినిమాకి ఎఫెక్ట్ కాకుండా ఉండేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.