రెండు నెలల తరువాత కెమెరా ముందుకు డార్లింగ్.. ప్రభాస్ గ్రీన్ ఛాలెంజ్
లాక్ డౌన్ కాలంలో మిగతా హీరోలంతా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ ఉంటే, ప్రభాస్ మాత్రం ఎవ్వరికీ కనిపించలేదు. దాదాపు రెండు నెలలుగా ఒక్కాసారి కూడా కెమెరా కంటికి చిక్కని ప్రభాస్ తాజాగా గ్రీన్ చాలెంజ్లో భాగంగా మీడియా కెమెరాలకు చిక్కాడు.
సాహో సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్, జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ను ప్రారంభించాడు. ఈ సినిమా సంబంధించిన షూటింగ్ చాలా భాగం ఇటలీలో జరిగింది.
కరోనా ప్రభావం స్టార్ట్ అయిన తరువాత కూడా ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. అయితే తరువాత పరిస్థితి అదుపు తప్పటంతో తిరిగి వచ్చేశాడు.
ప్రభాస్ తిరిగి వచ్చే సమయానికి దేశంలో లాక్ డౌన్ నిబంధనలు ఉండటంతో కొంత కాలం ప్రభాస్ క్వారెంటైన్లో ఉండాల్సి వచ్చింది.
క్వారెంటైన్లో ఉన్న దగ్గర నుంచి ప్రభాస్ మీడియా ముందుకు రాలేదు. దాదాపు రెండు నెలలుగా ప్రభాస్కు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు.
తాజాగా టీఆర్ఎస్ నేత, ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటాడు ప్రభాస్. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా కెమెరాలకు చిక్కాడు ప్రభాస్.
ఎంపీ సంతోష్ తో కలిసి మొక్కలు నాటిన ప్రభాస్ ఆ ఫోటోలను మీడియాకు రిలీజ్ చేశాడు.