సమంతని కలిసే సీన్, ఆవేశంతో బల్ల గుద్దిన నాగార్జున.. అసలేం జరిగిందంటే..
అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, నాగచైతన్య ఇలా అక్కినేని కుటుంబ సభ్యులు కలిసి నటించిన చిత్రం 'మనం'. ఈ మూవీ ఆల్ టైం క్లాసిక్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, నాగచైతన్య ఇలా అక్కినేని కుటుంబ సభ్యులు కలిసి నటించిన చిత్రం 'మనం'. ఈ మూవీ ఆల్ టైం క్లాసిక్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. తన తండ్రి చివరి చిత్రం కావడంతో నాగార్జున ఈ చిత్రాన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. ఆయనే ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. ఈ మూవీలో శ్రియ శరన్, సమంత హీరోయిన్లుగా నటించారు.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు హర్షవర్ధన్ రచయితగా పనిచేశారు. ఈ చిత్రానికి రచన అందించే అవకాశం తనకు చాలా డ్రమాటిక్ గా దక్కిందని హర్షవర్ధన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ టైంలో నేను గుండెజారి గల్లంతయ్యిందే చిత్రం చేస్తున్నాను. అంతకుముందు విక్రమ్ కుమార్ తో ఇష్క్ చిత్రానికి వర్క్ చేశాను. దీంతో విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి కూడా నన్నే రచయితగా తీసుకున్నారు.
కానీ నాగార్జున గారికి నాపై నమ్మకం లేదు. కొత్త వాళ్లతో రిస్క్ చేయదలుచుకోలేదని ఆయన తెలిపారు. ఎందుకంటే ఇది తన తండ్రి చివరి మూవీ కాబట్టి ఎలాంటి పొరపాటు జరగకూడదని నాగార్జున గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఆ టైంలో మనం మూవీ కథా చర్చలు జరుగుతున్నాయి. షూటింగ్ ప్రారంభం కావడం చాలా ఆలస్యం అవుతోంది. ఈ తరుణంలో విక్రమ్ కుమార్ మరోసారి నన్ను నాగార్జున దగ్గరికి తీసుకెళ్లారు.
ఈ చిత్రంలో తనకు రచయితగా అవకాశం రావాలంటే నాగార్జున గారు నాకు ఓ కండిషన్ పెట్టారు. కథ మొత్తం విను.. నీకు నచ్చిన ఏదైనా మూడు సన్నివేశాల డైలాగ్స్ రాసుకుని నా దగ్గరికి తీసుకురా. నాకు నచ్చితే కంటిన్యూ చేద్దాం అని చెప్పారు. నాకు చాలా టెన్షన్ గా అనిపించింది. సినిమా మొత్తం రాసినప్పుడు బావుందో లేదో చెప్పొచ్చు. కానీ మూడు సీన్లకు ఎలా డిసైడ్ చేస్తారు అని అనుకున్నాను.
నాగార్జున గారిని ఇంప్రెస్ చేయడానికి ఒక గ్యాంబ్లింగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. అదేంటంటే కథలో అద్భుతంగా ఉండే సన్నివేశాలు కాకుండా ఎడిటింగ్ లో లేచిపోయే అవకాశం ఉన్న మూడు సన్నివేశాలకు డైలాగులు రాద్దామని అనుకున్నా. కానీ రెండు సన్నివేశాలు అలాంటివి ఎంచుకొని.. ఒక సన్నివేశం మాత్రం మంచిదే ఎంచుకున్నాను. దానికి కారణం ఏంటంటే.. ఎడిటింగ్ ఎడిటింగ్ లో లేచిపోయే సన్నివేశాలకే అద్భుతంగా డైలాగులు రాస్తే ఇక బావున్న సన్నివేశాలకు ఇంకా ఎంత బాగా రాస్తాడో అని నాగార్జున గారి దగ్గర ఇంప్రెషన్ పొందాలనేది నా ఉద్దేశం.
ఆ మూడు సీన్లకు గంటలోనే డైలాగులు రాసేసా. రెండు రోజుల తర్వాత నాగార్జున గారి అపాయింట్మెంట్ దొరికింది. విక్రమ్ కుమార్ తో కలిసి నాగార్జున గారికి ఆ మూడు సన్నివేశాల డైలాగులు వినిపించా. మొదటి రెండు సన్నివేశాలకే ఆయన ఇంప్రెస్ అయిపోయారు. మూడవ సన్నివేశం గత జన్మలో తన తల్లిగా భావించే సమంతని తొలిసారి కలిసే సీన్ అది. ఆ సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది. డైలాగులు కూడా చాలా బాగా రాశాను.
ఆ డైలాగ్స్ వినగానే నాగార్జున గారు ఎగ్జైట్ అయిపోయి ఆవేశంతో బల్ల గుద్దేశారు. ఇది కథ కావాల్సింది, ఇదీ రైటింగ్ అంటే.. అంటూ సంతోషంతో కూడిన ఆవేశం నాగార్జున గారిలో కనిపించింది. నాగార్జున గారు అలా ప్రవర్తించడం ఎవరైనా దూరం నుంచి చూసి ఉంటే మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు అని అనుకునేవాళ్ళు. ఇంతకాలం హర్షవర్ధన్ ని ఎందుకు తీసుకురాలేదు, బిగినింగ్ లోనే ఈ పని చేసి ఉండొచ్చు కదా అని విక్రమ్ కుమార్ ని నాగార్జున ప్రశ్నించారు. ఇక సినిమా మొత్తం నువ్వే డైలాగులు రాయి అని నాగార్జున గారు తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు హర్షవర్ధన్ తెలిపారు.