నాగార్జునని సైతం కదిలించిన గీతూ ఎలిమినేషన్.. రేవంత్ పాటకి గుండె బద్దలైన వేళ.. స్టేజ్పైనే కన్నీరు మున్నీరు
బిగ్ బాస్ తెలుగు షో చరిత్రలోనే ఇంతటి బాధాకరమైన సంఘటన చోటు చేసుకుని ఉండదేమో. ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఈ స్థాయిలో గుండె పగిలేంతగా కన్నీళ్లు పెట్టుకుని ఉండదేమో. కానీ గీతూ ఎలిమినేషన్ విషయంలో జరిగింది.
బిగ్ బాస్ తెలుగు 6 షోలో బలమైన కంటెస్టెంట్గా, బోల్డ్ కంటెస్టెంట్గా, రెబల్ కంటెస్టెంట్గా పేరుతెచ్చుకుంది గీతూ. చిత్తూరి యాసతో అదరగొట్టింది. మొదట్లో ఆమె చేసేది అందరికి ఓవర్ యాక్షన్గా అనిపించింది. కానీ నెమ్మదిగా ఆమెకి కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. అటు ఇంటి సభ్యులకు, ఇటు ఆడియెన్స్ కి గీతూ కనెక్ట్ అయ్యింది. తనకు ఎమోషన్స్ లేవని చెప్పిన గీతూలోనూ ఎమోషన్స్ ని బయటకు తీసుకొచ్చింది బిగ్ బాస్. మనుషుల విలువేంటో చూపించింది. దీంతో ఆమె ఎలిమినేషన్ అందరిని బాధించింది. ముఖ్యంగా ఆమెకి తీవ్రంగా బాధ కలిగించింది.
తాజాగా ఆదివారం ఎపిసోడ్లో గీతూ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ముందుగానే ఆమె ఎలిమినేట్ అవుతుందని బయట ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే గీతూ రాయల్ ఎలిమినేట్ అయ్యింది. కానీ ఆమె ఎలిమినేషన్ని హౌజ్మేట్స్ ఊహించలేదు. అసలు ఆమె ఎలిమినేట్ అవుతుందని, ఆడియెన్స్ కూడా ఊహించి ఉండరేమో. కానీ జరిగిపోయింది. అయితే తాను ఎలిమినేట్ అయ్యాననే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది గీతూ. బోరున విలపించింది. హౌజ్లోకి వచ్చాకే తనకు మనుషుల విలువేంటో తెలిసిందని వాపోయింది. తనని పంపించ వద్దంటూ వేడుకుంది. బ్రతిమాలుకుంది. కానీ లాభం లేదు.
గీతూ ఎన్నో మోసాలను చవిచూసి పెరిగింది. బయట తాను ఎవరినీ నమ్మేది కాదని చెప్పింది. వెన్నుపోటు పొడిచే వారే ఎక్కువ అని, తనని కించపరిచే వారే ఎక్కువగా ఉన్నారని పలు మార్లు హౌజ్లో తెలిపింది. షోకి వచ్చే ముందు, హౌజ్లోనూ ఇలాంటి విషయాలు చెప్పింది. కానీ బిగ్ బాస్ హౌజ్ తనకు మంచి మనుషులను పరిచయంచేసిందని, మనుషులు ఇంత మంచిగా ఉంటారా అనేది తెలియజేసిందంటూ కన్నీరుమున్నీరయ్యింది గీతూ. ఎలిమినేట్ అయిన బాధలో ఆమె కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. తాను పెద్దగా ఎమోషనల్ కానని, తనకు ఏ రిలేషన్, ఎమోషన్ లేదని చెప్పిన గీతూ, ఎలిమినేషన్ సమయంలో ఈ స్థాయిలో కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని కదిలించింది. ఫైనల్గా హోస్ట్ నాగార్జున సైతం కళ్లల్లో నీళ్లు తిరగడం విశేషం.
తాను వెళ్లలేను అని, తనకు పంపించకండి అని గీతూ ఏడవడంతో హౌజ్మేట్స్ మరింత భావోద్వేగానికి గురయ్యారు. వాళ్ల గుండెలు బరువెక్కాయి. అప్పటికే ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, ఫైమా, రాజ్ వంటి వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ స్టేజ్పై తన బాధని, ఎమోషన్స్ ని వ్యక్తం చేసిన తీరుకి, ఏడిచిన తీరుకి మరింతగా కన్నీళ్లు పెట్టుకున్నారు. కాసేపు గీతూ అందరిని ఉక్కిరి బిక్కిరి చేసింది. అల్లకల్లోళం సృష్టించింది. తనని పంపించవద్దని బిగ్బాస్ని, నాగార్జునని వేడుకుంది. నాగ్ని పట్టుకుని మరీ గీతూ కన్నీళ్లు పెట్టుకోవడం మరింతగా హృదయాలను కరిగించింది. హౌజ్మేట్స్ సైతం వద్దు సార్ అంటూ బతిమాలారు, కానీ తన చేతుల్లో లేదని, బిగ్ బాస్ ఆర్డర్ ఫాలో కావాల్సిందే అని ఆయన కూడా చేతులెత్తేశారు నాగ్. బహుశా బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకుని ఉండదేమో అని అనిపించేలా గీతూ ఎలిమినేషన్ ఉండటం విచారకరం.
ఇక స్టేజ్పై తనకు `షో మేకర్స్, షో బ్రేకర్స్` ఎవరు అనేది చెప్పాలని నాగ్ టాస్క్ ఇవ్వగా, షో మేకర్స్ లో ఆదిరెడ్డి, శ్రీహాన్, ఫైమా, రేవంత్, శ్రీసత్య పేర్లు చెప్పింది. ఆదిరెడ్డి తోపు అని, తన లైఫ్లో ఇలాంటి వారిని చూడలేదని, బిగ్ బాస్ బెస్ట్ ఫ్రెండ్నిచ్చాడని తెలిపింది. శ్రీహాన్తో ఎప్పుడూ డాన్సు చేసేదాన్ని అని, అది చాలా మిస్ అవుతానని, అతను ఇంత క్లోజ్ అవుతాడని ఊహించలేదని తెలిపింది. గేమ్ చాలా పద్దతిగా ఆడతాడని చెప్పింది.
ఫైమా చాలా ఇంటలిజెంట్ అని, కానీ ఆమె పాలిష్ కాలేదన్నారు. బయట కనెక్ట్ కాలేదు కానీ ఇక్కడ చాలా కనెక్ట్ అయ్యిందని తెలిపింది. రేవంత్ అగ్రెసివ్ తగ్గించుకుంటే మంచి బిడ్డ అని, శ్రీసత్య లైఫ్, తనది సేమ్ అని, అందుకే బాగా కనెక్ట్ అయ్యామని తెలిపింది గీతూ. షో బ్రేకర్స్ లో రాజ్, ఇనయ, కీర్తి, వాసంతి, బాలాదిత్య వంటి వారి పేర్లు పెట్టింది గీతూ. చివరగా రేవంత్ `వాలు కనుల దానా ..` పాట పాడగా మరోసారి కన్నీళ్లు పెట్టుకుంది గీతూ. ఈ సారి ఆమె కన్నీళ్లు కట్టలుతెచ్చుకున్నాయి. బిగ్ బాస్ షోనే ఎమోషనల్గా మార్చేశాయి.