12 గంటలు, 4 కాల్స్.. చివరి క్షణాల్లో సుశాంత్ ఏం చెప్పాలనుకున్నాడు?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణ వార్త యావత్ దేశాన్ని కలచివేస్తోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు బలవన్మరణానికి పాల్పడటంతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు, సాధారణ ప్రజానీకం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సుశాంత్ సింగ్ మృతిపై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక సమస్యలే కారణమన్న ప్రచారం జరిగినా అవన్ని రూమర్స్ అంటూ సుశాంత్ సోదరి తేల్చేసింది. అదే సమయంలో ఇండస్ట్రీలో తాను ఒంటరిని అయ్యానన్న డిప్రెషన్ కూడా సుశాంత్తో ఉందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో పలు ఇంటర్వ్యూలో సుశాంత్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలను బలం చేకూర్చేలా ఉన్నాయి.
దీనికి తోడు కుటుంబ సభ్యులు సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతడిని ఎవరో హత్య చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసు అధికారులు కూడా ఈ మరణంపై సమగ్ర విచారణకు చేస్తున్నారు. ఇప్పటికే చివరి కొద్ది గంటల్లో సుశాంత్ ఏం చేశాడు, ఎవరెవరితో మాట్లాడాడు అన్న విషయాలను ఆరా తీస్తున్నారు.
శనివారం అర్ధరాత్రి (ఆదివారం తెలవారుజామున) 1: 47 నిమిషాలకు సుశాంత్ తన క్లోజ్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి కాల్ చేశాడు. కానీ ఆ సమయంలో ఆమె కాల్ అటెండ్ చేయలేదు. వెంటనే మరో స్నేహితుడు మహేష్ శెట్టికి కాల్ చేశాడు. అతను కూడా ఫోన్ తీయలేదు.
ఉదయం లేచిన తరువాత మహేష్ సుశాంత్కు మిస్డ్ కాల్ చూసి తిరిగి కాల్ చేసేందుకు ప్రయత్నించినా అతను కాల్ అటెండ్ చేయలేదు. ఆ తరువాత పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుశాంత్ 9:30 గంటల సమయంలో కూడా మహేష్ శెట్టి ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాడట. కానీ అప్పుడు మహేష్ ఫోన్ నాట్ రిచబుల్ వచ్చిందని తెలిపారు.
ఉదయం నిద్ర లేచిన తరువాత బ్రేక్ ఫాస్ట్ చేసిన సుశాంత్ ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగాడు. ఆ తరువాత రూంలోకి వెళ్లి లాక్ చేసుకున్నాడు. తరువాత 10: 25 సమయంలో వంట మనిషి నీరజ్ మధ్యాహ్నం ఏం వంట రెడీ చేయాలో అడిగేందుకు డోర్ కొట్టాడు. ఆ సమయంలో ఇంట్లో ఇతర పనివారు కూడా ఉన్నారు.
సుశాంత్ తో పాటు అదే ఇంట్లో ఉంటున్న మిత్రుడు 11 గంటల సమయంలో లేచి, సుశాంత్ గురించి అడిగాడు. డోర్ ఓపెన్ చేయటం లేదని తెలుసుకొని తాను కూడా డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. లోపలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవటంతో ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ అయిన సౌండ్ వినిపించినా సుశాంత్ లిఫ్ట్ చేయకపోవటంతో అతడి సోదరి రీతూకు తెలియజేశారు.
రీతూ తనకు తెలిసిన ఓ గవర్నమెంట్ అఫీసియల్కు విషయం చెప్పటంతో ఆయన ముంబై పోలీస్కు సమాచారం ఇచ్చారు. 12: 25 సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు డోర్ ఓపెన్ చేసే సరికి సుశాంత్ సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించాడు. డాక్టర్లు పరీక్షించి ఆయన మరణించినట్టుగా ధృవీకరించారు.
అయితే చివరి క్షణంలో మహేష్ శెట్టికి రెండు సార్లు ఫోన్ చేసేందుకు ప్రయత్నించిన సుశాంత్ ఏం చెప్పాలనుకున్నాడు..? ఒకవేళ మహేష్ ఫోన్ అంటెండ్ చేసి ఉంటే సుశాంత్ బతికే వాడా..? అసలు సుశాంత్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.