- Home
- Entertainment
- మహానటి సావిత్రి తన తమ్ముడికి రాసిన లెటర్ చూశారా? కూతురు, కొడుకు గురించి ఏం చెప్పిందంటే?
మహానటి సావిత్రి తన తమ్ముడికి రాసిన లెటర్ చూశారా? కూతురు, కొడుకు గురించి ఏం చెప్పిందంటే?
మహానటి సావిత్రికి సొంతంగా తమ్ముళ్లు లేరు. కానీ ఓ సోదరుడు ఉన్నాడు. ఆయనకు లెటర్ రాసింది మహానటి. ఆ అరుదైన లెటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

సావిత్రి జీవితం ఎంతో మందికి ఆదర్శం
మహానటి సావిత్రి జీవితం ఎంతో మందికి ఆదర్శం. మరెంతో మందికి గుణపాఠం. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె నాటక రంగంలోకి అడుగుపెట్టి, అట్నుంచి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తిరుగులేని తారగా ఎదిగింది. అద్భుతమైన నటనతో విశేషంగా ఆకట్టుకుంది. స్టార్ హీరోలను డామినేట్ చేసే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో ప్రేమ, పెళ్ళి జీవితం సావిత్రి లైఫ్ని తలక్రిందులు చేసింది. దర్శకత్వం, నిర్మాణం సైతం ఆర్థికంగా దెబ్బకొట్టాయి. ఎంత గొప్పగా ఎదిగిందో, అంతే దీన స్థితిలో కోమాలోకి వెళ్లి చనిపోయింది.
సావిత్రి అరుదైన లెటర్ వైరల్
అయితే సావిత్రి మాత్రం ఇప్పటికీ తన సినిమాలతో, అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటూనే ఉంది. తెలుగు ఆడియెన్స్ గుండెల్లో చిరంజీవిగానే ఉండిపోయింది. తాజాగా సావిత్రి రాసిన ఒక అరుదైన లెటర్ వైరల్గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ఆమె తన తమ్ముడుకి రాసిన లెటర్ కావడం విశేషం. ఇందులో తన బాగోగులు చెబుతూ, కూతురు పెళ్లి గురించి, కొడుకు చదువు గురించి రాసింది. అంతేకాదు తమ్ముడుకి తన ఫోటోని కూడా పంపించింది.
కూతురు పెళ్లి, కొడుకు చదువు గురించి సావిత్రి
మరి సావిత్రి రాసిన లెటర్ చూస్తే, ప్రియమైన తమ్ముడు .. నీవు ప్రేమతో రాసిన ఉత్తరం అందింది, చాలా సంతోషం, నీ అభిమానానికి ఎంతో ఆనందం. నాకు ఇద్దరు బిడ్డలు, అమ్మాయి పెద్దది, వివాహం అయిపోయింది. ఒక మగ బిడ్డ కూడా. రెండో వాడు సతీష్ బాబు, వాడి పైనే నా కళ్ళన్నీ. ఆడపిల్లలు ఆడపిల్లలే కానీ ఈడపిల్లలు కాదని మా అమ్మ నిరూపించుకున్నది. బాబు చిన్నవాడే కదా ఏడవ క్లాస్ చదువుతున్నాడు. బాగా చదివించాలని నా తాపత్రయం, ఆపైన భగవంతుని దయ. నీ ప్రేమాభిమానాలకు నా సంతోషాన్ని తెలియపరుస్తూ నా ఫోటో నీకు పంపిస్తున్నాను. ఇట్లు మీ సోదరి సావిత్రి` అని పేర్కొంది సావిత్రి. ఈ లెటర్లో తన ఫోటోని జత చేసింది. ఇది 1977లో రాసిన లేఖ. ఈ అరుదైన లెటర్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
సావిత్రి లెటర్ రాసింది ఆయనకేనా?
సావిత్రికి సొంతంగా తమ్ముడు లేరు. అక్క ఉంది. తాను పుట్టిన ఆరు నెలలకే తండ్రి గురువయ్య కన్నుమూశారు. దీంతో చిర్రావూరులోని సావిత్రి పెద్దమ్మ అన్నపూర్ణమ్మ వద్ద పెరిగింది. పెద్దమ్మ అన్నపూర్ణమ్మ ఒక అబ్బాయిని దత్తత తీసుకుంది. ఆయనే దావులూరి నర్సయ్య. బహుశా సావిత్రి లెటర్ రాసింది ఆయనకేనా? అని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ లేదు. సావిత్రిలోని డాన్సులు, నటన ప్రతిభని గమనించిన పెదనాన్న వెంకట్రామయ్య ఆ దిశగా ప్రోత్సహించారు. డాన్సులు నేర్పించారు. నాటకాలు ప్రదర్శింప చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి తీసుకొచ్చారు.
నర్తకిగా కెరీర్ స్టార్ట్ చేసిన సావిత్రి
సావిత్రి మొదట `సంసారం` అనే సినిమా ఆడిషన్కి వెళ్లింది. మొదట ఎంపిక చేసి కొన్ని సీన్లు షూట్ చేసి తప్పించారు. ఆ తర్వాత `పాతాళభైరవి` అనే సినిమాలో డాన్సర్గా కనిపించింది. ఆ తర్వాత `రూపవతి`, `ఆదర్శం` చిత్రాల్లో మెరిసింది. ఇక `పెళ్లి చేసి చూడు`లో హీరోయిన్గా నటించింది. హీరోయిన్గా సావిత్రికిదే తొలి మూవీగా చెప్పొచ్చు. ఆ తర్వాత `దేవదాసు`తో హిట్ అందుకుంది. `మిస్సమ్మ`తో ఆమె లెక్కే మారిపోయింది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు సావిత్రికి. ఆ తర్వాత సావిత్రి వైభవం అందరికి తెలిసిందే.