నీకు ఏమి అన్యాయం జరిగిందని ఊగిపోతున్నావ్ పవన్ కళ్యాణ్? ఇండస్ట్రీ పరువు పోతుంది, సీనియర్ నటుడు బాబూమోహన్ చురకలు
టాలీవుడ్ లో 'మా' ఎన్నికల(Maa elections) వేడి కొనసాగుతుంది. ప్రత్యర్థుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకుంటున్నాయి. కాగా 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ నుండి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబూ మోహన్(Babu mohan) పోటీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో బాబూ మోహన్ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పవన్ తాజా కామెంట్స్ పై స్పందించారు. పవన్ కల్యాణ్ అన్ని మాటలు మాట్లాడారు. ఇంతకీ ఆయన పరిశ్రమ సైడా? ప్రకాశ్ రాజ్ సైడా? ముందుగా పవన్ కల్యాణ్ తేల్చుకోవాలి, అన్నారు.
సర్కారు సహకారం ఇండస్ట్రీకి అవసరం. ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ ఓ విషయం అడిగింది. దీనిపై పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడారు అన్నారు.
అలాగే ఈ విషయంలో పవన్ వ్యవహరించిన తీరు సరైనది కాదు. నిన్న పవన్కు విష్ణు బాబు ఓ ప్రశ్న వేశారు. అందులోనే ఓ విషయం ఉంది. పవన్ను ఇండస్ట్రీ సైడా? ప్రకాశ్ రాజ్ సైడా అని విష్ణు ప్రశ్నించారు. ఏదేమైనా తెరచాటునే అన్ని విషయాలు తేల్చుకోవాలి. అంతేగాని తెరముందుకు వచ్చి మాట్లాడటం ఏంటి? మరి అంత చిరాకుతో మాట్లాడటం ఎందుకు? అన్నారు.
నీకు పైసా అన్యాయం జరగలేదు. నీ రెమ్యూనరేషన్ కి డామేజ్ కాలేదు. మరి ఎందుకయ్యా అలా ఆవేశంగా మాట్లాడుతున్నావ్. ఇలా బహిరంగ విమర్శల వలన పరిశ్రమ పరువు పోతుందని బాబూమోహన్ పవన్ కళ్యాణ్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు.
నీకు ఏదైనా అన్యాయం జరిగితే, నీ ప్రయోజనాలు దెబ్బతింటే పెద్దలతో మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. పరిశ్రమకు ఉన్న సమస్యలు ఏపీ ప్రభుత్వానికి నిర్మాతలు విన్నవించారు. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మధ్య పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగం అనవసరం అన్నారు.
మనం పరిశ్రమకు ముఖం లాంటి వాళ్ళం. ఇలాంటి వ్యక్తిగత విమర్శల కారణంగా పరిశ్రమ పట్ల చిన్న చూపు ఏర్పడుతుంది. నటులంటే చులకన భావన ఏర్పడుతుందని బాబు మోహన్ తన అభిప్రాయం వెల్లడించారు. ఈ నేపథ్యంలో బాబూమోహన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.