తండ్రి ఓంకార్ మరణంతో తలక్రిందులైన `కార్తీకదీపం` నటుడు నిరుపమ్ జీవితం.. హీరో కాబోయి.. అదొక ఎమోషనల్ జర్నీ..
నిరుపమ్ పరిటాల.. తెలుగు సీరియల్స్ లో అత్యంత క్రేజ్ ఉన్న నటుడు. ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా దగ్గరైన నటుడు. దశాబ్దానికిపైగా టీవీ నటుడిగా రాణిస్తున్నారు. కానీ తండ్రి మరణం ఆయన జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసా? అదొక ఎమోషనల్ జర్నీ.
2007లో `చంద్రముఖి` సీరియల్ ద్వారా బుల్లితెరకి పరిచయమైన నిరుపమ్ ఆ సీరియల్తోనే బాగా ఆదరణ పాపులారిటీ పొందాడు. కెరీర్లో నిలదొక్కుకునేలా చేసింది. ఈ సీరియల్లో నటించిన సమయంలో తన పక్కన ఫీమేల్ లీడ్గా చేసిన మంజులని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ అబ్బాయి కూడా ఉన్నాడు.
నిరుపమ్ తండ్రి నిన్నటి తరం నటుడు, రచయిత అయినా ఓంకార్ పరిటాల. సీరియల్స్ లో సీనియర్ నటులుగా రాణించారు. అయితే నిరుపమ్ సినిమాల్లోకి వస్తా అన్నప్పుడు ఓంకార్ వద్దని చెప్పారట. అక్కడ చాలా ఇబ్బందులుంటాయని, నిలదొక్కుకోవడం కష్టమన్నారట. ఎందుకంటే తాను కూడా సినిమా రంగంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాడట. ఒకానొక దశలో చిత్ర పరిశ్రమ ఆయన్ని బ్యాన్ చేసిందనే ప్రచారం కూడా జరిగిందట. సినిమా పరిశ్రమలోని పలు సమస్యలపై ఆయన గళం విప్పి ఎన్నో అవకాశాలను కోల్పోయారని టాక్. అందుకే నిరుపమ్ని సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదట.
నిరుపమ్ చెన్నైలో ఇంజినీరింగ్, ఎంబీఏ పూర్తి చేశాడు. హీరో అవ్వాలని ఆశపడ్డాను. తండ్రిని ఎలాగైనా ఒప్పించి చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో తండ్రి ఓంకార్ కన్నుమూశారు. దీంతో తన జీవితమే తలక్రిందులైంది. ఆ టైమ్లో మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలా లేక ఇష్టమైన నటనని కంటిన్యూ చేయాలా? అనే సందిగ్దంలో పడిపోయాడు నిరుపమ్. ఈ సమయంలో ఓంకార్ స్నేహితుడి ద్వారా `చంద్రముఖి` సీరియల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడట.
అలా నిరుపమ్ సీరియల్కే పరిమితమయ్యారు. తండ్రి కోరుకున్న విధంగానే బుల్లితెర నటుడిగా రాణిస్తున్నారు. తొలి సీరియల్తోనే తానేంటో నిరూపించుకుని మంచి క్రేజ్ని, పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. బుల్లితెర స్టార్గా ఎదిగాడు.
నిరుపమ్ కేవలం నటుడు మాత్రమే కాదు, తన తండ్రి లాగే రైటర్ టాలెంట్ కూడా ఉంది. `నెక్ట్స్ నువ్వే` అనే చిత్రానికి నిరుపమ్ స్క్రిప్ట్ కూడా అందించారు. ఇక జీ తెలుగులో ప్రసారం అవుతున్న `ప్రేమ` అనే సీరియల్తో ప్రొడక్షన్లోకి అడుగు పెట్టాడు. ఇందులో తనే మెయిన్ లీడ్ అనే విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు టీవీ సీరియల్స్ లో అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న సీరియల్ `కార్తీక దీపం`. ఇందులో డాక్టర్ బాబుగా నిరుపమ్ అదరగొడతున్నాడు. అయితే ఇందులో ఫస్ట్ ఆయనకు అవకాశం రాలేదట. ఈ సీరియల్ కోసం ఇతర ఇద్దరు ముగ్గురు నటులను తనే సిఫార్సు చేశాడట. ఆ సీరియల్ ప్రొడ్యూసర్తో `మూగమనసులు` అనే సీరియల్లో నిరుపమ్ నటించగా, తాను ఆడిషన్కి పంపిన వాళ్లు సరిగ్గా అనిపించకపోవడంతో ప్రొడ్యూసర్ నిరుపమ్నే చేయమని అడిగాడట. అలా తన ఎంట్రీతో మొదలైన సీరియల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
అయినా ఇప్పటికీ నిరుపమ్లో తాను హీరో కాలేదనే బాధ ఉందట. తండ్రి బ్రతికి ఉంటే తాను సినిమాల్లో రాణించేవాడినని, మంచి స్థాయిలో ఉండేవాడినని బాధపడుతుంటాడట నిరుపమ్. మొత్తానికి నచ్చిన నటనా రంగంలోనే మంచి స్థానంలో స్థిరపడటంతో తాను హ్యాపీగానే ఉన్నానని చెబుతున్నాడు నిరుపమ్. ప్రస్తుతం ఆయన `కుంకుమపువ్వు`, `కార్తీక దీపం`, `ప్రేమ` వంటి సీరియల్స్ లో నటిస్తున్నారు. తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ని అలరిస్తున్నారు.
నిరుపమ్ భార్య మంజుల కూడా పాపులర్ బుల్లితెర నటి అనే విషయం తెలిసిందే.