భారతరత్నపై బాలకృష్ణ సంచలన కామెంట్స్... కాలి గోటితో సమానం అంటూ అనుచిత వ్యాఖ్యలు!
నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. భారతదేశ అత్యుత్తమ పురస్కారం అయిన భారతరత్న కాలిగోటితో సమానం అనడం సామాజిక, రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది.
బాలకృష్ణ నేడు తన 61వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. యాంకర్ అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఆయన భారతరత్న పురస్కారం పై అవమానకర వ్యాఖ్యలు చేశారు.
నటుడిగా, రాజకీయనాయకుడిగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఎన్టీఆర్ గారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని ఎప్పటి నుండో డిమాండ్ ఉంది. దీనిపై పలువురు తెలుగు నేతలు కేంద్రానికి విజ్ఞప్తులు చేయడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు.
ఇదే విషయంపై బాలకృష్ణను అడుగగా ఎన్టీఆర్ ఓ మహానుభావుడు, ఆయనకు భారతరత్న అవసరం లేదు. భారతరత్న ఎన్టీఆర్ కాలిగోటితో సమానం అన్నారు. బాలయ్య ఆవేశంలో అన్నా కానీ భారతరత్న పురస్కారాన్ని ఎన్టీఆర్ కాలిగోటితో సమానం అనడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని కొందరి భావన.
తండ్రి గొప్పతనం చెప్పే క్రమంలో బాలకృష్ణ మాట తూలినట్లు అనిపిస్తుంది. ఇక ప్రతిరోజు ఆయన సినిమాలు చూడడమే తనకు వ్యాపకం అని బాలకృష్ణ చెప్పారు. ఎన్టీఆర్ జీవిత కథను మహాభారత, రామాయణాల మాదిరి ఓ ఎపిక్ గ్రంథముగా పుస్తక రూపంలో తీసుకువస్తాను అన్నారు.
ఇక ఎన్టీఆర్ బయోపిక్ కి న్యాయం చేయలేక పోయానని బాలకృష్ణ ఒప్పుకున్నారు. రెండు భాగాలుగా విడుదల చేయడం వలన అది వర్కవుట్ కాలేదని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.