మర్డర్: అమృత కామెంట్స్పై స్పందించిన ఆర్జీవీ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫాదర్స్ డే సందర్భంగా మరో వివాదాస్పద చిత్రానికి తెరతీశాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ల ప్రేమ కథ, హత్యల నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఈ వార్తలపై అమృత ఘాటుగా స్పదించింది.
రామ్ గోపాల్ వర్మ.. అమృత ప్రణయ్ల ప్రేమకథతో సినిమాను తెరకెక్కిస్తుండటంపై అమృత స్పందించినట్టుగా ఓ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వర్మ తమ కథతో సినిమా తీస్తున్నట్టుగా వార్తలు రావటంతో తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిదని అమృత కామెంట్ చేసినట్టుగా ఉంది. దీంతో ఒక్కసారిగా ఈ నోట్ హాట్ టాపిక్గా మారింది.
అయితే ఆ వ్యాఖ్యల వర్మ స్పందించాడు. `ప్రస్తుతం సోషల్ మీడియా సర్క్యూలేట్ అవుతున్న అమృత చెప్పినట్టుగా ఉన్న నోట్ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఆమె, ఆమె తండ్రి కథతో సినిమా తీస్తున్నట్టుగా తెలియంటే ఆమెకు ఆత్మహత్య చేసుకోవాలనిపించదని అమృత చెప్పినట్టుగా తెలుస్తోంది ఈ నోట్కు సమాధానం ఇవ్వాల్సిన` అవసరం ఉంది.
అసలు ఈ నోట్ అమృత రాసిందా.. లేక పనిలేక ఇంకెవరైనా రాశారా..? అయినా నేను సమాధానం చెప్పాలనుకున్నాను. అవరసం లేకపోయినా స్పందిస్తున్న వారికోసం నేను స్పందించాలనుకున్నాను. మర్డర్లో ఏం చూపించబోతున్నానో చెప్పదలచుకున్నాను.
నేను పోస్టర్లోనే క్లియర్గా చెప్పాను ఇది కేవలం నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నానని.. కానీ నిజ జీవిత కథనే తెరకెక్కిస్తున్నా అని ఎక్కడా చెప్పలేదు. నా సినిమాలో కొన్ని సంవత్సరాలుగా సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో వాటిలో ఇన్వాల్ అయిన కథల వ్యక్తుల అనుభవాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నా.
ఇక మర్డర్ పబ్లిసిటీ విషయంలో నేను వాడిన ఫోటోలు కూడా ఇంటర్నెట్లో చాలా విరివిగా దొరికే ఫోటోలే. అవి నాకు ఎవరూ పర్సనల్గా ఇచ్చినవి కాదు. ఎవరి దగ్గర నుంచో అనధికారికంగా తీసుకున్నవి కాదు.
మర్డర్ కథకు ఇన్సిపిరేషన్ అయిన అసలు కథలో చాలా కోణాలు ఉన్నాయి. కానీ నా కోణం ఏంటి అన్నది నా సినిమా రిలీజ్ అయిన తరువాతే తెలుస్తుంది. అంతకన్నా ముందే మిడిమిడి జ్ఞానంతో కామెంట్లు చేయొద్దు.
నేను ఒకరిని నెగెటివ్గా చూపిస్తున్నానని భావించటం అవివేకం. నిజానికి అసలు చెడ్డ వ్యక్తులు ఉండరు. చెడ్డ సందర్భాలు వ్యక్తులను చెడ్డవారిగా మారుస్తాయి. చెడు ప్రవర్తించేలా చేస్తాయి. అదే నేను మర్డర్లో చూపించాలనుకుంటున్నాను. అని క్లారిటీ ఇచ్చాడు వర్మ.