ఇండియన్ సినిమా షేక్ చేయబోతున్న చిరు, పవన్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, చెర్రీ.. బాలీవుడ్ బెంబేల్
గతంలో ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమాలే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. టాలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్ని మించి ఎదిగింది. ఎదుగుతోంది. చిరంజీవి, పవన్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్, విజయ్ దేవరకొండ ఇలా స్టార్స్ అంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. హిందీని మించిన చిత్రాలు చేస్తూ ఇండియన్ సినిమాని శాషించబోతున్నారు.
ఇప్పుడు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోంది. `బాహుబలి` పాన్ ఇండియా సినిమాలకు తెరలేపింది. దీంతో వరుసగా భారీ సినిమాలు తెలుగులో తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం రూపొందుతున్న `రాధేశ్యామ్`, `ఆదిపురుష్`, `ఆచార్య`, `ఆర్ఆర్ఆర్`, `పుష్ప`, `లైగర్`, ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా, పవన్-క్రిష్ మూవీ, రామ్చరణ్- శంకర్, చిరంజీవి-మోహన్రాజా చిత్రం ఇలా దాదాపు ఓ పది తెలుగు సినిమాలు పాన్ ఇండియన్ చిత్రాలుగా రూపొందుతున్నాయి. భారీతీయ సినిమా అంటే తెలుగు సినిమానే అనేంత రేంజ్తో రూపొందుతున్నాయి. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్ లను మించిన స్టార్డమ్ని తెలుగు హీరోలు సొంతం చేసుకుంటున్నారు. బాలీవుడ్ని మించిన సినిమాలు ఇప్పుడు తెలుగులో రూపొందుతున్నాయి.
`బాహుబలి`తో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ క్రియేట్ చేశారు ప్రభాస్. బాలీవుడ్ని మించి ఈ సినిమా విజయం సాధించింది. ఇంతకు ముందు నటించిన `సాహో` కూడా పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `రాధేశ్యామ్` పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్బంగా విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇది దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్తో రూపొందుతుందని టాక్.
ఇదే కాదు ప్రభాస్, `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న `సలార్` సైతం పాన్ ఇండియా సినిమాగానే రూపొందుతుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగుదూర్ నిర్మిస్తున్నారు. దీంతోపాటు నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమాని సైతం అంతర్జాతీయ స్థాయిలో రూపొందించబోతున్నారు. ఇందులో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తుండగా, దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తుంది.
దీంతోపాటు ప్రభాస్ `ఆదిపురుష్` కూడా పాన్ ఇండియన్ చిత్రంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రూపొందిస్తున్నారు. రామాయణం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్. ఇందులో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇతర కాస్టింగ్ ఎంపిక జరుగుతుంది. దాదాపు మూడు వందలకోట్ల బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతుంది.
తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మక తెరకెక్కుతున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా దాదాపు పది భాషల్లో విడుదలకు రెడీ అవుతుంది. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడానికి ముందు కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాతో రాజమౌళి తాను తీసిన `బాహుబలి` రికార్డ్ లను బ్రేక్ చేయాలని చూస్తున్నారు. ఇది దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్తో రూపొందుతుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్, రామ్చరణ్ నేషనల్ స్టార్స్ గా మారబోతున్నారు.
ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న `ఆచార్య` చిత్రాన్ని తెలుగులోనే రూపొందిస్తున్నా, దీన్ని తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల చేయబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా, రామ్చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది మే 13న విడుదల కానుంది.
చిరంజీవి హీరోగా నటిస్తున్న మరో చిత్రం `లూసీఫర్` రీమేక్ ఇటీవల ప్రారంభమైంది. మలయాళ `లూసీఫర్`కిది రీమేక్. తమిళ దర్శకుడు మోహన్రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో నిర్మించేందుకు ఎన్వీప్రసాద్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే కాదు ఇకపై చిరంజీవి సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్నాయి.
అల్లు అర్జున్ గతేడాది `అల వైకుంఠపురములో`తో రికార్డ్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. దీన్ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాని తెరకెక్కిస్తుంది. ఇందులో బన్నీ డీ గ్లామర్ లుక్లో కనిపించబోతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా రూపొందుతుందని టాక్.
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందబోతున్న `పీఎస్పీకే27` చిత్రాన్ని కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందించబోతున్నారు. ఇందులో నిధి అగర్వాల్ ఓ హీరోయిన్గా నటిస్తుండగా, జాక్వెలిన్ పేరు మరో హీరోయిన్గా వినిపిస్తుంది. దీన్ని కూడా తెలుగు, హిందీతోపాటు సౌత్ లాంగ్వేజ్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పవన్ రేంజ్ మరింతగా పెరగనుందని చెప్పొచ్చు.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతుంది. ఇది త్వరలోనే ప్రారంభం కానుంది. దీన్ని కూడా తెలుగుతోపాటు హిందీ, సౌత్ భాషల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత సినిమాలు కూడా పాన్ ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నారట.
రామ్చరణ్ ఇటీవల బిగ్గెస్ట్ చిత్రాన్ని ప్రకటించాడు. శంకర్ దర్శకత్వంలో భారీ సినిమా చేయబోతున్నారు. దిల్రాజు దీన్ని నిర్మించనున్నారు. సాధారణంగా శంకర్ రూపొందించే సినిమాలు సౌత్తోపాటు హిందీలోనూ విడుదలవుతుంటాయి. పైగా రామ్చరణ్ హిందీలో `తుపాన్` చిత్రం చేశారు. త్వరలో ప్రారంభం కాబోతున్న సినిమాని కూడా పాన్ ఇండియాగా, భారీ బడ్జెట్తో రూపొందించబోతున్నట్టు తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్` చిత్రంలో నటిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుండగా, ఛార్మి, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీలో రూపొందుతుండగా, తమిళం, మలయాళం, కన్నడలో విడుదల కాబోతుంది.