`సీసీసీ` ఉన్నట్టేనా?.. చిరు, నాగ్, వెంకీ, మహేష్, ప్రభాస్, బన్నీ ఏమయ్యారు.. సినీ కార్మికులను ఆదుకునేదెవరు?
కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. దీంతో ఇప్పటికే అనాధికారికంగా సినిమా పరిశ్రమ మొత్తం లాక్డౌన్ పాటిస్తుంది. మరి సినీ కార్మికులను ఆదుకునే నాదుడే లేకుండా పోయాడు. `కరోనా క్రైసిస్ ఛారిటీ`(సీసీసీ) ఉందా? లేదా? గతేడాది కోట్లు ప్రకటించి ఆదుకున్న సినీ పెద్దలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్బాబు, మహేష్, పవన్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్, బాలయ్య ఇప్పుడు ఏమయ్యారు. వీరంతా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది.
కరోనా సెకండ్ వేవ్లో రియల్ హీరో సోనూ సూద్ అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. పూర్తిగా ఆయన కరోనా పేషెంట్లకి ఆక్సిజన్ అందించడంలో, బెడ్స్, వెంటిలేటర్స్ అందించడంలో మునిగితేలుతున్నారు. స్వయంగా ఆయనే రంగంలోకి దిగిన సహాయాన్నఅందిస్తున్నారు. తాను స్థాపించిన సంస్థలతోనూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆయన వందల మంది ప్రాణాలను నిలిపారు. ఇంకా చెప్పాలంటే వందల మందికి ప్రాణాలు పోస్తున్నారు.
కానీ మిగిలిన స్టార్ హీరోల్లో చలనమేది? సెకండ్ వేవ్ ఈ రేంజ్లో విజృంభిస్తున్నా, ఇంకా ఎందుకు స్పందించడం లేదనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కరోనాతో చాలా మంది సినీ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. అయినా స్పందన లేదు. కనీసం మృతులను ఆదుకునే పరిస్థితి కూడా లేదు. కేవలం సంతాపాలతో సరిపెడుతున్నారని, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ టైమ్లో లాక్ డౌన్ పెట్టిన వారం రోజులకే సినీ తారలంతా స్పందించారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మోహన్బాబు, బాలకృష్ణ, పవన్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్చరణ్, రవితేజ, గోపీచంద్, నాని, విజయ్ దేవరకొండ ఇలా యంగ్ హీరోలతో సహా అనేక మంది తారలు విరాళాలు ప్రకటించారు. కొందరు అటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు, మరికొందరు కేంద్రానికి విరాళాలు ప్రకటించారు. దీంతోపాటు చిరంజీవి ఆధ్వర్యంలో స్టార్ట్ అయిన `కరోనా క్రైసిస్ ఛారిటీ`కి విరాళాలు అందించారు.
`సీసీసీ` ద్వారా వేల మంది సినీ కార్మికులకు నిత్యవసర సరుకులు అందజేశారు. రైస్తోపాటు ఇతర సరుకులు అందజేశారు. చాలా వరకు ఆదుకునే ప్రయత్నం చేశారు. లాక్డౌన్తో రోజువారి పనులు చేసుకునే సినీ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వారిని ఆదుకుంది టాలీవుడ్. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.
ఈసారి కరోనా మరింత తీవ్రంగా వచ్చింది. ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దీంతో ఇప్పటికే గత నెల 20 నుంచి దాదాపు సినిమాల షూటింగ్లన్నీ నిలిపివేశారు. థియేటర్లు మూత పడ్డాయి. అనాధికారికంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. దీంతో సినీ కార్మికులు పనులు లేక మరోసారి రోడ్డున పడ్డారు. కానీ చిత్ర పరిశ్రమ ఇప్పటి వరకు స్పందించలేదు. చిరంజీవి, మహేష్, `ఆర్ఆర్ఆర్` టీమ్, సురేష్ ప్రొడక్షన్ ఇలా కొందరు స్పందించి పేషెంట్లకి కరోనా బెడ్స్, మెడిసిన్ అందించేందుకు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు పెడుతున్నారు. కరోనా నిబంధనలు చెబుతున్నారు.
అంతకు మించి వీరి నుంచి ఎలాంటి స్పందనలేదు. అందరు సైలెంట్ అయ్యారు. ఎవరికి వారు ఇంట్లో ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తున్నారు. మరి సినీ కార్మికుల బతుకులేమైపోవాలి? వారికి తిండి ఏంటీ, షూటింగ్లు జరిగితేనే రోజు గడిచే కార్మికుల బాధలు ఎవరు పట్టించుకున్నారు. పరిశ్రమని నమ్ముకున్న వారి భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సోషల్ మీడియా వేదికగా చిత్ర వర్గాలను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
టాప్ హీరోలెవరూ దీనిపై స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు. కొంత మంది కరోనాతోనే పోరాడుతున్నారు. ఇక మిగిలిన వాళ్ల గురించి ఏం పట్టించుకుంటామనే దోరణి కనిపిస్తుంది. అదే సమయంలో ఎంతో ప్రభావితం చేయగల తారలంతా సైలెంట్ అవ్వడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుందని సినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
సోనూ సూద్ మాదిరిగా వీరంతా రంగంలోకి దిగి, అంటే ప్రత్యక్షంగా రోడ్డుపైకి రావాల్సిన అవసరం లేదు. తమకి ఉన్న నెట్ వర్క్ ద్వారా ఆక్సిజన్ అందించి, బెడ్స్ అందించి, వెంటిలేటర్స్ అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు. కోట్లకు కోట్లు సంపాదించి, ఒక్కో సినిమాకి 20 నుంచి వంద కోట్లు పారితోషికం తీసుకుంటున్న ఈ తారలు కనీసం అందులో కనీసం ఐదుశాతం లోపైనా ఇలాంటి కఠిన సమయంలో ప్రజల కోసం, వారి అభిమానుల కోసం ఖర్చుపెట్టడంలో తప్పులేదని నెటిజన్లు అంటున్నారు. ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడం కచ్చితంగా అభిమానింప బడే వారికి సామాజిక బాధ్యత అవుతుందంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ ద్వారా, అపోలో ఆసుపత్రి వర్గాల సపోర్ట్ తో తనకున్న ఇన్ఫ్లూయెన్స్ తో కొంత వరకు సహాయం అందిస్తున్నట్టు తెలుస్తుంది. కొంత వరకు వ్యాక్సిన్ వేయించారు. కానీ అది ఆయన ఇమేజ్కి, పరిధితో పోల్చితే చాలా తక్కువనే చెప్పాలి. అలాగే దీనిపై పవన్ సైతం ఇప్పటి వరకు స్పందించలేదు. గతేడాది హడావుడి చేసిన నాగార్జున ఈ సారి స్పందనే లేదు. ఇక ప్రభాస్ నిర్మాతలు హైదరాబాద్ పరిసరాల్లో ఓ తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన హీరోలంతా ఇంటికే పరిమితమయ్యారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం పది రోజుల పాటు లాక్డౌన్ పెట్టింది. దీంతో మరింతగా ఆదాయ వనరులపై దెబ్బ పడే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా టాలీవుడ్ సినీ పెద్దలు స్పందించి సినీ కార్మికులను ఆదుకోవాలని, నిత్యావసర సరుకులుగానీ, కరోనాతో ఇబ్బంది పడే వారినిగానీ ఆదుకోవాలని అభిమానులు, నెటిజన్లు కోరుకుంటున్నారు. మరి ఇకనైనా మన తారలు స్పందిస్తారేమో చూడాలి.