టాప్ డైరెక్టర్స్ కి హ్యాండిచ్చిన చిరు, ప్రభాస్, మహేష్, బన్నీ
చిత్ర పరిశ్రమలో దర్శకులతో సినిమా చేస్తామని హీరోలు చివరి నిమిషంలో హ్యాండివ్వడం సర్వసాధారణమే. అలా ఇటీవల కాలంలో పలువురు దర్శకులతో సినిమాలు చేస్తామని హ్యాండిచ్చిన హీరోలెవరో? ఆ ప్రాజెక్ట్ లేంటో? ఓ సారి చూద్దాం.
చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. అంతా ఓకే అనుకుని సెట్మీదకు వెళ్ళి తర్వాత కూడా సినిమా క్యాన్సిల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. హీరోకి మరో దర్శకుడు ఎగ్జైటింగ్ స్టోరీ తీసుకొచ్చినా, ఫలనా దర్శకుడు చెప్పిన కథ విషయంలో హీరో చెప్పినట్లు మార్పులు చేయకపోయినా ఆ దర్శకుడికి హ్యాండిస్తుంటారు. హీరోకది మామూలు విషయమే. కానీ అది డైరెక్టర్లకి జీవితం. ఆ ఒక్క సినిమా ఆ దర్శకుడి జీవితాన్ని మలుపుతిప్పే ఛాన్స్ ఉంటుంది. కానీ అవేమీ హీరోలకు పట్టవు. ఇది కాదని మధ్యలో పుల్లలు వేసే బ్యాచ్ కూడా ఆ దర్శకులను అడ్డంగా బుక్ చేస్తుంటారు. హీరోలకు లేనిపోనివి చెప్పి ఆ ప్రాజెక్ట్ లను రద్దు చేయిస్తుంటారు. ఏదేమైనా ఓ సినిమా క్యాన్సిల్ అయ్యిందంటే దర్శకులకు బాధాకరమైన విషయమే. ఇటీవల కాలంలో పలువురు దర్శకులతో సినిమాలు చేస్తామని హ్యాండిచ్చిన హీరోలు, ఆ సినిమా గురించి ఓ లుక్కేద్దాం.
దర్శకులకు హ్యాండిచ్చిన వారిలో మొదటగా చెప్పాల్సి వస్తే మెగాస్టార్ చిరంజీవి గురించే చెప్పాలి. తొమ్మిదేళ్ళ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చిరు మొదటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `ఆటోజానీ` సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. దాదాపు ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. కానీ చివరి నిమిషంలో మెగాస్టార్ పూరీకి హ్యాండిచ్చాడు. సెకండాఫ్ విషయంలో అసంతృప్తిగా ఉన్నానని చెప్పి తమిళ సినిమా `కత్తి`ని `ఖైదీ నెం.150`గా రీమేక్ చేసి బ్లాక్బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే పూరీ ఆ టైమ్లో ఫ్లాప్ల్లో ఉండటం కూడా చిరు ఆలోచించాల్సి వచ్చిందట.
మన్మథుడు నాగార్జున కూడా ఇటీవల `సోగ్గాడే చిన్ని నాయనా` వంటి కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో `బంగార్రాజు` సినిమా చేస్తానని కమిట్ అయిన విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాడు. కానీ సీక్రెట్గా `వైల్డ్ డాగ్` చిత్రాన్ని ప్రకటించారు నాగ్. ఆ తర్వాత ప్రవీణ్ సత్తార్ తోనూ మరో సినిమాని ప్రకటించారు. దీంతో ఇక కళ్యాణ్ కృష్ణతో సినిమా డౌటే అని ఫిల్మ్ నగర్ టాక్. మొత్తంగా కళ్యాణ్కి నాగ్ పెద్ద హ్యాండే ఇచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
డైరెక్టర్లకి హ్యాండివ్వడంలో మహేష్ ముందుంటాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తుంటుంది. ఎందుకంటే ఆయన హ్యాండిచ్చిన దర్శకుల జాబితా చాలా పెద్దదే. ఇటీవల తనకు `మహర్షి` లాంటి బ్లాక్బస్టర్ని, ఎన్నో ప్రశంసలందించిన చిత్రాన్నిఅందించిన వంశీపైడిపల్లితో మరో సినిమా చేయబోతున్నట్టు `సరిలేరు నీకెవ్వరు` సినిమా విడుదల టైమ్లో చెప్పాడు. పలు మార్లు వేదికలపై కూడా అదే విషయాన్నిరిపీట్ చేశాడు. కానీ ఉన్నట్టుండి పరశురామ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సూపర్ స్టార్ ఇచ్చిన హ్యాండ్కి వంశీపైడిపల్లికి మతిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు మరో హీరోని వెతుక్కునే పనిలో పడ్డాడు వంశీ.
అంతకంటే ముందు సుకుమార్కి కూడా మహేష్ షాక్ ఇచ్చాడు. `మహార్షి`కి ముందు సుకుమార్తో ఓ సినిమా ఉంటుందని ప్రకటించారు. `రంగస్థలం` వంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందించిన సుక్కుతో సినిమా చేస్తాడని అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో లేదని, తర్వాత చేస్తామని మహేష్ తేల్చిచెప్పేశాడు. దీంతో సుక్కుకి మైండ్ బ్లాంక్ అయ్యింది. అంతేకాదు అంతకంటే ముందు పూరీ జగన్నాథ్తో `జనగణమన` అనే ప్రాజెక్ట్ ని అనుకున్నారు. కథ కుదరలేదని పూరీకి హ్యాండిచ్చాడు మహేష్.
ప్రభాస్ సైతం `కేజీఎఫ్` డైరెక్టర్ని బుక్ చేశాడు. గత ఏడాది కాలంగా ప్రశాంత్నీల్.. ప్రభాస్తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. చాలా సందర్భాల్లో కథ చర్చలు కూడా జరిగాయి. ప్రశాంత్ నీల్ సైతం పరోక్షంగా ఈ తెలుగు ప్రాజెక్ట్ గురించి లీక్లు ఇస్తూ వస్తున్నాడు. కానీ ప్రభాస్ ఆయన్నిపక్కన పెట్టి ఇటీవల బాలీవుడ్ సినిమాని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న మూడు సినిమాలు పూర్తి కావాలంటే మూడేళ్ళు పడుతుంది. ఈ లెక్కన ఇక ప్రశాంత్నీల్తో సినిమా ఇప్పట్లో ఉండదని వేరే చెప్పక్కర్లేదు.
ఇటీవల కాలంలో దర్శకుడి పెద్ద హ్యాండిచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ గురించి చెప్పాలి. ఆయన త్రివిక్రమ్తో సినిమా చేసే టైమ్లోనే మూడు ప్రాజెక్ట్ లు ప్రకటించారు. త్రివిక్రమ్ సినిమాతోపాటు సుకుమార్తో సినిమా, వేణు శ్రీరామ్తో `ఐకాన్`లను ప్రకటించారు. దీంతో వేణు శ్రీరామ్ సైతం ఎంతో ఖుషీ అయ్యాడు. కానీ ఆ ఆశలపై నీళ్ళు చల్లుతూ, ఇటీవల కొరటాల శివతో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో `వకీల్ సాబ్` చేస్తున్నారు. ఈ సినిమా సాకుతో వేణుకి హ్యాండిచ్చాడని టాక్.
ఈ జాబితాలో మరో స్టార్ ఎన్టీఆర్ చాలా రోజుల క్రితమే చేరాడు. ఆయన `జనతా గ్యారేజ్` సినిమా టైమ్లోనే నెక్ట్స్ రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తానని ప్రకటించాడు. సినిమా ఓకే అయ్యింది. కానీ స్క్రిప్ట్ విషయంలో తారక్ సాటిస్పై కాలేదని ఆయన్ని పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత బాబీతో `జై లవ కుశ` ప్రకటించారు. దీంతో వక్కంతం వంశీ.. బన్నీతో `నా పేరుసూర్య నా ఇల్లు ఇండియా` తీసి పరాజయం చవి చూసిన విషయం తెలిసిందే.
మాస్ మహారాజా రవితేజ కూడా సంతోష్ శ్రీనివాస్తో `థెరి` రీమేక్ చేస్తారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత సంతోష్కి హ్యాండిచ్చాడు రవితేజ. గోపీచంద్తో ప్రస్తుతం `క్రాక్` చిత్రాన్ని చేస్తున్న విసయం తెలిసిందే.
హీరోలు హ్యాండివ్వడమే కాదు.. పలువురు స్టార్ డైరెక్టర్లు సైతం హ్యాండిచ్చిన సందర్భాలున్నాయి. ఇటీవలే నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన పరశురామ్.. మహేష్ నుంచి పిలుపు రావడంతో చైతూకి హ్యాండిచ్చాడు.
మరోవైపు వెంకటేష్తో సినిమా చేయాల్సిన త్రివిక్రమ్.. పవన్ ప్రాజెక్ట్ `అజ్ఞాతవాసి` రావడంతో వెంకీకి హ్యాండిచ్చాడు. వెంకీ, త్రివిక్రమ్ సినిమాని అధికారికంగానూ ప్రకటించడం గమనార్హం. అయితే ఇప్పుడు ప్రతిష్టాత్మక 75వ చిత్రాన్ని మాటల మాంత్రికుడి దర్శకత్వంలోనే వెంకీ చేయబోతున్నట్టు టాక్.
దీంతోపాటు కొరటాల శివ నెక్ట్స్ రామ్చరణ్తో సినిమా ఉంటుందని భావించారు. ప్రస్తుతం `ఆచార్య` చేస్తుండగా, ఆ తర్వాత చెర్రీతో సినిమా చేయాబోతున్నాడని వార్తలు వినిపించాయి. కానీ అందరికి షాక్ ఇస్తూ బన్నీతో సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా టాలీవుడ్లోనే కాదు, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ఏ పరిశ్రమలోనైనా జరుగుతుంటుంది.