తెలుగు సినీ పరిశ్రమపై పట్టుకు చిరంజీవి ఎత్తుగడ: వరుస ఘటనలు ఇవే
మెగాస్టార్ చిరంజీవి వెండితెర మీద తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్న మాస్ హీరో. సామాన్యుడిగా వచ్చి అసామాన్యుడిగా ఎదిగి చిరు, ప్రస్తుతం పరిస్థితిలో తెలుగు సినిమాకు దిక్సూచిగా మారాడు. వివాదాలు, విషాదాలు, సమస్యలు, సంబరాలు అన్నింటిలో తానే ముందుండి ఇండస్ట్రీకి పెద్దగా దిక్కుగా వ్యవహరిస్తున్నాడు. గతంలో సినీ రాజకీయాల్లో కనిపించని చిరు ఇప్పుడెందుకు యాక్టివ్ అయ్యాడు.? తెలుగు సినీ ముఠామేస్త్రీగా మెగాస్టార్ మారటానికి కారణాలేంటి..?
హీరోగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి తన అభిమాన ఘనం మీద నమ్మకంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా తనకు నీరాజనాలు పట్టిన అభిమానులు రాజకీయాల్లో ఎర్ర తివాచీ పరుస్తారని భావించాడు. కానీ చిరు ఆశలు ఫలించలేదు. రాజకీయాల్లో ఘోర పరాభవాన్ని చూసిన మెగాస్టార్ తిరిగి సినిమాల వైపు అడుగులు వేశాడు.
రాజకీయాల్లో చిరును ఆదరించకపోయినా రీ ఎంట్రీలో హీరోగా మాత్రం మరోసారి జేజేలు పలికారు ఫ్యాన్స్. ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్తో ఘన స్వాగతం పలికారు. అయితే చిరు రీ ఎంట్రీ హడావిడి సినిమాలు చేయటం లేదు. తన ఇమేజ్కు, ఏజ్ కు తగ్గ కథలతోనే అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఇటీవల సైరా నరసింహారెడ్డితో మరోసారి ఆకట్టుకున్న మెగాస్టార్, ప్రస్తుతం ఆచార్య అనే సందేశాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరు, సినీ పరిశ్రమ బాగోగుల మీద కూడా దృష్టి పెట్టాడు. అప్పటి వరకు ఇండస్ట్రీకి పెద్దగా దిక్కుగా వ్యవహరించిన దాసరి హఠాన్మరణంతో ఆ స్థానాన్ని చిరు బర్తీ చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ బాధ్యతను తీసుకున్న మెగాస్టార్ ఇండస్ట్రీ తలెత్తుతున్న వివాదాల పరిష్కారంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మా ఎన్నికల సమయంలో తలెత్తిన వివాదం సద్దుమణగటంలో చిరు కృషి ఎంతో ఉంది. ఇటీవల జరిగిన మా అసోషియేషన్ ఎన్నికలు ఏ స్థాయిలో వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. అప్పుడు అధికారంలో ఉన్న శివాజీ రాజా వర్గం, ప్రత్యర్థిగా బరిలో దిగిన నరేష్ వర్గాలు వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లటంతో ఇరు వర్గాలను పిలిపించుకొని సర్థిచెప్పి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఎంతో కృషి చేశాడు చిరంజీవి.
అంతేకాదు ఆ సమయంలో కొత్త పాలక వర్గం ఎన్నిక విషయంలో ఇండస్ట్రీ లో నెలకొన్న సందిగ్దతను తొలగించేందుకు మెగా ఫ్యామిలీ నరేష్ వర్గానికి మద్దుతు తెలుపుతుందని సంకేతాలు ఇచ్చి వారి విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. అయితే పవన్, శ్రీరెడ్డి వ్యవహారంలో శివాజీ రాజా సరిగ స్పందించలేదని మెగా ఫ్యామిలీ నరేష్కు మద్దతిచ్చిందన్న ఆరోపణలు కూడా వినిపించాయి.
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల తరువాత కూడా మాలో వివాదాలు కొనసాగాయి. గెలిచిన వర్గంలోని నరేష్, జీవితా రాజశేఖర్ల మధ్య వివాదాలు రావటంతో ఆ వివాదాలను సెటిల్ చేయటంలోనూ కీలక పాత్ర పోషించాడు. వివాదాలకు కారణమైన రాజశేఖర్తో రాజీనామా చేయించటంతో అధ్యక్ష బాధ్యతలను బెనర్జీ చేతికి ఇవ్వటం లాంటి కీలక మార్పుల వెనుక చిరు ఉన్నారన్న విషయం తెలిసిందే.
సినీ రంగం అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా తాను పనిచేస్తున్నాని చెప్పేందుకు మెగాస్టార్ చాలా ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఆంధ్రప్రదేశ్లో సినీ రంగం అభివృద్ధి కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సహకరించాల్సిందిగా కోరారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం షూటింగ్ ల విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తూ జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
అందరివాడు అనిపించుకునేందుకు అందరికన్నా ముందే ఉంటున్నాడు మెగాస్టార్. భారత్ కరోనా ప్రభావం కనిపిస్తున్న తొలి నాళ్లలోనే తన సినిమా ఆచార్య షూటింగ్ను నిలిపివేసి అందరు అదే బాటలో నడవాలని కోరాడు. అతి తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేయాలని భావించినా పరిస్థితుల కారణంగా అది కుదరదని షూటింగ్ను వాయిదా వేశాడు.
అంతేకాదు ప్రతీ చిన్న విషయంలోనూ సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలర్ట్ చేస్తూ కరోనా విషయంలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ పాటలో నటించటం, అమితాబ్ సారథ్యంలో రూపొందిన షార్ట్ ఫిలింలో నటించటం లాంటి వి కూడా చేసి అభిమానులకు కరోనా విషయంలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు.
సేవా కార్యక్రమాల్లోనూ ముందే ఉన్నాడు మెగాస్టార్. కరోనా సమయంలో కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు తన వంతుగా కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. అంతేకాదు సీసీసీ (కరోనా క్రైసిస్ చారిటీ) పేరుతో సంస్థను స్థాపించి భారీగా విరాళాలు సేకరించేందుకు తొలి అడుగు వేశాడు. అదే సమయంలో లాక్ డౌన్ కారణంగా ఏర్పడ్డ రక్తదాతల కొరతను కూడా తన బ్లెడ్ బ్యాంక్ ద్వారా తగ్గించే ప్రయత్నం చేశాడు చిరు.
ఇండస్ట్రీకి ప్రధాన సమస్యగా మారిన గాసిప్స్ వ్యవహారంలో విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలిచిన చిరు, ఇండస్ట్రీ అంతా ఒకే తాటి మీద ఉందన్న సందేశాన్ని ఇవ్వటంలో సక్సెస్ అయ్యాడు. చిరు మద్దతు తెలపటంతో సినీ ప్రముఖులంతా ఈ విషయంలో విజయ్ దేవరకొండకు అండగా నిలిచారు.
లాక్ డౌన్ కారణంగా 60 రోజులుగా నిలిచిపోయిన సినీ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించటంలోనూ చిరు ముందే ఉన్నాడు. తాను స్పందించి తన ఇంట్లో సినీ పెద్దలతో మీటింగ్ నిర్వహించాడు. ఈ మీటింగ్కు ప్రభుత్వ వర్గాలను కూడా ఆహ్వానించి సినీ కార్యక్రమాలు ప్రారంభించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు.
అంతేకాదు తానే ముందుండి సినీ పెద్దలను తీసుకొని కేసీఆర్ను కలిసి సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను షూటింగ్లకు అనుమతిస్తే పరిశ్రమ తీసుకునే జాగ్రత్తలను వివరించి షూటింగ్కు పర్మిషన్ ఇవ్వాలని కోరాడు. చిరు నాయకుడిగా ముందుండి చేస్తున్న ఈ ప్రయత్నాలకు ప్రభుత్వం నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.
దాసరి మరణం తరువాత ఇండస్ట్రీలో ఏర్పడిన నాయకత్వ లేమిని చిరు బర్తీ చేశాడు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఇండస్ట్రీలోని వివాదాల పరిష్కారంలోనూ అంతా తానే అయి వ్యవహరిస్తున్నాడు చిరు. ఇలా అన్ని విషయాల్లో నేనే అంతా అంటూ వ్యవహరిస్తున్న చిరును మిగతా సీనియర్లు కూడా సమర్థిస్తారా..? అన్న విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.