`చిరంజీవ` ఓటీటీ మూవీ రివ్యూ.. రాజ్ తరుణ్ ఈ చిత్రంతోనైనా హిట్ కొట్టాడా?
రాజ్ తరుణ్ హీరోగా నటించిన మూవీ `చిరంజీవ`. కుషిత కల్లపు హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి అదిరే అభి దర్శకుడు. ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలో ఈ రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ ఓటీటీ సినిమా ఎలా ఉందంటే?

చిరంజీవ` ఓటీటీ మూవీ రివ్యూ
ఒకప్పుడు లవర్ బాయ్గా పేరుతెచ్చుకున్న రాజ్ తరుణ్ క్రమంగా డౌన్ అవుతూ వచ్చారు. ప్రారంభంలో బ్యాక్ టూ బ్యాక్ మూడు నాలుగు హిట్లతో స్టార్ స్టేటస్ని సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. తాజాగా రాజ్ తరుణ్ `చిరంజీవ` అనే చిత్రంలో నటించారు. ఇందులో కుషిత కల్లపు హీరోయిన్గా నటించింది. జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, కిరీటి, టేస్టీ తేజ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంతో జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాహుల్ అవురెడ్డి, సుమాసిని రాహుల్ నిర్మించిన ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతుంది. ఈ నెల 7 (శుక్రవారం) నుంచి `ఆహా`లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమాని ముందుగానే మీడియాకి ప్రదర్శించారు. సినిమా ఎలా ఉంది? రాజ్ తరుణ్కి కమ్ బ్యాక్ ఇచ్చే మూవీ అవుతుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
`చిరంజీవ` సినిమా కథేంటంటే?
రాజ్ తరుణ్ కి చిన్నప్పట్నుంచి స్పీడెక్కువ. తన స్పీడ్ని కరెక్ట్ సూట్ అయ్యేది ఏదైనా ఉందంటే అది అంబులెన్స్ డ్రైవింగ్. దీంతో అంబులెన్స్ నడిపిస్తుంటాడు. అయితే చిన్నప్పుడు పదే పదే ఏడుస్తుంటాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక పేరెంట్స్ బాధపడుతుంటారు. ఇంతలో ఒక సాధువు వచ్చి .. బాబు మామూలు వ్యక్తి కాదని, ప్రత్యేక శక్తులున్నాయని, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతాడు. దాన్ని వాళ్లు పెద్దగా పట్టించుకోరు. మొత్తానికి పెరిగి పెద్దవాడై అంబులెన్స్ నడిపిస్తుంటాడు. ఆయన్ని హీరోయిన్ కుషిత కల్లపు ప్రేమిస్తుంటుంది. ఇద్దరు ప్రేమలో మునిగితేలుతుంటారు. అయితే ఓ రోజు అంబులెన్స్ లో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది రాజ్కి. దీంతో అప్పట్నుంచి తనకు మనుషులపై మీటర్ కనిపిస్తుంది. అది వాళ్ల ఆయుష్షు(ఏజ్) అని తెలుసుకుంటాడు. తన ముందే కొందరు జీవితకాలం ముగిసి చనిపోతుంటే బాధపడుతుంటాడు. కొందరిని ఆపే ప్రయత్నం చేసినా మరణిస్తూనే ఉంటారు. ఆ లైఫ్ మీటర్ ని తనకు ఉపయోగించుకుని అప్పుల బాధ నుంచి బయటపడతాడు. తన లవర్ కుటుంబాన్ని సేవ్ చేస్తాడు. విలన్కి హెల్ప్ చేస్తాడు. అనుకోకుండా ఓ రోజు మార్కెట్లో చాలా మంది పిల్లలను చూస్తాడు రాజ్ తరుణ్. వాళ్లందరు ఒక్క రోజులోనే చనిపోతారనేలా మీటర్ కనిపిస్తుంది. వాళ్లు ఎవరు, ఎందుకు వచ్చారనేది ఆరా తీయగా, ఎమ్మెల్యే రాజారవీంద్ర సభకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన మంత్రి పదవి కోసం కేంద్రం వద్ద మార్కులు కొట్టేసేందుకు, సింపతి గేమ్ ఆడేందుకు ఒక సభ ఏర్పాటు చేస్తాడు. అందులోనే బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ చేస్తారు. ఈ విషయం గ్రహించిన రాజ్ తరుణ్ ఆ ప్రాణనష్టాన్ని ఆపేందుకు ఏం చేశాడు? ఎమ్మెల్యేని ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగిలిన సినిమా.
`చిరంజీవ` మూవీ విశ్లేషణ
మనుషులను చూసినప్పుడు వాళ్ల ఆయుష్షు మీటర్ కనిపించడమనేది చాలా కొత్త కాన్సెప్ట్. మన తెలుగులో ఇలాంటి కథతో సినిమాలు రాలేదు. ఇదే ఈ సినిమాకి ఆయువు పట్టు అని చెప్పొచ్చు. మనుషులు జీవితకాలం ఎంత అనేది తెలిసినప్పుడు హీరో ఏం చేశాడు? ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు? ఎలాంటి సంఘర్షణని అనుభవించాడు, మనిషి ప్రాణాలు కాపాడేందుకు ఆయన చేసే పోరాటం ఏంటనేది ఈ మూవీ. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సినిమా సాగుతుంది. ఫస్టాఫ్ కేవలం పాత్రలను ఎస్టాబ్లిష్ చేశారు. కథలో వెళ్లేందుకు ఎక్కువ టైమ్ తీసుకున్నారు. ముఖ్యంగా హీరో పాత్రని ఆవిష్కరించారు. ఆయన లైఫ్ ఎలా ఉంటుందనేది చూపించారు. సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం, వారి కష్టాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత బతుకు తెరువు కోసం హీరో అంబులెన్స్ నడిపించడం. ఈ అంబులెన్స్ నడిపే క్రమంలో ఎక్కువగా దాడులనే ఫేస్ చేసే పరిస్థితి నెలకొంది. ఇది ఫన్నీగా సాగుతుంది. నవ్వులు పూయిస్తుంది. ఇక ఆయుష్షు మీటర్ తెలిసిన తర్వాత కథ ఆసక్తికరంగా మారింది. ఎంగేజింగ్గా వెళ్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంటుంది. ప్రాణాలు కాపేందుకు హీరో ప్రయత్నించే క్రమంలో వచ్చే సీన్లు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఎంగేజ్ చేస్తాయి. ఆ తర్వాత వచ్చే ట్విస్టులు ఆసక్తికరంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో మరో వచ్చే సీన్లు ఉత్కంఠకి గురిచేస్తాయి. అయితే మొదటి భాగం సినిమా కాస్త స్లోగా సాగుతుంది. చాలా డ్రైగా అనిపిస్తుంది. సీరియల్ స్టయిల్ కనిపిస్తుంది. అందులో కామెడీ ప్రయత్నించినా అంతగా వర్కౌట్ కాలేదు. అదే సమయంలో ఎమోషన్స్ ని బలంగా చూపించలేదు. ట్విస్ట్ లు కూడా ఇంకా బాగా చూపించాల్సింది. కాన్సెప్ట్ బాగుంది, కానీ దాన్ని అంతే బాగా రక్తికట్టించేలా ఆవిష్కరించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మూవీ ఇంకా బాగుండేది.
`చిరంజీవ` మూవీ నటీనటులు, టెక్నీషియన్ల పనితీరు
రాజ్ తరుణ్ సినిమాలో చాలా బాగా నటించాడు. పాత్రకి బాగా సూట్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత పాత రాజ్ తరుణ్ని చూపించాడని చెప్పొచ్చు. సినిమాని తన భుజాలపై మోశాడు. హీరోయిన్గా కుషిత కల్లపు ఉన్నంతసేపు మెప్పించింది. అలరించింది. వీరి మధ్య లవ్ స్టోరీ అలరిస్తుంది. ఇక ఇమ్మాన్యుయెల్ కాసేపు కనిపించి నవ్వించాడు. అలాగే కిరీటి పాత్ర ఆద్యంతం ఎమోషనల్గా ఉంటుంది. రాజా రవీంద్ర, సంజయ్ విలన్ రోల్స్ లో అదరగొట్టారు. మిగిలిన నటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. రాకేష్ ఎస్ నారాయణ్ కెమెరా వర్క్ బాగుంది. సాయి మురళి ఎడిటింగ్ షార్ప్ చేయాల్సింది. అచ్చు రాజమణి సంగీతం ఫర్వాలేదు. ఇంకా బాగా చేయాల్సింది. చాలా చోట్ల సీరియల్ మ్యూజిక్ని తలపించింది. దర్శకుడు అదిరే అభి(అభినయ కృష్ణ) ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. తన బెస్ట్ ఇచ్చాడు. ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇందులో కథని ఎస్టాబ్లిష్ మాత్రమే చేశారు, రానున్న సీక్వెల్స్ పై ఆసక్తిని రేకెత్తించారు. అదే సమయంలో సినిమా కోసం తన కష్టం కనిపిస్తుంది. ఆయనకు మంచి భవిష్యత్ ఉందని చెప్పొచ్చు.
ఫైనల్గా: సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన `చిరంజీవ` ఓటీటీలో చూడదగ్గ మూవీ.
రేటింగ్ః 2.5