ఎన్నికల్లో తారలు.. అందరూ ప్లాపే... కొందరే హిట్టు
ప్రతి గురువారం సినీతారలు తమ అదృష్టాన్ని ఏదో ఒక సినిమా ద్వారా ఎవరో పరీక్షించుకుంటూ ఉంటారు.
ప్రతి గురువారం సినీతారలు తమ అదృష్టాన్ని ఏదో ఒక సినిమా ద్వారా ఎవరో పరీక్షించుకుంటూ ఉంటారు. ఈ గురువారం మాత్రం... కొందరు సినీ నటులు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని టెస్ట్ చేసుకున్నారు. ఈ పరీక్షలో కొందరు పాస్ మార్కులతో హిట్ కొట్టగా... మరికొందరు మాత్రం డిజాస్టర్ సినిమా మాదిరి ఢీలా పడిపోయారు. ఆ తారలు ఎవరు? ఎక్కడ నుంచి పోటీ చేశారు? వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూసేయండి
రోజా : చిత్తూరు జిల్లా నగరి నుంచి సినీనటి ఆర్కే రోజా విజయం సాధించారు. ఆమెకు 2,681 ఓట్ల ఆధిక్యం లభించింది.
ప్రకాష్ రాజ్: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఓటమి పాలయ్యారు. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ప్రకాశ్ రాజ్ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ స్థానం నుంచి పోటి చేసిన బీజేపీ అభ్యర్థి 6 లక్షలకు పైగా ఓట్లు సాధించగా ప్రకాష్ రాజ్కు కనీసం 30 వేల ఓట్లు కూడా రాలేదు.
సుమలత: మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన సినీనటి సుమలత విజయం సాధించారు.
నిఖిల్ గౌడ : మాండ్యా నియోజకవర్గం నుండి సుమలతకి పోటీగా కాంగ్రెస్-జేడీఎస్ పొత్తులో భాగంగా జేడీఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పరాజయం పాలయ్యారు.
పవన్ కళ్యాణ్ : సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి... ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. సినీ నటుడుగా... లక్షల సంఖ్యలో అభిమానులను సాధించుకున్న పవన్ కళ్యాణ్... రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల సమయంలోనే పార్టీ ఏర్పాటు చేసిన పవన్... 2019లో ఎన్నికల బరిలో నిలబడ్డారు. విశాఖటప్నంలోని గాజువాక నియోజకవర్గం నుంచి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి ఆయన పోటీ చేశారు. అయితే.... ఈ రెండు స్థానాల్లోనూ ఆయనకు పరాజయం తప్పలేదు. జనసేన అభ్యర్థుల విజయం సంగతి పక్కన పెడితే... కనీసం పార్టీ అధినేతకు కూడా విజయం దక్కకపోవడం గమనార్హం.
బాలకృష్ణ : సినీ నటుడు బాలకృష్ణ విజయం దిశగా దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందని బాలయ్య... ఈ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. కాగా... ఈ ఎన్నికల్లోనూ ఆయన విజయం సొంతం చేసుకుంటున్నారు.
ఊర్మిళా మటోండ్కర్ : ముంబై నార్త్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఊర్మిళ తన ప్రత్యర్ధి అయిన గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోబోతుంది. రాజకీయాల్లోకి తొలిసారి అడుగుపెట్టిన ఊర్మిళ భారీ ఆధిక్యంతో ఓడిపోబోతున్నట్టు తేలడంతో ఆమె అభిమానులు కలవరపడుతున్నారు.
జయప్రద : రాంపూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జయప్రద సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఆజం ఖాన్ తో పోటీకి దిగింది. గతంలో రెండు సార్లు ఇదే స్థానంలో జయప్రద గెలుపొందారు. సమాజ్ వాదీ అభ్యర్థిగా 2004, 2009 ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన ఆమెకు .. ఈ సారి ఎదురుదెబ్బ తగిలింది.
గురుదాస్ పూర్ బీజేపీ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసిన సన్నీడియోల్ గెలుపు దిశగా దూసుకుపోతున్నాడు.