ప్రభాస్, సల్మాన్ ఖాన్లను వాడుకోబోతున్న అల్లు అర్జున్.. చిరంజీవి, వెంకటేష్లతో సల్లూభాయ్.. సరికొత్త గేమ్
టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఊపందుకుంది. దాదాపు పది సినిమాలు పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ప్రభాస్, బన్నీ, సల్మాన్ ఖాన్, చిరంజీవి, వెంకటేష్ ల మధ్య మరో సరికొత్త గేమ్ స్టార్ట్ అయ్యింది.
pushpa
pushpa
పాన్ ఇండియా సినిమాలంటే హీరో ఇతర భాషల్లో నటించడం, ఇతర భాషల నటులను తమ సినిమాల్లో నటింప చేయడం. ఇతర భాషల్లోనూ తెరకెక్కించడం కలిపి పాన్ ఇండియా సినిమా అవుతుంది. ఈ పాన్ ఇండియా చిత్రాల కోసం లాంగ్వేజ్ అనే బారియర్స్ ని బ్రేక్ చేస్తున్నారు. సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ గేమ్ స్టార్ట్ కాబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఇది ఈ నెల(డిసెంబర్) 17న విడుదల కాబోతుంది. దీనికి సంబందించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా షురూ చేశారు. ఈ నెల 6న ట్రైలర్ని విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలతోపాటు ముంబయి, కేరళ, బెంగుళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లోనూ ప్రమోషన్ చేయబోతున్నారు.
అందులో భాగంగా హైదరాబాద్లో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ప్రభాస్ని గెస్ట్ గా ఆహ్వానించబోతున్నారట. ప్రభాస్ `రాధేశ్యామ్`లో నటిస్తున్నారు. ఇది సంక్రాంతికి విడుదల కానుంది. దీంతో రెండు కలిసొస్తాయని భావిస్తున్నారు. నిజానికి ప్రభాస్, బన్నీ మంచి స్నేహితులు. కాకపోతే ఈ మధ్య ఎవరికి వారు తమ ప్రాజెక్ట్ ల్లో బిజీగా ఉండటంతో కలుసుకోవడం కుదరలేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ని `పుష్ప` ఈవెంట్కి గెస్ట్ గా ఆహ్వానించబోతున్నారట బన్నీ. ఈ ఈవెంట్ని భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్నారని టాక్.
మరోవైపు ముంబయిలోనూ ప్లాన్ చేస్తున్నారట. అయితే అక్కడ సల్మాన్ని బన్నీ వాడుకోబోతున్నారని టాక్. సల్మాన్ హోస్ట్ గా రన్ అవుతున్న `బిగ్బాస్ 15` షోలో అల్లు అర్జున్ మెరబోతున్నారట. ఆ షోలో గెస్ట్ గా కనిపించి తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారట. సల్మాన్ ఖాన్ టాలీవుడ్పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో తెలుగు సినిమాలను, తెలుగు హీరోలను ఎంకరేజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా బన్నీ సినిమా ప్రమోషన్కి సహకరించబోతున్నారట. ఇదిలా ఉంటే సల్మాన్ నటించిన `రాధే` చిత్రంలో బన్నీ సినిమాలోని `సీటీమార్..` అనే పాటని రీమిక్స్ చేసుకున్నారు సల్మాన్. దీంతో వీరిద్దరి మధ్య మంచి ర్యాపో ఏర్పడింది. దాన్ని ఇప్పుడు వాడుకోబోతున్నారట బన్నీ.
ఇదిలా ఉంటే బాలీవుడ్ కండల వీరుడిగా పేరుతెచ్చుకున్న సల్మాన్ ఖాన్.. సౌత్పై కన్నేశాడు. ముఖ్యంగా ఆయన దృష్టి ఇప్పుడు టాలీవుడ్పై పడింది. తెలుగులో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `గాడ్ఫాదర్` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారట. ఇటీవల తాను నటించిన `అంతిమ్` చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా సల్మాన్ హైదరాబాద్లో సందడి చేశారు.
ఈ సందర్భంగా తెలుగులో చేయబోతున్న సినిమాల గురించి ఓపెన్ అయ్యాడు సల్మాన్. చిరంజీవి సర్ తనని `గాడ్ఫాదర్`లో ఓ రోల్ కోసం అడిగారు. ఆయన కోసం సినిమా చేస్తున్నా అని తెలిపారు. ఆయన ఇందులో ఏ పాత్ర పోషిస్తున్నాననే విషయం చెప్పలేదుగానీ, మాతృకలోని పృథ్వీరాజ్ పాత్రని పోషిస్తున్నట్టు తెలుస్తుంది. `గాడ్ఫాదర్` మలయాళంలో రూపొందిన `లూసిఫర్`కి రీమేక్ అనే విషయం తెలిసిందే. మోహన్రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ నటించిన పాత్రని సత్యదేవ్ చేస్తున్నాడని తెలుస్తుంది. నయనతార కథానాయికగా నటిస్తుంది.
మరోవైపు వెంకటేష్తోనూ ఓ సినిమా చేస్తున్నట్టు ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ వెల్లడించారు. అదే సమయంలో ఇటీవల నిర్మాత సురేష్బాబు స్పందిస్తూ వెంకటేష్ నుంచి ఓ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ ని త్వరలో అనౌన్స్ చేయబోతున్నామని తెలిపారు. బహుశా అది వెంకీ-సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో వస్తోన్న సినిమానే అని తెలుస్తుంది. వెంకీకి, సల్మాన్ మధ్య మంచి స్నేహం ఉంది. చాలా సందర్భాల్లో వీరిద్దరు కలుసుకున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ వంటి వాటిలో కలిసి సందడి చేశారు. మరోవైపు వెంకీ మలయాళ హిట్ మూవీ `డ్రైవింగ్ లైసెన్స్` సినిమా రీమేక్లో నటిస్తున్నట్టు వార్త వైరల్ అవుతుంది. మరి ఇందులో సల్మాన్ చేస్తున్నాడా? లేక వెంకీ-రానా కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. మరి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారా? అనేది సస్పెన్స్ గా మారింది. కానీ సల్మాన్ మాత్రం తెలుగులో సినిమాలు చేస్తుండటంతో ఈ వార్త ఫ్యాన్స్ ని చాలా ఎగ్జైట్ కి గురి చేస్తుంది.
`బాహుబలి` తర్వాత తెలుగు సినిమా స్థాయి మారిపోయింది. ఒకప్పుడు బాలీవుడ్లో భారీ సినిమాలు వచ్చేవి. ఇప్పుడు దాన్ని కూడా దాటిపోయింది తెలుగు చిత్ర పరిశ్రమ. పదికిపైగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. తెలుగు మార్కెట్ విస్తరించడంతో మిగిలిన భాషల హీరోలు టాలీవుడ్పై కన్నేశారు. ఇప్పటికే దళపతి విజయ్, ధనుష్, శివకార్తికేయన్, విశాల్, ఫహద్ ఫాజిల్, మోహన్లాల్ వంటి హీరోలు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోలు కూడా తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని టాక్.