అభిమానిపై బాలకృష్ణ ఫైర్.. వాడు నాకు కనిపించొద్దంటూ బోయపాటికి వార్నింగ్
బాలకృష్ణ మరోసారి చర్చనీయాంశంగా మారారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆయన అభిమానిపై ఫైర్ అయ్యారు. సెల్ఫీ దిగేందుకు వచ్చిన అభిమానిని తనకు ఈ రోజు కనిపించొద్దంటూ మండిపడ్డారు.

మరోసారి ఫ్యాన్స్ పై బాలయ్య ఫైర్
నందమూరి నటసింహం బాలకృష్ణ ఐదు దశాబ్దాలుగా నటుడిగా కొనసాగుతున్నారు. ఈ మధ్యనే యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ ఈవెంట్ని కూడా నిర్వహించారు. అయితే బాలయ్య తరచూ వివాదాలకు కేరాఫ్గా నిలుస్తుంటారు. ఎక్కువగా ఆయన అభిమానుల విషయంలో నోరు జారుతుంటారు. వారిపై ఫైర్ అవుతుంటారు. అభిమానులను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన అనుమతి లేకుండా ఫోటోలు తీసుకుంటే అస్సలు సహించరు. అదే సమయంలో మీద మీదకు వచ్చినా ఊరుకోరు. బాడీగార్డ్స్ కంట్రోల్ చేయడం కాదు, ఆయనే కంట్రోల్ చేస్తారు. తన వద్దకు వస్తే దబిడి దిబిడే అని చెప్పొచ్చు. దీంతో చాలా మంది ఆయన వద్దకు రావాలంటే భయపడతారు.
వైజాగ్ ఎయిర్పోర్ట్ లో బాలయ్య హల్చల్
కానీ కొందరు అభిమానంతో, బాలయ్యతో ఫోటో దిగాలని అత్యుత్సాహం చూపిస్తుంటారు. మీద మీదకు వస్తుంటారు. ఆయన్ని ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి వారి విషయంలో మాత్రం బాలకృష్ణ అస్సలు సహించరు, ఇచ్చిపడేస్తారు. తాజాగా ఓ అభిమానికి గట్టిగా ఇచ్చాడు. బాలకృష్ణ, బోయపాటి శ్రీనుతోపాటు `అఖండ 2` టీమ్ మంగళవారం వైజాగ్ వెళ్తున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగి బయటకు వెళ్తుండగా, కొందరు లేడీ అభిమానులు వచ్చారు. వారితోపాటు కొందరు మేల్స్ ఫ్యాన్స్ కూడా ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. మహిళలను దాటుకుని వస్తోన్న ఒక అభిమానిని బాలయ్య గమనించి వార్నింగ్ ఇచ్చాడు.
వాడు ఈ రోజున నాకు కనిపించొద్దు
`హెయ్ వెళ్లు, ఎవడు రమ్మన్నారు నిన్ను, వాడిని ఎవరు రమ్మన్నారు. వాడు నాకు కనిపించొద్దు, సాయంత్రం వరకు నాకు కనిపించొద్దు` అంటూ తన బాడీ గార్డ్స్ కి చెప్పాడు. అదే సమయంలో తన పక్కనే ఉన్న దర్శకుడు బోయపాటికి కూడా వార్నింగ్ ఇచ్చాడు. అతని విషయంలో కారు ఎక్కుతూ కూడా కోపంగా కనిపించాడు బాలయ్య. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాగా హల్చల్ చేస్తుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చాలా వరకు నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు. బాలయ్యని ట్రోల్ చేస్తున్నారు. అయితే అతను మహిళమీదకు రావడం వల్లే బాలయ్య అలా రియాక్ట్ కావాల్సి వచ్చిందని ఆయన ఫ్యాన్స్ కామెంట్ చేయడం విశేషం. అయితే అందులో తనతో ఫోటో తీసుకోవడానికి వచ్చిన మహిళలకు మాత్రం ఆయన నవ్వుతూ ఫోటోలకు పోజులివ్వడం విశేషం.
వైజాగ్లో `అఖండ 2` సాంగ్ లాంచ్ ఈవెంట్
ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ 2` చిత్రంలో నటిస్తున్నారు. సంయుక్త హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన `అఖండ`కిది సీక్వెల్. బాలయ్య కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా, 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ విడుదలైంది. ఈ రోజు(మంగళవారం) సాయంత్రం రెండో పాటని విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఈవెంట్ వైజాగ్లోని జగదాంబ థియేటర్లో నిర్వహిస్తున్నారు. ఇక ఈ మూవీకి డిసెంబర్ 5న పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేస్తున్నారు.

