'భోళా శంకర్' లో వెన్నుపోటు డైలాగు.. ఎవరిని ఉద్దేశించి?
మొన్నటికి మొన్న బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు ని ఉద్దేశించి డైలాగులు, డాన్స్ పెట్టడంతో భోళా శంకర్ లో కూడా అలాంటివి ఏమన్నా ఉన్నాయా ..

ఎలక్షన్ సమయం దగ్గర పడుతూండటంతో అంతటా పొలిటికల్ వేవ్ నడుస్తోంది. మామూలుగా మాట్లాడినా కూడా అందులో పొలిటికల్ కౌంటర్ ఏమన్నా ఉందేమో అని వెతుక్కునే పరిస్దితి కనపడుతోంది. ఈ నేపధ్యంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయ్యితే అందులో ఏమన్నా రాజకీయ కౌంటర్ లు ఉన్నాయేమో అని వెతకటం కామన్ థింగ్. మొన్నటికి మొన్న బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు ని ఉద్దేశించి డైలాగులు, డాన్స్ పెట్టడంతో భోళా శంకర్ లో కూడా అలాంటివి ఏమన్నా ఉన్నాయా అనే సందేహం కలగటం సహజం. మరి ఈ సినిమాలో పొలిటికల్ సెటైర్స్ ఉన్నాయా...
Bhola Shankar
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)హీరో గా నటించిన తాజా సినిమా 'భోళా శంకర్' (Bhola Shankar). మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటించారు. చిరు సోదరిగా కీర్తీ సురేష్, ఆమెకు జోడీగా సుశాంత్ కనిపించారు. తమిళంలో అజిత్ హీరోగా నటించిన 'వేదాళం' రీమేక్ గా చేసిన చిత్రమిది. తెలుగులో చిరంజీవి ఇమేజ్, ఆయన నుంచి అభిమానులు ఆశించే అంశాలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేశామని చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ తెలిపారు. అయితే అదే సమయంలో ఈ సినిమా సెకండాఫ్ ఓ డైలాగు ఉంది. వెన్నుపోట్లు నాకు మామూలే అనేది ఆ డైలాగు.
కథ ప్రకారం...సెకండాఫ్లో చిరంజీవి ఒంటిరిగా నడుచుకుంటూ వస్తూంటాడు. రౌడీలు(రవిశంకర్) చిరంజీవిని పొడిచేసి వెళ్లిపోతారు. పడిపోయి ఉన్నప్పుడు కీర్తిసురేష్ వచ్చి కాపాడే ప్రయత్నం చేస్తుంటుంది. వెనకాలు పొడవడంతో రక్తం కారుతూంటుంది. అయ్యో రక్తమంతా కారిపోతుందని ఆమె బాధపడుతుంటే, ఇలాంటి వెన్నుపోట్లు నాకు మామూలే అని ఆమెతో అంటాడు.. అయితే ఈ డైలాగు లో పొలిటికల్ యాంగిల్ ఏమన్నా ఉందేమో అని వెతుకుతున్నారు. చిరంజీవికు పార్టీ పెట్టిన టైమ్ లో ఎవరైనా వెన్నుపోటు పొడిచారా లేక సినిమాల్లో తన అనుకున్న వాళ్లు వెన్నుపోటు పొడిచారా..ఏమిటి అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
సినిమా విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ కాని కామెడీ, చిరంజీవికి స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉండడం లాంటి మైనస్ లు వినిపిస్తున్నాయి. ఇక సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే సన్నివేశాలు పడడం ప్లస్. ఎబ్బెట్టుగా అనిపించే ఫన్నీ సీన్స్, మ్యూజిక్ పై ఇంకాస్త ద్రుష్టి పెట్టాల్సింది అనే కామెంట్స్ ప్రేక్షకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఓవరాల్ గా భోళా శంకర్ చిత్రం కష్టం అంటున్నారు. ఇక చిరు క్రేజీ ఈ చిత్రాన్నిబాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి వరకు తీసుకెళుతుందో చూడాలి.
‘భోళా శంకర్’ వెనుక చాలా బుర్రలు పని చేసినట్లు మెహర్ వెల్లడించాడు. సీనియర్ రైటర్ సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ పర్యవేక్షణ చేశారని.. ‘వకీల్ సాబ్’కు మాటలు రాసిన మామిడాల తిరుపతి స్క్రిప్టుతో పాటు మేకింగ్ విషయంలో కీలక పాత్ర పోషించాడని మెహర్ వెల్లడించాడు. ‘వకీల్ సాబ్’లో తెలంగాణ స్లాంగ్ డైలాగులను తిరుపతి బాగా రాశాడని.. దీంతో ‘భోళా శంకర్’లో చిరు పాత్రకు ఆ యాసలోనే తనతో డైలాగులు రాయించామని మెహర్ తెలిపాడు. చిరు పాత్ర హైదరాబాద్లో ఉన్నంత వరకు ఈ స్లాంగ్లో మాట్లాడుతుందని.. కలకత్తా నేపథ్యంలో సాగే కథలో మామూలుగా యాసే ఉంటుందని మెహర్ తెలిపాడు.
ఇక ‘టచ్ చేసి చూడు’తో దర్శకుడిగా మారిన విక్రమ్ సిరికొండ కూడా తన రైటింగ్ టీంలో కీలక వ్యక్తి అని.. కన్నన్ అనే మరో రైటర్ కూడా ఈ సినిమాకు పని చేశాడని మెహర్ వెల్లడించాడు. తన మిత్రులైన హరీష్ శంకర్, అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్లు తనకు సక్సెస్ రావాలన్న ఉద్దేశంతో ఈ సినిమాకు రైటింగ్ సాయం చేయడానికి ముందుకు వచ్చారని.. ఒక వెర్షన్ కావాలన్నా రాసి ఇస్తామన్నారని.. కానీ తాను వారి సాయం తీసుకోకుండా తన టీంతోనే పని చేశానని మెహర్ చెప్పాడు.