కరోనా ఎఫెక్ట్.. రోజుకు రూ. 35 సంపాదిస్తున్న కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్
బాహుబలి తరువాత జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న సౌత్ సినిమా కేజీఎఫ్, పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ కన్నడ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఘన విజయం సాధించింది. దీంతో సినిమాలో నటించిన నటీనటులతో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్, సంగీత దర్శకుడు రవీ బస్రూర్లకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు రవీ బస్రూర్ తన సోషల్ మీడియా పేజ్ లో ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశాడు. కరోనా ఎఫెక్ట్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని సినిమాల షూటింగ్ లు ఆపేశారు. దీంతో కేజీఎఫ్ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది.
దీంతో తన సొంత ఊరికి వెళ్లిపోయిన సంగీత దర్శకుడు రవి బస్రూర్ దేవుళ్లకు వేసే నగలు, ఆభరణాలు, ఇతర పనిముట్ల తయారీలో తన తండ్రికి సాయం చేస్తున్నాడు.
ఈ వీడియోను స్వయంగా సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన రవి, రోజు 35 రూపాయలు సంపాదిస్తున్నట్టుగా వెల్లడించాడు.
రవి బస్రూర్ స్వగ్రామం ఉడిపి దగ్గర లోని కుందాపురా, అక్కడ ఆయన కుటుంబం ఇంక కుల వృత్తిలోనే ఉంది. ఈ సందర్భగా ఆయనకు తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకునే అదృష్టాన్నీ దేవుడు తనకి ఇచ్చాడని ఆనందం వ్యక్తం చేశాడు.
కేజీఎఫ్ చాప్టర్ 2లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రవీనా టండన్, రావూ రమేష్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక కేజీఎఫ్ సినిమా విషయానికి వస్తే యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అనంత్ నాగ్, మాళవిక అవినాష్లు కీలక పాత్రల్లో నటించారు.
తొలి భాగం ఘనవిజయం సాధించటంతో సీక్వెల్ ను మరింత భారీగా రూపొందిస్తున్నారు. దాదాపు తొలి భాగానికి పనిచేసిన టీమే ఈ సినిమాకు కూడా పనిచేస్తోంది.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను అక్టోబర్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.