తెలుగు హీరోయిన్ పాయల్కు కరోనా పాజిటివ్.. అసలు విషయం ఇదే!
కరోనా మహమ్మారి జన జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తోంది. ప్రజలు గడప దాటలేని పరిస్థితి ఏర్పడటంతో ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫేక్ న్యూస్ కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్కు కరోనా సోకిందన్న వార్తలు వైరల్గా మారాయి.
తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్న అందాల భామ పాయల్ ఘోష్. తాజాగా ఈ అందాల భామకు కరోనా పాజటివ్ అన్న వార్తలు మీడియాలో వైరల్గా మారాయి.
ఇటీవల అనారోగ్య కారణంతో పాయల్ ఆసుపత్రికి వెళ్లటంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో కూడా వైరల్ కావటంతో పాయల్ స్పందించాల్సి వచ్చింది.
దీంతో పాయల్ ఘోష్ క్లారిటీ ఇచ్చింది. `ఇటీవల తనకు కొద్ది రోజులుగా తలనొప్పిగా ఉంది. తరువాత జ్వరం కూడా రావటంతో నా కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. నాకు కరోనా సోకిందేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు.
వెంటనే ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకుంటే అది కరోనా కాదు మలేరియా అని తేలింది. ప్రస్తుతం మలేరియాకు చికిత్స తీసుకుంటున్నా` అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది పాయల్. ప్రస్తుతం ఈ ముద్దుగా కొలుకోవటంతో తనపై వచ్చిన రూమర్స్కు చెక్ పెట్టేందుకు సోషల్ మీడియాలో స్పందించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా త్వరలోనే అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నానని తెలిపింది. త్వరలోనే మళ్లీ మనం తిరిగి సాధారణ జీవితం గడిపే రోజులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేసింది పాయల్.
కరోనా కారణంగా ప్రపంచ మానవ మనుగడే ఇబ్బందుల్లో పడింది. ప్రజలు గడప దాటాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 40 లక్షలకు చేరువవుతుండగా మన దేశంలో కరోనా బాధితులు 42 వేలు దాటారు.