పోసానితో తిట్టించారు, అంతు చూస్తా అన్నారు.. ఆయన లేకుంటే ఆత్మహత్య చేసుకునే వాడిని!
టాలీవుడ్ కమెడియన్ పృథ్వి గురించి పరిచయం అవసరం లేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పృథ్వి వెండితెరపై చేసిన సందడి అంతా ఇంతా కాదు.
టాలీవుడ్ కమెడియన్ పృథ్వి గురించి పరిచయం అవసరం లేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పృథ్వి వెండితెరపై చేసిన సందడి అంతా ఇంతా కాదు. పలు చిత్రాల్లో పృథ్వీ అద్భుతమైన కామెడీ పాత్రలు చేశారు. నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల ముందు పృథ్వీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. వైసిపిలో చేరి జగన్ కి మద్దతుగా ప్రచారం కూడా చేశాడు. ఈ క్రమంలో పృథ్వీ ఇతర పార్టీల నాయకులపై చేసిన విమర్శలు వివాదాస్పదం కూడా అయ్యాయి. ఎలక్షన్ టైం లో పార్టీలో చురుగ్గా పని చేయడంతో పృథ్వీ జగన్ దృష్టిలో పడ్డాడు.
ఇక ఏముంది.. పృథ్వీని అదృష్టం వరించింది. అధికారంలోకి వచ్చాక పృథ్వీకి జగన్ ఎస్వీబిసి చైర్మన్ పదవి కట్టబెట్టారు. దీనితో పృథ్వీ మరింత పాపులర్ అయ్యాడు. కానీ అదృష్టం ఎక్కువరోజులు పృథ్వీ వెంటలేదు. ఓ మహిళతో పృథ్వీ ఫోన్ లో అసభ్యంగా మాట్లాడంతో పదవి కోల్పోవలసి వచ్చింది.
కాగా ప్రస్తుతం పృథ్వీ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తాను ఏ నేరం చేయలేదని వాపోతున్నాడు. నా పై ఆరోపణలు రాగానే పార్టీకి ప్రతిష్ట దెబ్బతినకూడదనే ఉద్దేశంతో చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు పృథ్వీ చెప్పుకొచ్చాడు. తన పేరుతో వస్తున్న వైరల్ అయిన ఫోన్ కాల్ ఫేక్ అని పృథ్వీ అంటున్నాడు.
ఆ ఆడియోలో నేను మద్యం సేవించినట్లు చిత్రీకరించారు. వాస్తవానికి నేను మద్యం మానేసి చాలారోజులు అవుతోంది. ఆ వీడియో లీక్ కావడానికి కొన్ని రోజుల ముందు ఓ ఛానల్ సీఈవో నా అంతు చూస్తా అని బెదిరించాడు. ఇదంతా నాపై పన్నిన కుట్ర. అమరావతి రైతుల ఉద్యమంపై నేను చేసిన వ్యాఖ్యలని వక్రీకరించారు.
పోసాని చేత నన్ను తిట్టించారు. పార్టీ కోసం నేను కష్టపడి పనిచేశా. వైసిపిలోనే నాకు పదవి దక్కకూడదని కోరుకున్నవారు ఉన్నారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల్ని కూడా నేను విమర్శించలేదు. కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే మాట్లాడా. అందువల్ల నాకు ప్రస్తుతం సినిమాలు కూడా లేవు. కుట్ర ప్రకారమే నన్ను రోడ్డు మీదకి ఈడ్చారు అని పృథ్వీ వాపోయాడు.
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చిరంజీవి గారు గొప్పవారు. అంటే మిగిలిన వారంతా చెడ్డోళ్ళని నేను అనను. మానసికంగా భాదపడుతున్న నాకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పిన ఏకైక వ్యక్తి చిరంజీవి గారే. ఆయనే లేకుంటే ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకునేవాడిని అని పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంతలా ఎమోషనల్ అవుతున్న పృథ్వీకి మునుపటిలా సినిమాల్లో అవకాశాలు దక్కుతాయో లేదో చూడాలి. చైర్మన్ పదవిని కోల్పోవడంతో ప్రస్తుతం పృథ్వీకి సినిమాలే ఆధారం అయ్యాయి.