హరీష్ శంకర్ తో జీవితంలో సినిమా చేయను.. లైవ్ లోకి కొడుకులని తీసుకొచ్చి బండ్ల గణేష్ కామెంట్స్
సినిమా ఈవెంట్స్ అంటే.. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు మాట్లాడిన మాటలు హైలైట్ అవుతుంటాయి. కానీ నిర్మాత ప్రసంగాలకు అంతగా ప్రాధాన్యత ఉండదు. ఇది సాధారణమైన విషయమే.
సినిమా ఈవెంట్స్ అంటే.. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు మాట్లాడిన మాటలు హైలైట్ అవుతుంటాయి. కానీ నిర్మాత ప్రసంగాలకు అంతగా ప్రాధాన్యత ఉండదు. ఇది సాధారణమైన విషయమే. కానీ బండ్ల గణేష్ విషయంలో ఇది భిన్నం. బండ్ల గణేష్ ఏదైనా ఈవెంట్ కి హాజరయ్యాడంటే.. ఆ ఈవెంట్ కు అతడే హాట్ టాపిక్ గా మారుతాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం గబ్బర్ సింగ్ బండ్ల గణేష్ జీవితాన్నే మార్చేసింది. బండ్ల గణేష్ కు గబ్బర్ సింగ్ చిత్రం తెచ్చిపెట్టిన లాభాలు అంతా ఇంతా కాదు. ఆ చిత్రంతో బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు.
ఆ తర్వాత బండ్ల గణేష్ టెంపర్, బాద్షా లాంటి హిట్ చిత్రాలు నిర్మించారు. ఇటీవల గబ్బర్ సింగ్ చిత్రం 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బండ్ల గణేష్, దర్శకుడు హరీష్ శంకర్ గురించి అభిమానుల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
హరీష్, బండ్ల గణేష్ మధ్య విభేదాలు తలెత్తాయి. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఈ వివాదం గురించి స్పందించాడు. కుటుంబ సభ్యుల మధ్యే ఇప్పుడు వివాదాలు సహజం. అలాంటి వివాదమే తమ మధ్య కూడా వచ్చిందని బండ్ల గణేష్ తెలిపాడు.
హరీష్ శంకర్ గొప్ప డైరెక్టర్. అతడితో ఒక సినిమా చేశా.. ఇక చాలు.. జీవితంలో హరీష్ శంకర్ తో నేను సినిమా చేయను అని బండ్ల గణేష్ తేల్చేశారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలతో వీరిద్దరి మధ్య ఏదో పెద్ద వివాదమే చోటు చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది.
ఇక టాలీవుడ్ అగ్ర హీరోలపై బండ్ల గణేష్ కామెంట్స్ చేశాడు. మహేష్ బాబు సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరో అని అభివర్ణించాడు. గతంలో ప్రభాస్ తో తాను సినిమా చేయాల్సింది అని.. కానీ ఆ అవకాశం చేజారిందని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్ అని అన్నారు.
ఎన్టీఆర్ తో బాద్షా, టెంపర్ చిత్రాలని బండ్ల గణేష్ తెరకెక్కించారు. ఆ రెండు చిత్రాలు ఎన్టీఆర్ కెరీర్ లో పెద్ద విజయాలు అని బండ్ల గణేష్ తెలిపాడు. టెంపర్ తర్వాత ఎన్టీఆర్ కు పరాజయమే లేదని.. ఇక జీవితంలో ఎన్టీఆర్ కు ఫ్లాప్ అనేదే ఉండదని బండ్ల గణేష్ జోస్యం చెప్పాడు. ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేస్తున్నారని తెలిపారు.
అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో అనే చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు. ఆ సినిమా సక్సెస్ కాలేదు.. అల్లు అర్జున్ విషయంలో ఆ లోటు తనకు ఉండిపోయింది అని బండ్ల చెప్పుకొచ్చాడు. దర్శకులని పరిచయం చేసే క్రెడిట్ గతంలో రామానాయుడు గారికి, ఇప్పుడు దిల్ రాజుకు ఉందని అన్నారు. కనీసం 10 మంది దర్శకులని అయినా ఇండస్ట్రీకి పరిచయం చేసి అలాంటి ఘనతని తాను కూడా సాధించాలని బండ్ల గణేష్ తెలిపాడు.
ఇంటర్వ్యూ జరుగుతుండగానే బండ్ల గణేష్ తన తనయులని లైవ్ లోకి తీసుకువచ్చారు. తన కొడుకులతో ఒకరిని సినిమా ఇండస్ట్రీకి, మరొకరిని పౌల్ట్రీ రంగానికి పరిచయం చేయబోతున్నట్లు గణేష్ తెలిపాడు.
అలాగే గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మించే ఛాన్స్ తనకు ఎలా దక్కిందో తెలియజేస్తూ బండ్ల గణేష్ ఆసక్తికర విషయం బయటపెట్టాడు. దబాంగ్ చిత్ర రీమేక్ రైట్స్ కొనమని తనకు చెప్పిన వ్యక్తి సోనూ సూద్. అప్పుడే దబాంగ్ రైట్స్ కొన్నా. అంతకు ముందే పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ చిత్రం చేశా.
తీన్ మార్ తర్వాత మరోసారి ఆయన డేట్స్ అడగాలంటే ధైర్యం చాల్లేదు. పవన్ డేట్స్ కోసం 10 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న నిర్మాతలు ఉన్నారు. నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు తక్కువ.. నీకు వరుసగా రెండు సార్లు డేట్స్ ఇస్తారా అని కామెంట్స్ చేసినవాళ్లు కూడా ఉన్నారు.
త్రివిక్రమ్ గారి చొరవతో తన దేవుడు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మించుకునే ఛాన్స్ ఇచ్చారని బండ్ల గణేష్ తెలిపారు. ఇటీవల బండ్ల గణేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటుడిగా కూడా రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం తనకు నటనపై ఆసక్తి లేదని.. వరుసగా సినిమాలు నిర్మించే ప్లాన్ లో ఉన్నట్లు బండ్ల గణేష్ తెలిపాడు.