- Home
- Sports
- Cricket
- చాహల్ ఇలా బౌలింగ్ చేస్తే మాకు అవసరం లేదు.. మార్చుకోకుంటే కష్టమే : బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు
చాహల్ ఇలా బౌలింగ్ చేస్తే మాకు అవసరం లేదు.. మార్చుకోకుంటే కష్టమే : బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు
IND vs SA T20I: ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన అవార్డు గెలుచుకున్న యుజ్వేంద్ర చాహల్.. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్ లో మాత్రం విఫలమవుతున్నాడు.

దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా భారత బౌలింగ్ విభాగం దారుణంగా వైఫల్యం చెందుతున్నది. ముఖ్యంగా ఉపఖండపు పిచ్ లపై మంచి రికార్డు ఉన్న స్పిన్నర్లు విఫలమవుతుండటం భారత అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది.
స్పిన్ కు అనుకూలించే ఇండియా పిచ్ లపై చెలరేగే యుజ్వేంద్ర చాహల్ తో పాటు అక్షర్ పటేల్ లు రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యారు. వికెట్లు తీయకపోగా భారీగా పరుగులిచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుతం తూర్పు ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ‘‘చాహల్ తన వేగాన్ని మార్చుకోవడం చాలా అవసరం. ఒకవేళ చాహల్.. ‘నేను టైట్ బౌలింగ్ వేసి వికెట్లు తీస్తా’ అని అనుకోవచ్చు. కానీ అది జరగడం లేదు కదా..
నాలుగు ఓవర్లలో సుమారు 50 పరుగుల దాకా ఇస్తున్నాడు. కానీ అందుకు తగ్గట్టుగా 3, 4 వికెట్లు తీసుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. అప్పుడు మ్యాచ్ భారత్ చేతుల్లో ఉండేది. అయితే చాహల్ మాత్రం 4 ఓవర్లు వేసి 40-50 రన్స్ ఇస్తూ ఒక్క వికెట్ తీయడమంటే అది ఆందోళనకరమే.
చాహల్ తన వేగాన్ని తగ్గించి స్లో బంతులతో బ్యాటర్లను టెంప్ట్ చేయాలి. ఆ క్రమంలో బ్యాటర్లు ఒకటో రెండో సిక్సర్లు కొట్టినా పెద్దగా నష్టం లేదు. రెండో టీ20 లో చూడండి. దక్షిణాఫ్రికాకు చెందిన ఒక్క బ్యాటర్ కూడా చాహల్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడలేదు.
క్రీజులో ఉండే సిక్సర్లు బాదారు. అంటే అర్థమేంటి..? చాహల్ బౌలింగ్ లో వేగం ఉందే తప్ప వైవిధ్యం లేదు. అలాంటి డెలివరీలను మేము అక్షర్ పటేల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.. చాహల్ నుంచి కాదు..’అని అన్నాడు.
రెండో టీ20 లో చాహల్.. 4 ఓవర్లలో 49 పరుగులిచ్చుకున్నాడు. ఒక వికెట్ తీశాడు. కానీ తొలి వన్డేలో 13 బంతులు వేసి 26 పరుగులిచ్చాడు. అక్షర్ పటేల్ కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు.