ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందుకే ఆ రోజు మ్యాచ్ తర్వాత... - మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్...
యువరాజ్ సింగ్ కెరీర్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు, మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్లు ఉన్నాయి. అయితే చాలామంది ఫెవరెట్ ఇన్నింగ్స్ మాత్రం 2007 టీ20 వరల్డ్కప్లో యువీ బాదిన ఆరు సిక్సర్ల విధ్వంసమే. ఈ ఇన్నింగ్స్ తర్వాత జరిగిన సంఘటనను గుర్తుతెచ్చుకున్నాడు యువరాజ్ సింగ్.
2007 టీ20 వరల్డ్కప్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసం సృష్టించిన యువరాజ్ సింగ్, స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో ఆరుకి ఆరు సిక్సర్లు బాది సంచలనం క్రియేట్ చేశాడు...
12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదుచేసి, అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న క్రికెటర్గా నిలిచాడు యువరాజ్ సింగ్. అయితే ఈ మ్యాచ్ అనంతరం స్టువర్ట్ బ్రాడ్కి తన జెర్సీ కానుకగా ఇచ్చాడట యువీ.
‘ఇంగ్లాండ్తో మ్యాచ్ తర్వాత మేం ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడాం. ఆ మ్యాచ్కి స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ రిఫరీగా వ్యవహారించారు. మ్యాచ్కి ముందు ఆయన నన్ను కలిశారు.
నువ్వు మావాడి కెరీర్ని దాదాపు ముగించేశావ్ తెలుసా... అన్నారు. నేను... బ్రాడ్తో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా బౌలింగ్లో కూడా 5 సిక్సర్లు కొట్టారు’ అంటూ చెప్పాను...
‘అవును నాకు తెలుసు. నీ దగ్గర స్టువర్ట్కి ఇవ్వడానికి టీ షర్ట్ ఉందా? ఆ సిక్స్, సిక్సర్లు కొట్టిన జెర్సీ కావాలి...’ అని అడిగారు. నేను ఆ షర్ట్ మీద ‘ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు ఇంగ్లాండ్ భవిష్యత్తువి. నువ్వు చాలా సాధించాలని కోరుకుంటున్నా’ అని రాసి ఇచ్చాను...
ఇప్పుడు స్టువర్ట్ బ్రాడ్ 500 టెస్టు వికెట్లు సాధించడం చూస్తుంటే గర్వంగా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు అందరికీ అవుతూ ఉంటుంది. నీరోజు కానప్పుడు ఏం చేసినా పరుగులు వెళ్తుంటాయి.
దేశం కోసం మనవల్ల అయినదానికంటే ఎక్కువే ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. నీ కెరీర్కి నువ్వే రక్షకుడివి. సలహాలు ఇవ్వడం చాలా తేలికే, కాని కష్టపడేవాడికే తెలుస్తుంది ఆ బాధ...’ అంటూ చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్.
2007, 2011 వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న యువరాజ్ సింగ్, 2007లో ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో ఆఖరి ఓవర్లో బౌలింగ్కి వచ్చాడు. మొదటి బంతికి పరుగులేమీ ఇవ్వలేదు.
అయితే రెండో బంతికి పార్థివ్ పటేల్, బౌండరీలైన్ దగ్గర క్యాచ్ అందుకున్నా, బాడీ పైన కంట్రోల్ కోల్పోయి బౌండరీలోకి జారుకుంటూ వెళ్లాడు. దీంతో సిక్సర్ వచ్చింది.
ఆ తర్వాత సిక్సర్ల సునామీ మొదలెట్టిన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మస్కరెనస్, వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. ఈ పర్ఫామెన్స్తో ఇంగ్లాండ్ టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్న మస్కరెనస్, తన కెరీర్లో కేవలం 20 వన్డేలు, 14 టీ20 మ్యాచులే మాత్రమే ఆడాడు.