సచిన్తో కోహ్లీకి పోలికా.. అంత సీన్ లేదు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్
INDvsSL: టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మంగళవారం శ్రీలంకతో ముగిసిన తొలి వన్డేలో సెంచరీ చేశాడు. వన్డేలలో ఇది కోహ్లీకి 45వ సెంచరీ. మొత్తంగా 73వ శతకం.
అంతర్జాతీయ కెరీర్ లో మూడేండ్ల తర్వాత గతేడాది సెంచరీ చేసి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వన్డేలలో పూర్వపు వైభవాన్ని పొందే దిశగా అడుగులు వేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితమే బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ.. తాజాగా లంకతో తొలి వన్డేలో కూడా శతకం బాది బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశాడు.
నిన్నటి మ్యాచ్ లో కోహ్లీ.. 80 బంతులలో సెంచరీ చేసిన అతడు.. 87 బంతుల్లో 113 పరుగులు సాధించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డుల వైపునకు దూసుకొస్తున్న కోహ్లీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వన్డేలలో మరో నాలుగు సెంచరీలు చేస్తే కోహ్లీ.. సచిన్ రికార్డు (49 సెంచరీలు)లను సమం చేస్తాడు.
అయితే మ్యాచ్ తర్వాత కోహ్లీ బ్యాటింగ్ పై విశ్లేషిస్తూ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్ తో కోహ్లీని పోల్చడం సరికాదని అన్నాడు. సచిన్ ఆడినప్పుడు ఉన్న పరిస్థితులు వేరని.. ఇప్పుడు ఆట చాలా మారిందని గంభీర్ చెప్పాడు.
గంభీర్ మాట్లాడుతూ.. ‘కోహ్లీని సచిన్ తో పోల్చడం సరికాదు. సచిన్ క్రికెట్ ఆడేప్పుడు నిబంధనలు వేరు. ఇప్పుడున్నవి వేరు. సచిన్ ఆడినప్పుడు 30 యార్డ్ సర్కిల్ లో ఐదుగురు ఫీల్డర్ల నిబంధన అమల్లో లేదు. ఇప్పుడు క్రికెట్ లో నిబంధనలు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటాయి. అప్పుడు కూడా ఇలాగే ఉండి ఉంటే సచిన్ మరిన్ని పరుగులు చేసి ఉండేవాడు...’ అని వ్యాఖ్యానించాడు.
అంతేగాక ‘లంక బౌలింగ్ మరీ ఆర్డినరీగా ఉంది. టీమిండియా టాప్-3 ఎంత ఈజీగా బ్యాటింగ్ చేశారో చూడండి. రోహిత్ - కోహ్లీలతో పాటు కొత్త కుర్రాడు శుభమన్ గిల్ కూడా చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు.. ఈ మ్యాచ్ లో లంక బౌలింగ్ నన్ను తీవ్రంగా నిరాశకు గురి చేసింది..’అని చెప్పాడు.
అయితే గంభీర్ కామెంట్స్ పై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కోహ్లీని ఎప్పుడూ ఏదో ఒకటి అనకుంటే గంభీర్ కు పొద్దుపోదని, తన అసూయను ఇలా బయటపెడుతున్నాడని వాపోతున్నారు. గంభీర్ కామెంట్స్ ను పట్టించుకోవాల్సిన పన్లేదని సోషల్ మీడియాలో అతడిపై ట్రోల్స్, మీమ్స్ షేర్ చేస్తున్నారు.