కెప్టెన్తో కలిసి యూకేకు పయనమైన జైస్వాల్.. పిక్ వైరల్.. ఇక మిగిలింది వాళ్లే..
WTC Final 2023: భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మీద దృష్టి సారించారు. ఇప్పటికే ఒక బ్యాచ్ ఇంగ్లాండ్ వెళ్లగా తాజాగా మరో బ్యాచ్ కూడా లండన్ బయల్దేరింది.
రెండునెలలుగా ఐపీఎల్ తో బిజీబిజీగా గడుపుతున్న భారత క్రికెటర్లు ఇక ఐసీసీ ట్రోఫీ మీద దృష్టి సారించారు. వచ్చే నెల 7 నుంచి 11 వరకూ లండన్ లోని ‘ది ఓవల్’ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో టీమిండియా తలపడనున్నది. ఈ మేరకు మూడు దఫాలుగా లండన్ కు వెళ్తోన్న భారత క్రికెటర్లలో సెకండ్ బ్యాచ్ కూడా ఇంగ్లాండ్ కు వెళ్లింది.
ఆదివార సాయంత్రం టీమిండియా సారథి రోహిత్ శర్మ తో కలిసి రాజస్తాన్ రాయల్స్ ఓపెనింగ్ సంచలనం యశస్వి జైస్వాల్.. యూకేకు వెళ్లారు. ఐపీఎల్ లో రాజస్తాన్ కు ఆడుతున్నా జైస్వాల్ కూడా ముంబై కుర్రాడే. దీంతో ఈ ఇద్దరు ముంబైకర్లు యూకేకు వెళ్లారు. రోహిత్ తో కలిసి తాను యూకేకు వెళ్తున్నట్టు జైస్వాల్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు.
ఈ ఇద్దరే గాక కెఎల్ రాహుల్ ప్లేస్ లో ఎంపికైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, స్టాండ్ బై ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై నుంచి యూకేకు వెళ్లినట్టు సమాచారం.
టీమిండియా ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లు ఇదివరకే యూకేకు వెళ్లి అక్కడ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఆదివారం ఛతేశ్వర్ పుజారా కూడా టీమిండియాతో కలిశాడు. పుజారా అక్కడే కౌంటీ ఛాంపియన్షిప్ ఆడుతున్న విషయం విదితమే.
Image credit: PTI
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భారత జట్టులో మిగిలిన ఆటగాళ్లలో శుభ్మన్ గిల్, మహ్మద్ షమీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత లండన్ విమానమెక్కుతారు.