- Home
- Sports
- Cricket
- ఐపీఎల్లో విఫలమైనా మళ్లీ పాత జాబ్ దక్కించుకున్న దినేశ్ కార్తీక్.. జూన్ 7 నుంచే జాయినింగ్..!
ఐపీఎల్లో విఫలమైనా మళ్లీ పాత జాబ్ దక్కించుకున్న దినేశ్ కార్తీక్.. జూన్ 7 నుంచే జాయినింగ్..!
WTC Finals 2023: ఐపీఎల్-16 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. సీజన్ లో ఏకంగా నాలుగు సార్లు డకౌట్ అయ్యాడు.

టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడే దినేశ్ కార్తీక్.. 2022లో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వకముందు ఉన్న బాధ్యతల్లో చేరనున్నాడు. 2019 వన్దే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో కనుమరుగైన కార్తీక్.. కొన్నాళ్లు కామెంటేటర్ బాధ్యతలు నిర్వర్వించాడు. కానీ దేశవాళీ, ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శనలు చేసి 2022లో భారత జట్టులోకి వచ్చాడు.
కానీ గతేడాది టీ20 ప్రపంచకప్ తో పాటు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కూడా కార్తీక్ విఫలమయ్యాడు. 13 మ్యాచ్ లు ఆడి 140 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 30 పరుగులు కాగా నాలుగు సార్లు డకౌట్ అయి ఐపీఎల్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన రోహిత్ శర్మ (16) రికార్డును బ్రేక్ చేశాడు.
కాగా ఇప్పుడు కార్తీక్ మళ్లీ కామెంటేటర్ బాధ్యతల్లో మళ్లీ చేరనున్నాడు. త్వరలో ఇంగ్లాండ్ లోని ‘ది ఓవల్’ వేదికగా ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ లో కామెంట్రీ చెప్పబోయే ప్యానెల్లో కార్తీక్ కు చోటు దక్కింది.
డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు ఆసీస్ దిగ్గజాలు రికీ పాంటింగ్, మాథ్యూ హెడెన్, జస్టిన్ లాంగర్ లతో పాటు భారత జట్టు తరఫున సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి, దినేశ్ కార్తీక్ లు ఎంపికయ్యారు. ఇంగ్లాండ్ నుంచి నాసిర్ హుస్సేన్, శ్రీలంక మాజీ సారథి కుమార సంగక్కర కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
2021లో ఇండియా - న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఫస్ట్ ఎడిషన్ లో కూడా కార్తీక్.. కామెంట్రీ బాధ్యతలు నిర్వర్తించాడు. అప్పుడు సునీల్ గవాస్కర్ తో కలిసి కార్తీక్ కామెంట్రీ చెప్పాడు. కార్తీక్ వాక్చాతుర్యం.. ఆట గురించి అతడు విశ్లేషించిన విధానం భారత్, కివీస్ తో పాటు ఐసీసీ, ఇంగ్లాండ్ అభిమానులను కూడా అలరించింది.
కార్తీక్ కామెంట్రీలో మ్యాజిక్ ను పట్టుకున్న స్కై స్పోర్ట్స్.. త్వరలో ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య ప్రారంభం కాబోయే యాషెస్ సిరీస్ లో అతడిని తమ కామెంట్రీ ప్యానెల్ లో చేర్చింది. యాషెస్ సిరీస్ కు ఒక భారతీయుడు కామెంట్రీ చెబుతుండటం ఇదే ప్రథమం కావడం గమనార్హం.