WIPL: టెక్నికల్ బిడ్స్ దాఖలు చేసిన ఆశావాదులు.. పోటీలో ఏడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు..
Women's IPL: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఉమెన్స్ ఐపీఎల్ లో బుధవారం కీలక ప్రక్రియ జరుగబోతోంది. బీసీసీఐ రేపు ఉమెన్స్ ఐపీఎల్ టీమ్స్ లను ప్రకటించనుంది.
ఇప్పటికే కోట్లాది రూపాయలను ఆర్జిస్తూ ప్రపంచ క్రికెట్ లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీసీసీఐ మరింత సంపన్నం కానుంది. ఉమెన్స్ ఐపీఎల్ కోసం బీసీసీఐ ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నది. ఇదివరకే టెండర్లను ఆన్లైన్ లో ఉంచి పలు సంస్థలు, వ్యక్తుల నుంచి బిడ్లను స్వీకరించిన బీసీసీఐ.. రేపు ఈ లీగ్ లో పాల్గొనబోయే ఐదు టీమ్స్ ను ప్రకటించనుంది.
టెండర్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 21తో ముగిసింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు ఐదు టీమ్స్ కోసం 33 బిడ్స్ వచ్చినట్టు తెలుస్తున్నది. వీరిలో ఐపీఎల్ కు చెందిన పది ఫ్రాంచైజీలు టెండర్లను కొనుగోలు చేశాయి. అయితే మొత్తంగా ఇప్పటిదాకా టెక్నికల్ బిడ్స్ ను దాఖలు చేసినవి మాత్రం 17 మాత్రమే.
ఆన్లైన్ లో టెండర్లను కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ లు ఇంకా టెక్నికల్ బిడ్స్ ను దాఖలు చేయలేదని తెలుస్తున్నది. ఈ మూడు తప్ప మిగిలిన ఏడు ఫ్రాంచైజీలు పోటీలో ఉన్నాయి. మొత్తంగా 17 సంస్థలు టెక్నికల్ బిడ్స్ ను దాఖలు చేయగా వాటిలో 14 బిడ్స్ కు బీసీసీఐ ఆమోదం కూడా తెలిపిందని సమాచారం. ఇవి రేపు ఫైనాన్షియల్ బిడ్స్ ను దాఖలు చేయనున్నాయి.
బోర్డు వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఐదు టీమ్ లను కొనుగోలు చేసేందుకు గాను ఐపీఎల్ దిగ్గజాలతో పాటు హల్దిరామ్స్, శ్రీరామ్ గ్రూప్, అదానీ గ్రూప్, కొటక్, ఏపీఎల్ అపోలో, స్లింగ్ షాట్ రూట్ మొబైల్ లు కూడా పోటీలో ఉన్నాయని తెలుస్తున్నది.
ఐదు టీమ్స్ కు గాను ఒక్కో జట్టుకు సుమారు రూ. 500 నుంచి రూ. 800 కోట్ల వరకు ధర పలకవచ్చునని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తున్నది. బుధవారం ఫైనాన్షియల్ బిడ్ ల దాఖలు ప్రక్రియ ముగిసిన తర్వాత బీసీసీఐ.. దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నది. ఈ వేలం ద్వారా బీసీసీఐ సుమారు రూ. 3 వేల కోట్ల నుంచి రూ. 4 వేల కోట్ల వరకు ఆర్జించవచ్చునని మార్కెట్ విశ్లేషకలు అంచనా.
టీమ్స్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఫిబ్రవరి రెండో వారంలో ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఉండొచ్చని బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది. మార్చి లో ఉమెన్స్ ఐపీఎల్ జరుగనుంది. మార్చి 25 వరకు దీనిని ముగించి 29 నుంచి పురుషుల ఐపీఎల్ సీజన్ మొదలుపెట్టేలా బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నది.