Ross Taylor: రాస్ టేలర్ను కొట్టిందెవరు..? శిల్పాశెట్టి భర్తేనా..?
Ross Taylor: కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తాజాగా తన పుస్తకంలో ‘రాజస్తాన్ రాయల్స్ ఓనర్ ఒకరు నన్ను నాలుగైదు సార్లు చెంపదెబ్బ కొట్టారు’ అని రాసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిమీద క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తున్నది.
ప్రొఫెషనలిజానికి బ్రాండ్ అంబాసిడర్లు అని అందరిచేత కీర్తించబడుతున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో పైకి కనిపించేంత ప్రొఫెషనలిజం లేదని సంచలన కామెంట్స్ చేసిన కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తాజాగా ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ మీద కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు.
2011 ఐపీఎల్ సీజన్ లో తాను సరిగా ఆడనందుకు గాను రాజస్తాన్ రాయల్స్ యజమానల్లోని ఒకరు తనను నాలుగైదు సార్లు చెంపదెబ్బ కొట్టాడని.. అది సరదాగా కొట్టినట్టు తనకు అనిపించలేదని టేలర్ పేర్కొనడం పెనుదుమారం రేపింది. టేలర్ ఈ కామెంట్స్ చేసినప్పట్నుంచి భారత క్రికెట్ తో పాటు సోషల్ మీడియాలో కూడా ఆసక్తికర చర్చ నడుస్తున్నది.
SHILPA_SHETTY_KUNDRA
రాస్ టేలర్ ను కొట్టింది ఎవరు..? అని అభిమానులు, క్రికెట్ పండితులు తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే వీరిలో చాలామంది వేళ్లు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వైపే వెళ్తున్నాయి. రాజ్ కుంద్రానే రాస్ టేలర్ ను కొట్టాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాజస్తాన్ రాయల్స్ లో ట్రెస్కో అధినేత సురేశ్ చెల్లారం, అతడి కుటుంబానికి 45 శాతం వాటాలున్నాయి. లచ్లన్ ముర్దోచ్ కు 11.7 శాతం, ఎమర్జింగ్ మీడియాకు 32.4 శాతం, రాజ్ కుంద్రాకు 11.7 శాతం వాటాలున్నాయి. ఐపీఎల్ ప్రారంభం నుంచి 2015 వరకు కుంద్రా.. రాజస్తాన్ ఫ్రాంచైజీలో కీలక సభ్యుడు. రాజస్తాన్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా శిల్పాశెట్టితో పాటు కుంద్రా ప్రత్యక్షమయ్యేవాడు.
శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా తప్ప రాజస్తాన్ రాయల్స్ లో ఓనర్లు ఎలా ఉంటారో కూడా చాలా మందికి తెలియదు. ఎమర్జింగ్ మీడియా అధినేత మనోజ్ బదాలే అప్పుడప్పుడు మ్యాచ్ లు చూడటానికి వచ్చేవారే తప్ప ఆయన రెగ్యులర్ గా మ్యాచ్ లు చూసి ఆనందించే టైప్ కాదు. మిగిలిన వాళ్లు కూడా ఎక్కడా పెద్దగా కనిపించిన దాఖలాలు కూడా లేవు.
దీంతో టేలర్ చెంప చెల్లుమనిపించింది రాజ్ కుంద్రానే అని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై రాజస్తాన్ రాయల్స్ ను వివరణ కోరగా ఆ ఫ్రాంచైజీ.. ‘నో కామెంట్స్’ అని స్పందించడం గమనార్హం.