- Home
- Sports
- Cricket
- భావి కెప్టెనా..! అతడిలో ఏ స్కిల్ చూసి సారథిగా ఎంపిక చేశారు..? సెలెక్టర్లపై బెంగాల్ క్రీడా మంత్రి ఆగ్రహం
భావి కెప్టెనా..! అతడిలో ఏ స్కిల్ చూసి సారథిగా ఎంపిక చేశారు..? సెలెక్టర్లపై బెంగాల్ క్రీడా మంత్రి ఆగ్రహం
KL Rahul: టెస్టుల్లో విరాట్ కోహ్లి గైర్హాజారీ, రోహిత్ శర్మకు గాయం కారణంగా భారత్ కు తాత్కాలిక సారథిగా వ్యవహరించిన లక్నో సూపర్ జెయింట్స్ సారథిపై పశ్చిమబెంగాల్ క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి తీవ్రంగా స్పందించాడు.

ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకున్న భారత జట్టులో టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ గాయపడటంతో సెలెక్టర్లు కెఎల్ రాహుల్ ను తాత్కాలిక నాయకుడిగా నియమించారు. అంతకుముందు టెస్టు సిరీస్ లో కూడా విరాట్ కోహ్లికి గాయం కావడంతో రెండో టెస్టుకూ అతడే సారథ్యం వహించాడు.
ఈ నాలుగు మ్యాచులలో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. తాత్కాలిక సారథి అని చెబుతున్నా.. భవిష్యత్ లో అతడినే టెస్టు కెప్టెన్ గా నియమిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా.. కెఎల్ రాహుల్ ను సారథిగా నియమించడంపై టీమిండియా వెటరన్ ఆటగాడు, పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖా మంత్రి మనోజ్ తివారి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ని తప్పుబట్టాడు. అసలు అతడి (కెఎల్ రాహుల్) లో మీకు కెప్టెన్సీ లక్షణాలు ఏం కనిపించాయని ప్రశ్నించాడు.
తివారి స్పందిస్తూ... ‘అసలు రాహుల్ లో కెప్టెన్సీ లక్షణం ఏం కనిపించింది..? భావి సారథిని తయారుచేస్తున్నామని అంటున్నారు. కెప్టెన్పీ అనేది సహజంగా అలవడాలి. వాళ్లు (బీసీసీఐ) చెప్పినట్టు సారథిని తయారు చేయడం సాధ్యమే కావచ్చు గానీ ఆ ప్రక్రియ అంత ఆషామాషీ కాదు. అందుకు చాలా సమయం పడుతుంది...
మీరు చెప్పినట్టు.. కనీసం 20 నుంచి 25 మ్యాచులు ఆడిన తర్వాత గానీ అతడి (కెప్టెన్) కు సొంతగా నిర్ణయాలు తీసుకునే ఆత్మవిశ్వాసం వస్తుంది. అప్పుడు కూడా సారథిగా విజయం సాధిస్తాడని నమ్మకం లేదు. భారత్ కు ప్రతి అంతర్జాతీయ మ్యాచ్ ముఖ్యమే కదా... అలాంటప్పుడు రిస్క్ ఎందుకు..?’ అని ప్రశ్నించాడు.
కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా టీమిండియా దక్షిణాఫ్రికాతో దారుణంగా ఓడిందని తివారి అన్నాడు. అయితే తాను రాహుల్ కెప్టెన్సీని నిందించడం లేదని, సెలెక్టర్ల తీరు తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పాడు. కెప్టెన్ గా అతడిని తయారుచేయడం కంటే నాయకత్వ నైపుణ్యాలను గుర్తించాలి అని సూచించాడు.
ఈ క్రమంలో మరి రాహుల్ కాకుంటే ప్రస్తుతం ఎవరిని టీమిండియా టెస్టు సారథిగా చేస్తే మంచిదని తివారిని ప్రశ్నించగా.. ‘నిస్సందేహంగా రోహిత్ శర్మ..’ అని సమాధానమిచ్చాడు. ‘రోహిత్ శర్మ. అందులో మరో ప్రశ్నే లేదు. రోహిత్ పుట్టుకతోనే నాయకుడు. కాబట్టి సెలెక్టర్లు భారత టెస్టు సారథిని గురించి ఆలోచించాల్సిన పన్లేదు. రోహిత్ ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడతాడు. భవిష్యత్ గురించి బెంగ మానేసి వర్తమానం మీద దృష్టి సారిద్దాం..
అతడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను విజయవంతంగా నడిపించాడు. కాబట్టి ఫార్మాట్ తో సంబంధం లేకుండా అతనికి కెప్టెన్సీ ఇవ్వండి. మ్యాచులో పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, జట్టులోని ఇతర ఆటగాళ్లతో మంచి సంబంధాలు నెరపడంలో రోహిత్ విజయం సాధిస్తాడు..’ అని తివారి అన్నాడు.