సర్ఫరాజ్రికార్డుల కంటే మాకు అదే ముఖ్యం.. అందుకే ఎంపిక చేయలేదు : బీసీసీఐ సెలక్టర్ కామెంట్స్
Sarfaraz Khan: ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్మన్ తర్వాత 80 ప్లస్ యావరేజీ ఉన్న సర్ఫరాజ్ ను జట్టులోకి తీసుకోకపోవడం దారుణమని టీమిండియా ఫ్యాన్స్ తో పాటు మాజీ ఆటగాళ్లు కూడా బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు.
గడిచిన రెండు మూడేండ్లుగా దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న ముంబై యువ బ్యాటర్ ఈసారి వచ్చే నెలలో భారత్ -ఆస్ట్రేలియా సిరీస్ కు తప్పకుండా ఎంపికవుతాడని అంతా అనుకున్నారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడికి మరోసారి మొండిచేయి చూపించారు. నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు లేదు.
17 మందితో కూడిన ఈ జట్టులో సర్ఫరాజ్ ను పక్కనబెట్టడంతో బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021-22 సీజన్ లో 982 పరుగులు, ప్రస్తుత సీజన్ లో కూడా ఇప్పటికే ఆరు వందలకు పైగా పరుగులు చేసిన సర్ఫరాజ్.. విజయ్ హజారే, సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో కూడా మెరుస్తున్నాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్మన్ తర్వాత 80 ప్లస్ యావరేజీ ఉన్న సర్ఫరాజ్ ను జట్టులోకి తీసుకోకపోవడం దారుణమని టీమిండియా ఫ్యాన్స్ తో పాటు మాజీ ఆటగాళ్లు కూడా బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు టీమిండియాలోకి ఎంపిక కావాలంటే ఇంకేం చేయాలి..? ఒక ఐపీఎల్ సీజన్ లో బాగా ఆడితే సరిపోతుందా..? మరి దేశవాళీలు ఎందుకు నిర్వహిస్తున్నారు..? అని బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ఈ విమర్శలపై ఐదుగురు సభ్యులతో కూడిన బీసీసీఐ సెలక్షన్ కమిటీలో ఒకడిగా ఉన్న శ్రీధరన్ శరత్ స్పందించాడు. సర్ఫరాజ్ పై బీసీసీఐతో పాటు సెలక్షన్ కమిటీలోని ఒక సభ్యుడు స్పందించడం ఇదే ప్రథమం.
శరత్ మాట్లాడుతూ.. ‘జట్టు సమతూకంతో ఉండటం అత్యంత ప్రధానం.. సర్ఫరాజ్ మా ప్లాన్స్ లో ఉన్నాడు. రాబోయే కాలంలో అతడు తప్పకుండా జట్టులోకి వస్తాడు. ఒక టీమ్ ను ఎంపికచేసేప్పుడు చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. టీమ్ కంపోజిషన్, బ్యాలెన్స్ మాకు చాలా ముఖ్యం...’అని తెలిపాడు.
సర్ఫరాజ్ మిడిలార్డర్ బ్యాటర్. అయితే ప్రస్తుతానికి టీమిండియా టెస్టు టీమ్ లో మిడిలార్డర్ ఫుల్ ప్యాక్డ్ గా ఉంది. ఓపెనర్ల తర్వాత వచ్చే పుజారా, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ లు 3,4,5 స్థానాల్లో వస్తారు. వికెట్ కీపర్ బ్యాటర్ గా ఉండే ఆటగాడు (ఈ ప్లేస్ లో రిషభ్ వచ్చేవాడు) ఆరో స్థానంలో వస్తాడు. ఆ తర్వాత స్పిన్నర్లు, పేసర్లు ఉంటారు. దీంతో సర్ఫరాజ్ కు టీమ్ లో చోటు దొరకడం లేదనేది శరత్ భావన.
అయితే ఈ సిరీస్ లో సర్ఫరాజ్ ను కాకుండా టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్ ను జట్టులోకి ఎంపిక చేయడం కూడా విమర్శలకు తావిచ్చింది. దీనిపై శరత్ స్పందిస్తూ.. ‘సూర్య ప్రత్యర్థి టీమ్ నుంచి ఆటను లాగేసుకుంటాడు. అతడి ఆట ఎదురుదాడితో కూడుకుని ఉంటుంది. సూర్య కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 5వేలకు పైగా పరుగులు చేశాడనే విషయం మరిచిపోవద్దు..’ అని చెప్పాడు.