‘ఎలాగూ సిరీస్ గెలిచారు.. రోహిత్, విరాట్లు దానికోసం ప్రిపేర్ అయితే బెటర్...’
INDvsAUS Tests: స్వదేశంలో శ్రీలంకపై సిరీస్ నెగ్గిన భారత జట్టు.. తర్వాత న్యూజిలాండ్ పైనా అదే ఫీట్ ను రిపీట్ చేసింది. కివీస్ తో సిరీస్ అనంతరం భారత్.. ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది.
శ్రీలంకతో వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. న్యూజిలాండ్ ను కూడా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తో ఓడించింది. సిరీస్ ఎలాగూ గెలిచాం కావున టీమిండియా ప్రధాన ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రంజీలు ఆడాలని సూచిస్తున్నాడు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్.
రాయ్పూర్ వన్డే ముగిసిన తర్వాత ఈఎస్పీఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు త్వరలోనే భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో కీలక ఆటగాళ్లు రంజీలు ఆడాలని, అలా మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లభిస్తుందని సూచించాడు.
జాఫర్ మాట్లాడుతూ...‘ఫిబ్రవరిలో టీమిండియాకు కీలకమైన బోర్డర్ - గవాస్కర్ సిరీస్ ఉంది. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ (రోహిత్, కోహ్లీ) రంజీలు ఆడాలి. ఇటీవల కాలంలో వీళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడినంతగా రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు. దీంతో వాళ్లకు కచ్చితంగా మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి. రంజీలలో అది కావాల్సినంత దొరుకుతుంది..
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు ముందు రంజీలలో ఆడితే అది రోహిత్, కోహ్లీలకు తొలి టెస్టుకు రెడీగా ఉండటానికి గొప్పగా ఉపకరిస్తుంది. అలాకాకుండా నేరుగా టెస్టు మ్యాచ్ లో బరిలోకి దిగితే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ పోరు కోణంలో చూస్తే ఈ సిరీస్ ఇండియాకు చాలా కీలకం.
రోహిత్, కోహ్లీలు ఎలాగూ టీ20 జట్టులో సెలక్ట్ కాలేదు. ఇప్పటికే న్యూజిలాండ్ తో సిరీస్ కూడా గెలిచాం. మరో వన్డే నామమాత్రమే. కావున వీళ్లు వీలైనంత త్వరగా జట్టును వీడి రంజీలలో ఆడితే అది భారత్ కు మేలు చేసేది అవుతుంది... వీళ్లిద్దరితో పాటు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు ఎంపికైన కెఎస్ భరత్ ను కూడా కివీస్ తో వన్డే సిరీస్ నుంచి రిలీజ్ చేయాలి. ఎలాగూ అతడికి అవకాశాలు ఇవ్వడంలేదు. ఆస్ట్రేలియాతో తొల టెస్టుకు ముందు ఒక్క రంజీ మ్యాచ్ ఆడినా అది వారికి చాలా ఉపయోగపడుతుంది..’ అని అన్నాడు.
కాగా భారత జట్టు సారథి రోహిత్ శర్మ టెస్టు మ్యాచ్ ఆడి దాదాపు పది నెలల పైనే అయింది. గతేడాది శ్రీలంకతో స్వదేశంలో జరిగిన మ్యాచ్ లే రోహిత్ చివరిగా ఆడిన టెస్టు మ్యాచ్. ఆ తర్వాత భారత్.. ఇంగ్లాండ్ తో ఓ టెస్టు, బంగ్లాదేశ్ తో రెండు టెస్టులు ఆడింది. ఇంగ్లాండ్ తో టెస్టుకు ముందు కరోనా బారిన పడ్డ హిట్ మ్యాన్.. బంగ్లాతో టెస్టు సిరీస్ కు ముందు గాయపడ్డాడు. కానీ కోహ్లీ మాత్రం ఈ రెండు టెస్టు సిరీస్ లలోనూ ఉన్నాడు.