జింబాబ్వే టూర్కి హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్... ఆ పనిలో బిజీగా రాహుల్ ద్రావిడ్...
ఐర్లాండ్ టూర్లో భారత జట్టుకి హెడ్ కోచ్గా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్కి మరోసారి కోచింగ్ బాధ్యతలను అప్పగించింది బీసీసీఐ. జింబాబ్వే టూర్లో భారత జట్టుకి హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్కి బాధ్యతలు అప్పగించినట్టు ప్రకటించాడు బీసీసీఐ సెక్రటరీ జై షా..
జింబాబ్వే పర్యటనలో జూలై 18 నుంచి 22 వరకూ మూడు వన్డే మ్యాచుల సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఇప్పటికే ఈ సిరీస్ కోసం జింబాబ్వేకి బయలుదేరి వెళ్లింది టీమిండియా...
తొలుత ఈ సిరీస్కి ప్రకటించిన జట్టులో లేని కెఎల్ రాహుల్ ఫిట్నెస్ నిరూపించుకోవడంతో అతన్ని కెప్టెన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దీంతో తొలుత కెప్టెన్గా ప్రకటించిన శిఖర్ ధావన్ని వైస్ కెప్టెన్గా మార్చింది...
ఈ సిరీస్కి హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్తో పాటు ప్రధాన జట్టులోని ప్లేయర్లు అందరూ దూరంగా ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ వంటి కీ ప్లేయర్లందరూ ఆసియా కప్ 2022 టోర్నీకి విశ్రాంతి తీసుకోబోతున్నారు...
Image credit: Getty
ఆసియా కప్ 2022 ప్రిపరేషన్స్ కోసం ముంబై స్పెషల్ క్యాంపు ఏర్పాటు చేయనుంది బీసీసీఐ. ఇందులో రాహుల్ ద్రావిడ్ కోచింగ్లో భారత జట్టు ప్రధాన ప్లేయర్లందరూ పాల్గొంటారు.. జింబాబ్వేతో టూర్కి ఎంపికైన కెఎల్ రాహుల్, దీపక్ హుడా, ఆవేశ్ ఖాన్... నేరుగా యూఏఈకి చేరుకుని, భారత జట్టు క్యాంపులో కలుస్తారు...
‘జింబాబ్వే టూర్లో జరిగే మూడు వన్డేల సిరీస్కి వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తారు. అయితే రాహుల్ ద్రావిడ్కి బ్రేక్ ఇవ్వడం లేదు. ఆయనతో పాటు భారత జట్టు సభ్యులందరూ ఆగస్టు 23న యూఏఈ చేరుకుని ఆసియా కప్లో పాల్గొంటారు.. జింబాబ్వే టూర్ 22న ముగియనుంది. ఒక్క రోజు తేడాలో రెండు సిరీసుల్లో పాల్గొనం కష్టం కాబట్టి జింబాబ్వే టూర్లో వీవీఎస్ కోచ్గా ఉంటారు...’ అంటూ తెలియచేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...